Bhupalpalli Municipal Workers Get Free TB Screening
ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనీ టీబీపై పోరాటం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన టీబీ దినోత్సవంలో మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు.
ప్రభుత్వం టీబీ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యంగా టీబీ రహిత తెలంగాణ కోసం మన జిల్లాకు మొబైల్ ఎక్సరే మిషన్ ను అందించడం జరిగిందని అన్నారు. జిల్లా లో టీబీ నిర్మూలనకు 35 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలో మొబైల్ ఎక్సర్ ద్వారా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేపట్టి 6 నెలలు పాటు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. లక్షణాలు గుర్తించిన వ్యక్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు పోషణ కిట్లను సైతం అందించడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో సైనికులని అభినందించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులకు, ఆశా సిబ్బందికి ప్రత్యేకంగా వైద్య శిభిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు
మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య మాట్లాడుతూ క్షయ వ్యాధిసోకిన వ్యక్తులను గుర్తించి వైద్య సేవలు అందించి పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలని తెలిపారు. వైద్యసేవలు అందించే వైద్య సిబ్బంది ప్రజలకు దేవుళ్ళతో సమానమని తెలిపారు.
అనంతరం మొబైల్ ఎక్స్ రే ద్వారా మున్సిపల్ కార్మికుల కు ఛాతీ ఎక్స్ రే తీయు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య సైతం ఎక్స్ రే తీపించు కున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ అప్పం కిషన్, వైద్యులు డా ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
