గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక..నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలవారీగా చేపట్టి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారన్నారు. ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం వహిస్తూ..సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. పెండింగ్ బిల్లుల విషయమై ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!