కాంగ్రెస్‌కు మూడోసారి భంగపాటు తప్పదు

`కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

`కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!!

`రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే…

`కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!

`బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ!

`నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు.

`ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

`ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు.

`గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు.

`టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు.

`బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

`తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.

`ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.

`జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు.

`ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు.

` కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. రేవంత్‌ ను నమ్ముకున్న కాంగ్రెస్‌ కు దక్కేది రెవడే..మిగిలేవి పగటి కలలే. తెలంగాణ ఆత్మాభిమానంపై కాంగ్రెస్‌ ఏనాడో దెబ్బ కొట్టింది. ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్సే తెలంగాణ ను ముంచింది. తెలంగాణ ఉద్యమానికి కనీసం సంబంధం లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తామనుకోవడం అంటేనే ఆ పార్టీ నిజ స్వరూపం అర్థమౌతోంది. అంతే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కొన్ని సత్యాలు తెలియాల్సి వుంది. 2014 ఎన్నికలలో ఆంద్రప్రదేశ్‌ లో ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. తెలంగాణకొచ్చి రాష్ట్రం ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత తీర్చుకోండి అన్నట్లు మాట్లాడాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే మా పని అయిపొయింది. తెలంగాణ కు ఏమీ ఇవ్వాల్సిన పని లేదని తేల్చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం అన్నది ఇక ఎప్పుడూ జరగదు. ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరు క్షణం ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్‌ చెబుతోంది. అసలు అరవై ఏళ్లపాటు గోస పడిరదే తెలంగాణ. బాగుపడిరదే ఆంద్రప్రదేశ్‌. తెలంగాణ వస్తే అంధకారమౌతుంది. అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. మేం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అసలు తెలంగాణ నాయకులకు పాలన చేయడం కూడా రాదు. తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రాని తెలంగాణ భూములని ఎగతాళి చేశారు. తెలంగాణ కు అన్నం పెడుతున్నదే మేమన్నారు. విడిపోయి తెలంగాణ నష్టపోకూడదనే చెబుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో విడిపోయి నష్టపోయామంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేని కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మతారని ఎలా అనుకుంటున్నారు. పగటి కలలు ఎందుకు కంటున్నారు. ముందు తెలంగాణ ను ప్రేమించడం కాంగ్రెస్‌ నేతలు నేర్చుకోవాలొలి. కేవలం అదికార యావ తప్ప తెలంగాణ మీద కాంగ్రెస్‌ కు ఎలాంటి మమకారం లేదు. తెలంగాణ ఇచ్చామన్న కృతజ్ఞత తీర్చుకోవాలన్న అహంకారంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం రెండు రాష్ట్రాలు కలుపుతామని కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే నిండా మునిగినట్లే అన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పదేళ్లయినా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మేందుకు సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ పథకాల ప్రచారం అంతా పెద్ద డ్రామా… అంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ మోసాలు ఎలా వుంటాయో వివరించారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారంలోకి రావడం కోసం 2014 లో చంద్రబాబు చెప్పివన్నీ అబద్దాలే అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అబద్దాలు చెప్పి నమ్మించడం తప్ప ప్రజలను నిజాలతో నమ్మించలేమని స్వయంగా రేవంత్‌ రెడ్డే అన్నారు. కావాలంటే ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డి చెప్పిన వీడియో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ కన్నా రేవంత్‌ కు ఎక్కువ ఆశగా వుంది. అసలు తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్‌ నే నమ్మడం లేదు. అలాంటిది రేవంత్‌ ను నమ్మి ఓట్లు వేయడం అన్నది కల. కలగంటే కూడా తీరని కోరిక. గత ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ లో వున్న వాళ్లే కాంగ్రెస్‌ పని అయిపోయింది అని చెప్పిన సందర్భం వుంది. కేవలం కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ ఊపుకొచ్చిందన్న ఊహల్లో విహరిస్తున్నారు. అసలు విషయం దాచి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి పదిహేను సంవత్సరాలౌతుంది. రెండు సార్లు బిజేపి స్వంత మెజారిటీతో కర్నాటక లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూడమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ బిజేపి కాంగ్రెస్‌ ను చీల్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. పైగా బిజేపి పార్టీ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటి అని ప్రజలకు తెలిసిపోయింది. దాంతో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ ను మోసం చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు బాగా ప్రభావం చూపాయి. బిజేపి కర్నాటక ఆత్మ గౌరవంతో ఆడుకున్నది. ఎలాగైనా గుజరాత్‌ కు అమూల్‌ పెరుగును కర్నాటక ప్రజల మీద రుద్దాలనుకున్నారు. కర్నాటక లో పేరు మోసిన పెరుగు కంపనీని అమూల్‌ లో విలీనం చేయాలనుకున్నారు. దానికి తోడు పెరుగు పేర కన్నడం లో కాకుండా కేవలం హిందీలో రాయాలని కేంద్రం నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పెరుగు ప్యాకెట్ల మీద హిందీ బాషను మాత్రమే ప్రింట్‌ చేయాలని ఒత్తిడి ని దేశ ప్రజలతో పాటు కర్నాటక ప్రజలు కూడా తిరస్కరించారు. బలవంతంగా హిందిని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడమే అవుతుందని కర్నాటక బిజేపి మీద కన్నెర్ర చేసింది. బిజేపిని కాదని, కాంగ్రెస్‌ కు కర్నాటక ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్‌ కొన్ని అలవికానీ హామీలను గుప్పించడం కూడా సీట్లు పెరగడానికి కారణమైంది. అంతే తప్ప కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కర్నాటక లో అధికారం సిద్దించలేదు. కర్నాటక లో బిజేపి ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. పైగా బిజేపి మళ్ళీ అధికారంలోకి తెచ్చినా తనకు పెద్ద ప్రాధాన్యత లభించకపోవచ్చని యడ్యూరప్ప సైలెంట్‌ గా వుండడం కూడా బిజేపి కి మైనస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ కు అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇదీ అసలు ముచ్చట.
కాంగ్రెస్‌ వన్నీ కోతలే! కాంగ్రెస్‌ చెప్పే విషయాలు నమ్మశక్యమైనవి కాదు.
గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఏదైనా ఒక విధానం తీసుకుంటే అది అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. తెలంగాణ తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అన్నది చెప్పాలి. ఇప్పటికే అధికారంలో వున్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. అధికారంలో వున్న రాష్ట్రాలలో అమలు చేయకుండా ఎందుకున్నారు.
హస్తమంతా రిక్తమే!! అంతే అంతా ఉత్తదే. కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!
కర్నాటక లో ప్రకటించిన ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదు. కర్నాటక లో అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా అక్కడ సిలిండర్‌ రూ. 500కు సిలిండర్‌ ఇచ్చింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హెల్త్‌ స్కీమ్‌ లేదు. ఇందిరమ్మ ఇండ్లు కర్నాటక లో లేదు. జాగాలున్న వారికి రూ. 5 లక్షల పథకం లేనే లేదు. రైతులకు రైతుబందు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కానీ తెలంగాణ లో మాత్రమే ఇస్తారట. నిన్నటి దాకా తెలంగాణ అప్పుల రాష్ట్రం అన్నారు. జీతాలకే పైసలు లేవన్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నిజాయితీ వుండాలి. ఇంత కాలం తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక్కసారైనా అని వుంటే బాగుండేది. పూరి గుడిసెలో ఏసి ఫిట్‌ చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ చెప్పింది అలాగే వుంది. తెలంగాణ లో ఆదాయం అప్పలకే సరిపోతుందన్న వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే జనం నమ్ముతారా?
బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు నిశితంగా పరిశీలిస్తే కొత్తగా వాళ్లు చెబుతున్నది ఏమీ లేదు?
ఎందుకంటే వాళ్లు వచ్చేది లేదు. ఇచ్చేది లేదు. అందుకే నోటికొచ్చిన హామీలిస్తున్నారు.ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాగా తెలుసు. గెలిచేది లేదన్నది సీనియర్‌ నేతలందరికీ నాయకులకు తెలుసు. ఓ వైపు టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తున్నవే. కేవలం డబ్బులు వున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్న మాటలే. టిక్కెట్ల పేరుతో రేవంత్‌ రెడ్డి సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఇది తెలిసే సీనియర్లు గుర్రుగా వున్నారు. పైగా బైట నుంచి ఎవరొస్తారా? టిక్కెట్లు అమ్ముకుందామా? దుకాణం నడుస్తోంది. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. ముచ్చట మూడో సారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం. తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు. ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. మూడోసారి భంగపాటు తప్పదు. కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు. కేవలం తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నమ్మడం లేదు. తెలంగాణ కోసం ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో కలిసి పద్నాలుగేళ్లు కొట్లాడి సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన రేవంత్‌ ను కాంగ్రెస్‌ నేతలు నమ్మినా ప్రజలు జీవితంలో నమ్మరు. రేవంత్‌ రెడ్డి వున్న కాంగ్రెస్‌ కు ఓటు కూడా వేయరు. రేవంత్‌ సృష్టిస్తున్న అబద్దాల మాయా మశ్చీంద్రను జనం అసలే నమ్మరు. తన సొంత నియోజకవర్గ ప్రజలే తెలంగాణ విషయంలో రేవంత్‌ చేసిన పాడు పనికి చీ కొట్టి ఓడిరచారు. ఇక తెలంగాణ ప్రజలు నమ్మడం అనే కల్ల. కాంగ్రెస్‌ పథకాలన్నీ డొల్ల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *