కమలంలో ఈటెల కల్లోలం!

https://epaper.netidhatri.com/

తెలంగాణ ‘‘బీజేపీ’’ ప్రక్షాళన జరగాలి `ఎపీసోడ్‌ `3

`అందరి ఆరోపణలకు ఊతం.

`బిజేపికి ఈటెలతోనే జరిగిన నష్టం?

`బండి దిగడానికి కారణం?

`నేతలంతా తలో దారి చూసుకోవడానికి పరోక్షం!

`ఈటెల అహం బ్రహ్మాస్మీ అనే రకం?

`అందుకే ఆటలో అరటిపండుగా మిగులుతున్న వైనం.

`నేటిధాత్రి ఏనాడో చెప్పిన నిజం.

`అయినా మారని ఈటెల గుణం.

`ఇప్పుడు చౌరస్తాలో ఈటెల రాజకీయం.

`పెద్దరికం కాళ్ల దన్నుకున్నాడు.

`ఆదుకున్న పార్టీని ఆగం చేశాడు.

`తనకు మాలిన ధర్మంలో తనను తానే ముంచుకున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు ఈటెల రాజేందర్‌ వ్యవహారం బిజేపికి తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పెంచి పోషించిన పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం ఈటలకు అలవాటే అంటున్నారు. తనను తాను అతిగా ఊహించుకొని బిజేపిలో చేరి చక్రం తిప్పుదామనుకున్నాడు. కాని కుదరలేదు. అసలు ఆయన రాజకీయమే కలిసి రాలేదు. ఆదుకున్న పార్టీకి ఈటెల చేసిన మేలు లేదు. నమ్మి ఆయన వెంట వచ్చిన వారి కోసం నిలబడ్డది లేదు. ఇచ్చిన పదవులతో సంతృప్తి చెందలేదు. బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావాలని కలలుగన్నాడు. కలలు కల్లలయ్యేసరికి పార్టీని నిండా ముంచేశాడు. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు బిజేపి కోసం అహర్నిషలు పాటు పడే నాయకులు అంటున్న మాట. ఈటెల వచ్చిన తర్వాత పార్టీకి గ్రహణం పట్టిందని నేతలంటున్న మాట. గతంలోనే నేటి ధాత్రి ఈటెల రాజకీయ భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చెప్పేసింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆనాడే ఈటెల రాజేందర్‌ అంటే ఏమిటో? ఆయన వ్యవహారం ఎలా వుంటుందో అన్నది పూస గుచ్చినట్లు నేటిధాత్రి చెప్పింది. ఎందుకంటే ఆయన రాజకీయం ప్రస్ధానం విద్యార్ధి దశలో ఎర్ర జెండాతో మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను పట్టుకోవడం జరిగింది . ఆ పార్టీలో ఎనలేని గౌరవం దక్కింది. కేసిఆర్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఒక దశలో కేసిఆర్‌ తర్వాత ఈటెల రాజేందరే అన్నంతగా గుర్తింపునిచ్చారు. కాని నిలుపుకోలేదు. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీలోనైనా ఆ పార్టీ అధినేత, ఆ కుటంబాన్ని కాదని ముందుకు దూసుకెళ్లడం అన్నది ఎవరికీ, ఏనాటికి కుదరదు. ప్రాంతీయ పార్టీలలో కుంపట్లు రేగితే తప్ప, మరొకరు నాయకుడు కాలేదు. అయితే కేసిఆర్‌ నాయకత్వంలో నడుస్తున్న బిఆర్‌ఎస్‌లో కలలుగనం ఈటెల చేసిన మొదటి తప్పు. గులాబీ జెండాను తాను కూడా ఓనర్‌నే అనుకోవడంతోనే ఈటెల పతనం మొదలైంది. నిజానికి పార్టీలో వుంటూ, ఏం రాజకీయం చేసినా సాగుతుంది. కాని పార్టీనే కబలిద్దామనుకున్నప్పుడే అసలు రంగు బైట పడుతుంది. రాజకీయం జీవితం సమాధి అవుతుంది. అలాంటి వారు చరిత్రలో చాలా మంది వున్నారు. ఈటెల రాజేందర్‌ కూడా ఆ హిస్టరీలో చేరనున్నారు. చెప్పేవారికి లేకపోయినా వినే వారికి వుండొద్దా? అన్న సామెత ఈటెలకు ఏనాడు గుర్తుకు రానన్నట్లుంది. అందుకే ఈటెల రాజకీయం అతలాకుతలమైంది. ఆఖరుకు బిజేపిలో కూడా తన ప్రాభవం సాగుతుందనుకున్నాడు కాని, తన ప్రాపకమే మిగులుతుందని ఊహించుకోలేకపోయాడు. తన వెంట వచ్చిన వారికి అండగా నిలడలేదు. ఇంత కాలం ఈటెలను నమ్మిన వాళ్లు కూడా నమ్మకుండా చేసుకున్నాడు. బిజేపిలో కూడా నమ్మకం కోల్పోయాడు. ఎటూ వెళ్లలేక, వెళ్లేందుకు దారి లేక, వెళ్లినా ఎవరూ దగ్గర తీసే అవకాశం లేక, విధిలేక బిజేపిలో సాగుతున్నాడే గాని, అవకాశం వస్తే జంప్‌ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు.
కమలంలో ఈటెల అల్లకల్లోలం రేపాడన్నది ఆ పార్టీలో అందరూ అంటున్న మాటే.

ఈ విషయాన్ని ఏ ఒక్కరూ మనసులో దాచుకోలేదు. విజయశాంతి లాంటి వాళ్లు మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశారు. తాము పార్టీ వీడడానికి కారణం ఈటెల లాంటి వారే అంటూ స్పష్టంగా చెప్పేశారు. నిజానికి బిజేపిని ఒక ఊపులోకి తీసుకొచ్చింది బండి సంజయ్‌. ఆయన ఎంపి అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడుగా వచ్చిన అవకాశంతో పార్టీకి బలమైన పునాదులే వేశాడని చెప్పాలి. అప్పటి వరకు బిజేపి అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడేవారే జెండా మోస్తారు అన్న అభిప్రాయం వుండేది. కాని ఇప్పుడు దేశంకోసం, ధర్మంకోసం నిలబడే పార్టీ అని అందరూ గుర్తిస్తున్నారు. బిజేపికి జై కొడుతున్నారు. ముఖ్యంగా పెద్దఎత్తున యువత బిజేపిని ఆదరిస్తున్నారు. బిజేపి సిద్దాంతాల వైపు ఆకర్షితులౌతున్నారు. ఆ పార్టీ జెండాను మోస్తున్నారు. గుండెల నిండా బిజేపిని నింపుకుంటున్నారు. తెలంగాణలో బిజేపి మరింత బపడేందుకు బండి సంజయ్‌ లాంటి నాయకులు చేసిన ప్రచారం కూడా ఎంతో ఉపకరించింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్‌ అధికారికంగా బిజేపి అభ్యర్ధిగా పోటీ చేసినా, ఆ గెలుపు తన వ్యక్తిగత ఖాతాలోనే వేసుకున్నారు. ఆ ఎన్నికల సమయంలో బిజేపి నేతలతో కలిసి పెద్దగా ప్రచారం చేయలేదు. మొత్తంగా ఆ గెలుపుకు బిజేపికి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అదిష్టానం ముందు తాను బలమైన నేతగా గుర్తింపు పొందాలని తాపత్రయపడ్డాడు. అయితే తెలంగాణలో బిజేపి బలమైన పార్టీగా అవతరిస్తున్న సమయంలో వచ్చిన ఈటెల రాజేందర్‌ ఆ బలం తన వల్ల అన్నది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. తెలంగాణలో పార్టీ బలపడాలంటే బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుంటే మరింత నష్టమే అన్నది పదే పదే అదిష్టానం చెవిలో ఊదుతూ వచ్చాడు? అన్నది అందరూ చెప్పుకుంటున్నదే. ఎప్పుడైతే బండిని పక్కన పెట్టారో అప్పటి నుంచి తెలంగాణలో బిజేపి గ్రాఫ్‌ పడిపోయింది. గత శాసన సభ ఎన్నికల్లో తనకంటేపార్టీలో బలమైన నేత లేడన్నట్లు తనను తాను అతిగా ఊహించుకున్న ఈటెల ఏకంగా కేసిఆర్‌ మీద పోటీ చేశాడు. హుజూరాబాద్‌లోనూ బరిలో నిలిచి రెంటికీ చెడ్డ రేవడి అయ్యాడు. ఈ విషయాన్ని కూడా నేటిధాత్రి రెండేళ్ల క్రితం చెప్పింది. ఈటెల రాజేందర్‌ భవిష్యత్తులో హుజూరాబాద్‌ను వదులుకునేందుకు కూడా వెనుకాడడన్న మాట నేటిద్రాత్రి చెప్పడం జరిగింది. అది కూడా అక్షరాల నిజమైంది. ఈటెలను నమ్మి కేసిఆర్‌ పదవులు ఇచ్చినంత కాలం ఈటెల పెరిగాడు. కాని ఈటెల తన వల్లే బిఆర్‌ఎస్‌ పెరిగిందన్న అపోహలో రాజకీయం చేశాడు. తనకొంప తానే ముంచుకున్నాడు. అయినా మార్పు రాలేదు.

పార్లమెంటు ఎన్నికలపై దృష్టిపెట్టిన ఈటెలరాజేందర్‌ కోరికలకు హద్దూ బద్దూ లేకుండపోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట్లో ఈటెల మెదక్‌ నుంచిపోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కాని అక్కడి నుంచి గతంలో ఓసారి పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ వున్నాడు. లోకసభ ఎన్నికల్లో అక్కడ రఘునందన్‌కు తలనొప్పిగా మారాడు. గత కొంత కాలంగా ఈటెల కరీంనగర్‌ నుంచి పోటీ చేయాలనకుంటున్నాడన్న వార్తలు వచ్చాయి. అక్కడ కొన్ని దశాబ్దాలుగా తన కోటను నిర్మించుకుంటూ వచ్చి, తెలంగాణలోనే బిజేపిని బలమైన పార్టీగా తయారు చేసిన బండి సంజయ్‌నే పక్కకు తప్పించే ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ రెండు చోట్ల సీటు దక్కకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత చెవెళ్ల మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వరరెడ్డి సీటు కావలని కోరినట్లు సమాచారం . అక్కడ కూడా ఈటెలను రానిచ్చే పరిస్దితి లేదు. ఇక ఈ మధ్య కాలంలో కొన్ని సుద్దులు చెప్పడం మొదలుపెట్టారు. పార్టీ మారాలనుకునే వారు తన మాతృ సంస్ధను వదిలి వెళ్లొద్దని ఇతరులకు గీతోపదేశం చేస్తున్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి అవేవో చేతలు అన్నట్లు. ఈటెల రాజేందర్‌ కూడా నీతి,నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడని గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా తనకు మల్కాజిగిరి సీటు కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. నిజానికి ఈటెల రాజేందర్‌ బిజేపి లోకి వెళ్లడానికి ముందే పార్టీ ఎంతో బలపడిరది. వివేక్‌ వెంటస్వామి లాంటి వారు తన మీడియా ద్వారా బిజేపికి ఎంతో కొంత మేలు చేశారు. ఈటెల రాజేందర్‌ ఉప ఎన్నికల సమయంలో కూడా ఆర్ధికంగా ఉపయోగపడ్డట్టు కూడా తెలిసిందే. అలాంటి నాయకుడు కూడా బిజేపిని వీడేందుకు కారణం ఈటెల రాజేందరే అన్న అభిప్రాయంచాలా మందిలో వుంది. ఇలా బిజేపిని వీడేవారిని ఎవరినీ ఆపలేదు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయన ఎవరినీ చేర్చుకున్నది లేదు. అధ్యక్షుడితో సఖ్యత కనబర్చింది లేదు. దాంతో అగ్రనాయకులంతా తలో దారిలాగా మారడానికి ఈటెల వ్యవహరమే కారణమనే ఆరోపణలు అనేకం వున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రేగిన వివాదంలో ఈటెల నుద్దేశించి కిషన్‌రెడ్డి వాడు వుంటే ఎంతపోతే ఎంత అన్న ఆలోచనకు వచ్చినప్పుడే ఈటెలను పక్కన పెడితే బాగుండేది. ఇప్పటికైనా మించి పోయింది లేదన్నది గుర్తిస్తే మేలు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *