`ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు స్కూళ్లు
`లక్షలకు లక్షల ఫీజులు వసూలు
`పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కూళ్లు
`తెలంగాణలో ప్రతి ఏటా కొన్ని వేల కొత్త స్కూళ్లు
`బ్రాంచీల మీద బ్రాంచీలతో కార్పొరేట్ స్కూళ్లు
`అరకొర సౌకర్యాలు.. గాలి కూడ ఆడని గదులు
`మూడు నాలుగు అంతస్తుల భవనాలు
`పిల్లలను గొర్రెల మందల్లా కుక్కేస్తున్నారు
`ప్లే గ్రౌండ్లకు దిక్కు లేదు
`ప్రశాంతమైన వాతావరణం అసలే వుండదు
`హైదరాబాదు తో పాటు శివారు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో వెలుస్తున్న స్కూళ్లు
`జిల్లాలు, మండలాలు, గ్రామాలలో కూడా అనేక ప్రైవేటు స్కూళ్లు
`ఇబ్బడి ముబ్బడిగా ప్లే స్కూళ్లు
`ఉద్యోగాలు చేసుకునే వారి పిల్లల కోసం పెద్ద ఎత్తున ప్లే స్కూళ్లు
`గల్లీ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు
`కార్పొరేట్ స్కూళ్లలో లక్షలకు లక్షలు వసూలు
`జనవరి నుంచే కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు
`వేలకు వేలు అడ్వాన్సులు…ట్యూషన్ ఫీజులు
`అకాడమిక్ ఇయర్ పూర్తి కాకుండానే దోపిడీ మొదలు
`ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా అడ్మిషన్ల జోరు
`ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే కొంత తగ్గింపు
`ఇప్పుడున్న ఫీజులు తర్వాత పెరగొచ్చు
`ఆలస్యం చేస్తే సీట్లే దొరక్కపోవచ్చు
`ఇవీ ప్రైవేటు స్కూళ్లు సాగిస్తున్న ప్రకటనలు
`విద్యా శాఖ అధికారుల అలసత్వం
`ప్రైవేటు స్కూళ్లపై కరువైన నియంత్రణ
`కార్పొరేట్ స్కూళ్లలో కూడా కనీస శిక్షణ లేని టీచర్లే ఎక్కువ
`తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డూ అదుపు లేదు
హైదరాబాద్,నేటిధాత్రి:
అవి బడులా బందెల దొడ్లా! హైదరాబాద్ నుంచి మొదలుపెడితే, ఆఖరుకు పల్లెల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు స్కూళ్లు ఎలా వుంటున్నాయో అధికారులు చూస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? పర్వవేక్షిస్తున్నారా? అధికారుల పర్మిషన్లతోనే ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారా? అధికారులను లెక్క చేయకుండానే పుట్డుకొస్తున్నాయా? ఎక్కడిక్కడ వెలుస్తున్న ప్రైవేటు బడులు ఎలా వుంటున్నాయో, వున్నాయో పర్వవేక్షించిన తర్వాతనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి సౌకర్యాలు వుండాలో స్పష్టమైన లెక్కలున్నాయి. చట్టంలో సూచించబడ్డాయి. స్కూల్ ఎలాంటి వాతావరణంలో వుండాలో కూడా నిర్థిష్టంగా చెప్పబడి వుంది. అసలు పాఠశాల భవనం ఎలా వుండాలో స్పష్టంగా చట్టంలో సూచించడం జరిగింది. ప్రతి స్కూల్ విశాలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అర్థ చంద్రాకారాపు ఆకారంలో భవన నిర్మాణం వుండాలి. గాలి వెలుతురు దారాలంగా రావాలి. ఒక తరగతి ఎలా డిజైన్ చేయాలో చెప్పబడి వుంది. ఒక తరగతిలో ఎంత మంది విద్యార్థులు వుండాలో కూడా విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా రాసి వుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఈ సౌకర్యాలు కలిగి నిర్మాణం చేసి వున్నాయి. మరి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఇలాంటి వాతావరణ పరిస్థితులలో నిర్మాణాలున్నాయా? ఆ మౌలిక సదుపాయాలు ఎన్ని ప్రైవేటు స్కూళ్లలో వున్నాయి? ఈ విషయాలు ఏ అధికారులన్నా పట్టించుకుంటున్నారా? ఆ చట్టం అమలు చేస్తున్నారా? చట్ట ప్రకారం నిర్మాణంలో లేని స్కూళ్ల అనుమతులు రద్దు చేశారా? చేస్తున్నారా? విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే తెలంగాణలో వున్న ప్రైవేటు స్కూళ్లలో కనీసం ఎనభై శాతానికి పైగా స్కూళ్లు మూసివేయబడతాయి. హైదరాబాదులో తొంభై ఐదు శాతం ప్రైవేటు స్కూళ్లు మూసివేయొచ్చు. కానీ అధికారులు కదులుతున్నారా? చర్యలు తీసుకోగలరా? ఆ ఉదాసీనత ఎవరిది? ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఆ అలసత్వానికి బాధ్యులెవరు? ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులున్నారు. జిల్లా, మండల స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరి వాళ్లంతా ఏం చేస్తున్నారు. ఇకపోతే అలాంటి స్కూళ్ల దోపిడీ గురించి రాస్తే రామాయణం అవుతుంది. ప్రైవేట్ స్కూళ్లు అప్పుడే అడ్మిషన్ల దుకాణాలు తెరిచాయి! ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాలేదు. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితాలు ప్రకటించలేదు. వేసవి సెలవులు ఇవ్వలేదు. కానీ కొత్త అకాడమీ అడ్మిషన్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఆలోచించిన ఆశా భంగం అన్నట్లు సీట్లు నిండిపోతున్నాయంటూ ప్రచారం సాగిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ల నుంచి చిన్నా చితకా స్కూళ్లలో పరీక్షల కోలాహలం కన్నా అడ్మిషన్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. స్కూళ్ల ముందు జాతర తలపిస్తోంది. ప్రతి రోజు ప్రైవేటు స్కూళ్ల ముందు వందల సంఖ్యలో వాహనాలు. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు. అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. గతంలో కొత్త అకాడమీ ఇయర్ మొదలైన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ సాగేది. కొంత కాలానికి వేసవి సెలవులలో అడ్మిషన్లు సాగించే వారు. ఇప్పుడు ఏకంగా జనవరి నెలలోనే స్కూళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్మిషన్లు మొదలుపెడుతున్నారు. వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పిల్ల పుట్టక ముందే కుళ్ల కుట్టి పెట్టుకున్నట్లు అడ్మిషన్లతోనే పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్, షూజులు, బ్యాచులు, టిఫిన్ బాక్స్లు, ఇతర అన్ని రకాల వస్తువులు అడ్మిషన్ల నాడే తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. ఇంతటి దుర్మార్గం గతంలో పెద్దగా కనిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. పేద ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద స్కూళ్లకు దీటుగా ఫీజులు ఇష్టానుసారం వసూలు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం వెనుకబడి వుంటున్నాయి. నిబంధనలు గాలికి వదిలేస్తున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లు అనేకం వున్నాయి. అధికారులు కనీస తనిఖీలు నిర్వహించింది లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎన్ని అనుమతులున్న ప్రైవేటు స్కూళ్లు వున్నాయో, అనుమతులు లేనివి ఎన్ని వున్నాయో కనీస సమాచారం కూడా వారి వద్ద పూర్తి స్థాయిలో లేదని తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు, ఎక్కడ పడితే అక్కడ ఏటా కొత్త కొత్త స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక అనేక కార్పొరేట్ స్కూళ్లు బ్రాంచీల మీద బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. అటు కార్పొరేట్ స్కూళ్లు గాని, ఇటు చిన్నా చితకా స్కూళ్లలలో వసతుల లేమితోనే నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులు. సరైన మార్గం లేకుండా చిన్న చిన్న బిల్డింగ్ లలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చాలా స్కూళ్లలో ఆట స్థలం వుండదు. కనీసం ప్రేయర్ చేయించడానికి సైతం స్థలం లేని స్కూళ్లే అధికం. ఇక బోధన విషయానికి వస్తే మాత్రం నిపుణులైన అద్యాపకులు ఎక్కడా కనిపించరు. అరకొర చదువులు వదిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. పిల్లల నుంచి మాత్రం భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ఒక స్కూల్లో ఉపాధ్యాయుడి నియామకం జరగాలంటే కనీస అర్హతలు నిర్థారించి వుంది. ప్రైమరీ స్కూల్ అయితే కచ్చితంగా టిటిసి చేసి వుండాలి. హై స్కూల్ అయితే బిఈడీ పూర్తి చేసి, టెట్ కూడా పాస్ అయి వుండాలి. ఎందుకంటే టీచర్ అనగానే పాఠాలు చెప్పడం మాత్రమే వస్తే సరిపోదు. టీచర్ అంటే కనీసం అర్థం, అవగాహన లేని వాళ్లు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రైయిన్డ్ టీచర్ అయితే బిఈడీ, టిటిసిలలో విద్యార్థుల మానసిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తారు. విద్యార్థుల మానసిక సామర్ధ్యాలపై పూర్తి ట్రైనింగ్ టీచర్ల అవగాహనతో వుంటారు. చైల్డ్ సైకాలజీ చదువుకొని వుంటారు. చైల్డ్ మెధడాలజీపై పట్డున్నవారుంటారు. ఏ విద్యార్థికి ఎలా పాఠం చెబితే అర్థం చేసుకోగలరన్న దానిపై పూర్తి జ్ఞానంతో వుంటారు. అంతే గాని స్కూళ్లను బందర దొడ్డిలా మార్చి గుంపంతటికీ ఒకేలా పాఠం చెబితే అందరూ అర్థం చేసుకోలేరు. ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలకు ఎలా పాఠం చెప్పాలి. ఎలాంటి అవగాహన తో వారికి పాఠం బోధించాలన్నది కేవలం ట్రైన్డ్ టీచర్లకు మాత్రమే తెలుస్తుంది. చాలా మంది పిల్లల ఎంతో సెన్సిటివ్ గా వుంటారు. అలాంటి వారికి అర్థమయ్యే తరహాలో సబ్జెక్టు చెప్పడంలో శిక్షణ పొందిన అద్యాపకులకే సాధ్యమౌతుంది. అందువల్ల ప్రైవేటు స్కూళ్లు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలల నిర్వహణ మూలంగా ఇటీవల కొంత మంది విద్యార్థులు చనిపోయిన ఘటనలున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతలను మిగిల్చుతున్నాయి. ఇక ఇటీవల స్కూళ్లతో పాటు ప్లే స్కూల్స్ కూడా విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం వంటి పరిస్థితులు వున్నవారు ఎక్కువగా తమ పిల్లల్ని ప్లే స్కూళ్లలలో జాయిన్ చేస్తున్నారు. కాస్త అడుగులు వేయడం వచ్చే పిల్లల్ని కూడా ఇలాంటి స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మార్కెట్ లో ఒక వ్యాపారమైపోయింది. ఇంట్లో తమ పిల్లల్ని చూసుకునే తీరిక, వీలు, ఓపిక లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులకు అప్పగిస్తున్నారు. వందల మందికి ఐదారుగులు మహిళా టీచర్లు, ముగ్గురు నలుగురు ఆయాలతో వాటిని నిర్వహిస్తుంటారు. వాళ్లు ఏ మాత్రం అలసత్వం వహించినా పిల్లల పరిస్థితి ఎలా వుంటుందని ఏ ఒక్క తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తల్లిదండ్రులు ఇలా వుండడం వల్ల విచ్చలవిడిగా ప్లే స్కూళ్లు వెలుస్తున్నాయి. కానీ అధికారులు పర్యవేక్షణ లేదు. సందర్శన అసలే లేదు. నియంత్రణ అన్నది కనుచూపు మేరలో లేదు.