Collector
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
