కాపువాడతో మాకుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది
బిఆర్ఎస్ బిజెపిలకు ఓట్లు వేస్తే వృధాయే
ప్రజల వెన్నంటే ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే – వెలిచాల రాజేందర్ రావు
35వ డివిజన్లో బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిన దుగ్గు మహేందర్ నిహారిక
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ ప్రజలంతా మాకుటుంబ సభ్యులేనని ప్రజలంతా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలంతా తమ కుటుంబమని వారికి సేవ చేసేందుకు అహర్నిశలు పాటు పడుతున్నానని తెలిపారు. శుక్రవారం కరీంనగర్లోని 35వ డివిజన్ కు చెందిన దుగ్గు మహేందర్ హారిక బిజెపి నుంచి రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెలిచాల రాజేందర్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ఓటు వేస్తే మురిగిపోతుందని పేర్కొన్నారు. పదేండ్ల కాలం పాటు కార్పొరేషన్ లో పాలన సాగించిన బీఆర్ఎస్ కరీంనగర్ ను అద్వానస్థితికి చేర్చిందని మండిపడ్డారు. రోడ్లు డ్రైనేజీలు పార్కులు మౌలిక వసతుల కల్పనను పట్టించుకోలేదని భూకబ్జాలు మాత్రం యదేచ్చగా నిర్వహించారని ఆరోపించారు. టిఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలు దోపిడీలు భూకబ్జాలు చేయడంలో ఆరితేరారని మండిపడ్డారు. పాతవారికి ఛాన్స్ ఇవ్వద్దని కొత్తవారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మరింత అవినీతి పెచ్చు మీరుతోందని కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గల్లీలో రోడ్లు డ్రైనేజీలు తాగునీరు పారిశుద్ధ్యం రెవెన్యూ పరంగా పోలీస్ పరంగా ఏపని కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరుతుందని తెలిపారు. కాపు వాడతో దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఆత్మీయత ఉందని మాతండ్రి జగపతిరావుతో పాటు తనకు కాపువాడతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి మా తండ్రి జగపతిరావు ఎంతో కృషి చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో కాపు వాడ అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజల వెన్నంటే ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేందర్రావు కోరారు. ఢిల్లీలో ఉండే బిజెపికి గల్లీలతో సంబంధం లేదని ఇక్కడి ఇష్యూలతోని కూడా బిజెపికి అవసరం లేదన్నారు. కరీంనగర్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని వారిని కడుపులో పెట్టుకుంటామని రాజేందర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బృహత్తరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కంకణం కట్టుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆకుల ఉదయ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతలు మున్నూరుకాపు సంఘం నాయకులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
