ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్.!?
కేంద్రం రిస్క్ తీసుకుంటుందా?
లోక్సభ స్థానాల పెంపుపై ప్రతిపక్షాలు బ్రేకులు వేసినా.. కేంద్రం మాత్రం తగ్గేదేలే అంటోంది! ఆరు నెలల్లో కొత్త బిల్లు తెచ్చేందుకు మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే దేశం మొత్తం సంగతి పక్కన పెడితే.. ఏపీ, తెలంగాణల విషయంలో సీన్ ఇంట్రెస్టింగ్గా మారింది! ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జనగణన తర్వాత తెలుగు స్టేట్స్లో డీలిమిటేషన్ చేస్తారని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్ర విభజన హామీ! మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్లతో సంబంధం లేకుండానే తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరగాలని సుప్రీం తీర్పులు చెబుతున్నాయి. 2026 తర్వాత జనగణన లెక్కలు వస్తే.. 2028 నాటికి కొత్త నియోజకవర్గాలు రెడీ అయిపోతాయి!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఫుల్ హోప్స్తో ఉంది. అదనంగా వచ్చే 50 సీట్లు వస్తే.. టికెట్ల సర్దుబాటు ఈజీ! గత ఎన్నికల్లో టికెట్ల కోసం కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లకి, అసంతృప్తులకు ఇది పెద్ద ఊరట. మరోవైపు విపక్ష వైసీపీకి ఇది అగ్నిపరీక్షే! ఉన్న 175 సీట్లలోనే గట్టి అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతుంటే.. సీట్లు పెరిగితే అభ్యర్థులను ఎక్కడి నుంచి తెస్తారు? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఇది అడ్వాంటేజ్గా మారబోతోంది
అదనంగా వచ్చే 34 సీట్లు వస్తే.. ఆశావహులందరికీ టికెట్లు ఇచ్చి అసంతృప్త జ్వాలలను చల్లార్చవచ్చని రేవంత్ టీమ్ భావిస్తోంది!
ఇప్పటికే ఎమ్మెల్యేల వలసలతో సతమతమవుతున్న గులాబీ పార్టీకి.. సీట్లు పెరిగితే అభ్యర్థుల వేటలో అపసోపాలు పడక తప్పదా? ఉన్నవాళ్లను కాపాడుకోవడమే కష్టమైన వేళ.. కొత్త స్థానాల్లో పాగా వేయడం ఎలా? ఎలాగైనా తెలంగాణ గడ్డపై జెండా పాతాలని చూస్తున్న కాషాయ దళానికి.. డీలిమిటేషన్ పెద్ద వరంలా మారుతుందా?
మొత్తానికి సీట్లు పెరిగితే కొత్త ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తారు సరే.. కానీ ఈ పునర్విభజన వల్ల ఎవరి రాజకీయ భవిష్యత్తు మారుతుందో, ఎవరి సీటు గల్లంతవుతుందో చూడాలి!
