పార్టీ పరువు తీస్తున్న ప్రబుద్దులు?

`ఏ సంఘటన జరిగినా టిఆర్‌ఎస్‌ కే ముడి?

`అందరూ కండువాలు కప్పుకోవడంతోనే ఈ చిక్కుముడి?

`పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించండి?

`జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు ఏం చేస్తున్నాయి?

 

`ఏ ఘటనలోనైనా కనిపించేది ఇతర పార్టీల నుంచి నేతలే…?

` టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నావారే?

`పార్టీ పరువు తీస్తున్నారు?

`ప్రజల్లో చులకన చేస్తున్నారు?

`సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు?

`పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు?

`వాళ్లంతా టిఆర్‌ఎస్‌ అన్న ప్రచారం విసృతంగా ప్రజల్లోకి పంపుతున్నారు?

`జిల్లా విభాగాలు, మండల విభాగాల పర్యవేక్షణ అవసరం?

`ఇతర పార్టీలకు పని చేస్తూ టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్న వాళ్లను గుర్తించండి?

`గోడమీద పిల్లులను నమ్మకండి?

`ఉద్యమ పార్టీకి బలమైన త్యాగాల పునాదులున్నాయి?

`అవకాశవాదులను దరిచేరనివ్వకండి?

`ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని పక్కనపెట్టండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 వేరు పురుగు చేరి వృక్షంబు చెరచురా…అని పెద్దలు చెప్పినట్లు, పార్టీని పరువు తీసేందుకు కూడా కొందరు తయారౌతుంటారు. ఏ చెట్టు నీడ కింద వుంటున్నారో ఆ చెట్టుకు చెడ్డపేరు తెచ్చేస్తుంటారు. తమ పబ్బం గడుపుకునేందుకు పార్టీని వాడుకుంటుంటారు. తన పరువు పోతుందని ఆలోచించలేని వ్యక్తులు పార్టీ పరువు గంగలో కలుపుతున్నారు. ఈ మధ్య ఎక్కడ విన్నా, ఏ వివాదం గురించి వినపడినా అందులో టిఆర్‌ఎస్‌ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. నిజానికి టిఆర్‌ఎస్‌ కార్యకర్త అంటే ఒక ఉద్యమకారుడు. త్యాగధనుడు. సుధీర్ఘ కాలం పాటు పార్టీ కోసం పనిచేస్తున్న సైనికుడు. అటుకులు బుక్కి కూడా పార్టీ కోసం పనిచేసిన వాడు. ఉద్యమ కాలంలో ఇల్లూ వాకిలి పట్టించుకోనోడు. తెలంగాణ వస్తే అందరి తలరాతలు మారుతాయని బలంగా నమ్మినవాడు. అలాంటి ఉద్యమకారులైన తెలంగాణ వాదులు ఎలాంటి తప్పులు చేయరు. కాని ఉద్యమ కాలం తెలియని వాళ్లు, ఉద్యమ విలువ తెలియని వాళ్లు, త్యాగం అంటే ఏమిటో తెలియని వాళ్లు, ఆకలిని చంపుకొని ఉద్యమానికి ఊపిరిపోయని వాళ్లు మాత్రమే పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఆగమ్య గోచరమౌతుందని, అంధకారమౌతుంది, స్వార్ధం కోసం టిఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లే ఎక్కువగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడంతో వాళ్లంతా టిఆర్‌ఎస్‌ వాళ్లే అనే ప్రచారం సాగుతోంది. నిజానికి అలా వివాదాల మయమౌతున్న నాయకులందరూ ఇతర పార్టీలనుంచి వచ్చిన వాళ్లే…ఇతర పార్టీల వాసనలు ఇంకా వున్న వాళ్లే…మళ్లీ అవసరమనుకుంటే గోడ దూకేవాళ్లే…అంతే కాని టిఆర్‌ఎస్‌ కోసమే జీవితాంతం పనిచేసేవాళ్లు కాదు…పార్టీ కోసం ప్రాణాలుపెట్టేంత విశ్వాసపాత్రులు కాదు. అందుకే ఏదైనా తమ వల్ల తప్పు జరిగితే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని అసలే ఆలోచించరు. మధనపడేవాళ్లు, అసలు తప్పులే చేయరు. ఇలా అనేక సంఘటలలో బాధ్యులైన వాళ్లలో కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం నేటి ధాత్రి చేస్తోంది. ఆ మధ్య ములుగు జిల్లాలో మొగుళ్ల భద్రయ్య అనే వ్యక్తి మీద దాడి జరిగింది. 

ఆ వ్యక్తి మీద దాడి చేసిన వాళ్లు టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అన్న ముద్ర పడిరది. కాని నిజానికి మొగుళ్ల భద్రయ్య మీద దాడి చేసిన వాళ్లు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కాని వాళ్లు టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. పనులేమో టిఆర్‌ఎస్‌ పేరు చెప్పి చేస్తుంటారు. రాజకీయమేమో కాంగ్రెస్‌కు అనుకూలంగా చేస్తుంటారు. ఇలా చాలా సంఘటనలున్నాయి. ఇక భూముల ఆక్రమణల విషయంలోనూ సేమ్‌ ఇదే తంతు. రియలెస్టేట్‌ చేసే మెజార్టీ వ్యాపారులు ఏదో ఒక పార్టీలో వున్నట్లు కలరింగ్‌ ఇస్తుంటారు. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న సమయంలో వారిలో ఏ ఒక్క రియలెస్టేట్‌ వ్యాపారి టిఆర్‌ఎస్‌కు సపోర్టు చేసిన వాళ్లు కాదు. ఆనాడు అధికారంలో వున్న కాంగ్రెస్‌కు సానుకూలంగా వున్నావాళ్లే..కాని తెలంగాణ రాగానే, టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే వాళ్లుంతా టిఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకున్నారు. ఒక్క రోజులో వాళ్లంతా కండువాలు మార్చుకోగానే టిఆర్‌ఎస్‌ నాయకులైపోయారు. పెద్దలుగా చెలామణి అవుతున్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్లంతా పార్టీలో కీలకమౌతూ వచ్చారు. ఉద్యమ కారులను దూరం జరుపుతూ వచ్చారు. దాంతో అసలైన తెలంగాణ వాదులు ఇప్పటికీ చాలా మంది కార్యకర్తలుగానే మిగిలిపోయారు. కాని గెలుపు గుర్రాలుగా, ఎన్నికల సమయంలో ఏదో రకంగా సాయం చేస్తున్నామన్న భావన కల్పించేవాళ్లంతా టిఆర్‌ఎస్‌ పేరు చెప్పుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. అందులోనూ భూముల ఆక్రమణలు కూడా జరుపుతున్నారన్న అపవాదులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే అందులో టిఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర అన్నది వినపడకుండా వుండడం లేదు. కారణం ఇలాంటి నేతల మూలంగానే పార్టీ పరువు బజారున పడిరది. ఇక ఆ మధ్య ఓ దివ్యాంగుడిని సర్పంచ్‌ కాలుతో తన్నిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ సర్పంచ్‌ టిఆర్‌ఎస్‌ నాయకుడు కాదు. సర్పంచ్‌గా తన హవా నడవాలంటే టిఆర్‌ఎస్‌లో చేరితే తప్ప ఆగడాలు చేయలేనని తెలుసుకున్నాడు. టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నాడు. ఇక మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఎంపిటిసీ ఓ వృద్ధ దంపతులపై దాడి చేశారన్న వార్తలు వచ్చాయి. అక్కడ కూడా ఇదే జరిగింది. ఆ ఎంపిటిసి నిజానికి టిఆర్‌ఎస్‌ ఎంపిటిసి కాదు. ఇక తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ టిఆర్‌ఎస్‌ ఎంపిటిసిని బెదిరించి రియలెస్టేట్‌ వ్యాపారులు భూములు ఆక్రమించుకున్నారని వార్త వచ్చింది. అంటే అసలైన కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో తమ అవసరాల కోసం, వ్యాపార అవకాశాల కోసం, అవసరమైతే రాజకీయ పదవుల కోసం పార్టీలో చేరిన వాళ్లే ఎక్కువ మంది ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇక వైరల్‌గా మారిన ఓ ఆడియోలో ఓ నేత ,మహిళతో జరిపిన సంభాషణ లో టిఆర్‌ఎస్‌ నాయకుడు అనేది బాగా వినిపిస్తోంది. కాని నిజానికి ఆ నాయకుడు కూడా తర్వాత కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరిన వ్యక్తే. అంటే తప్పు చేసేవాళ్లు ఏ పార్టీలో వున్నా తప్పు చేస్తుంటారు. ఆ వ్యక్తులు ఇతర పార్టీలో రాజకీయ అవసరాలు తీరవన్న ఆలోచనతోనే టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారే కాని, వాళ్లంత అవకాశ వాదులు. కాలాన్ని బట్టి గోడలు దుంకుతూ వుంటారు. అలాంటి వాళ్ల వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోతుందని అసలైన తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  ఇలాంటి సమయాల్లో జిల్లా, మండల, గ్రామ శాఖల టిఆర్‌ఎస్‌ బాధ్యులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

  రాజకీయంగాని, సామాజికంగా గాని, దౌర్జన్యపూరితమైన పనులు, దాడులు చేసిన వారిలో అసలైన ఉద్యమకారుల పేర్లు ఎక్కడా వినపించలేదు. కారణం వాళ్లంతా క్రమశిక్షణతో పనిచేస్తున్నవాళ్లు. కాని రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్లే వివాదాలు సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్లను పార్టీ ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం వుంది. జిల్లా స్ధాయి నుంచి నుంచి, గ్రామస్ధాయి నాయకుల దాక పార్టీకి నష్టం తెస్తున్నవారిని ఏరేయాలి. వారిని పార్టీ నుంచి బైటకు పంపేయాలి. అప్పుడే వారికి మరో రాజకీయ జీవితం లేకుండాపోతుంది. ఏ పార్టీ వారిని తీసుకోవడానికి కూడా ఇష్టపడదు. అంతే కాకుండా ఎక్కడైనా వివాదం తలెత్తి పార్టీ పేరు బైటకు రాగానే, ఆ వ్యక్తులు పార్టీకి చెందని వాళ్లా, కాదా? అన్నది కూడా జిల్లా టిఆర్‌ఎస్‌ యంత్రాంగం ఓ స్పష్టతనివ్వాలి. లేకుంటే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ యంత్రాంగమే సుప్రిం. ఏది జరిగినా పార్టీ రాష్ట్ర పెద్దలే చూసుకుంటారు. మంత్రులే పట్టించుకుంటారు.. మాకేందుకు అని టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుల ఉపేక్షించొద్దు. తప్పు చేసిన వారిని వెంటనే పార్టీ నుంచి వెలివేయాలి. పార్టీకి నష్టం చేకూర్చారని తెలిసిన మరు క్షణమే వారిని సస్పెండ్‌ చేయాలి. ఆ వ్యక్తి చేసిన పనికి తమ పార్టీకి సంబంధం లేదని వెంటనే ప్రకటించాలి. అలా చేసినప్పుడే తప్పులు చేయడానికి ఏ నాయకుడైనా భయపడతాడు. తప్పులు చేయకుండా వుంటాడు. లేని పక్షంలో ఇలాగే వివాదాలు సృష్టిస్తుంటారు. పార్టీ మెడకు చుట్టేస్తుంటారు.

ఈటెలా…మన(సు)లో మన మాట!

`ఈటెల గర్‌ వాపసీపై జోరుగా చర్చ

`గులాబీ రమ్మంటోంది…ఈటెల మనసు కోరుకుంటోంది అదే!

`ఈటెల వస్తే గులాబీలో కూడా పండగే!

`ఈటెల గర్‌ వాపసీపై స్పందనలన్నీ నర్మగర్భమే…

`కాదని గులాబీ నేతలు అనడం లేదు…

`అబద్దమని ఈటెల అన్నది లేదు…

` కేసిఆర్‌ కాదనుకున్నడు…కానీ కేటిఆర్‌ వద్దనుకోలేదు?

`ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌ ప్రేమ తగ్గలేదు.

`ఈటెల వస్తే బాగుంటుంది… అనుకుంటున్నరన్నది నిజమే?

`ఊగిసలాటలో ఈటెల మనసు..

`కాదనలేని, ఔననలేని సందిగ్ధం…

`ఎంతైనా కమలం కానిదే అనిపిస్తోంది!

`ఎప్పటికైనా చెప్పుకోవడానికి గులాబీ చరిత్రే ఈటెలకున్నది…

`కారే ఈటెల రాజకీయ జీవితానికి పునాది…

`అయిన వాళ్లు తిట్టినా బాగానే వుంటుంది.

`కాని వాళ్ల కనుచూపు కూడా కఠినంగానే వుంటుంది.

`మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు అందరూ విన్నవే!

`టిఆర్‌ఎస్‌ లో వున్నంత స్వేచ్ఛ బిజేపిలో వుందా?

`గులాబీ జెండాకు నేను కూడా బాసే అన్న మాట ధైర్యం బిజేపిలో అనగలడా?

`పరిగలేరుకోవడం కాదు, పంట కావాలన్నంత చనువు బిజేపిలో వుంటుందా?

`పంచాయతీ పెట్టుకున్నా పాలివాడైనా అయిన వాడే?

`కాని వాడు అవసరానికి పొగిడినా కళ్లలో కనిపించేది మోసమే!

`బిజేపిలో చేరి బలపడిన రాజకీయం ఈటెలకు లేదు?

`బిజేపి పెద్దలతో ముందు వరసలో ఈటెలకు స్థానం కుదరదు?

`బిజేపి పల్లకి ఎంత మోసినా నొప్పి పెట్టేది ఈటెల భుజాలే!

`ఎల్ల కాలం ఊరేగేది ఆ పార్టీ పెద్దలే…

`ఎన్నటికైనా ఈటెలకు బిజేపిలో మిగిలేది ఊడిగమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలలో ఊహలకు, నిజాలకు మధ్య కనిపించనంత చిన్న గీతైనా వుండొచ్చు. చెరిపేయలేనంత పెద్ద గీతైనా వుండొచ్చు. ఆ గీతలు నాయకులు గీసుకునే విధానాన్ని బట్టే వుంటాయి. ఎవరో గీస్తే వచ్చేవి కాదు..ఎవరో తొలగిస్తే పోయేవి కావు..ఎవరి గీత వారే గీసుకోవాలి. ఎవరి గీత వారే చెరిపేసుకోవాలి. ఒకరి గీత మరొకరు గీసేందుకు అవకాశం లేని ఏకైక ఆట రాజకీయం. అందుకే ఏ ఆటైనా వైకుంఠపాలిలో గెలిచేందుకే…పద్మ వ్యూహాలకు మించిన మలుపులు, లొసుగులు వుండేది రాజకీయంలోనే…ఒక్కసారి రాజకీయం ఒంటబడ్టిన తర్వాత వెనకడుగు వుండదు…తరమత బేధాలుండవు…! అందరూ ఒక్కటే…అందరూ వేరే…అందరూ మిత్రులే..అందరూ శత్రువులే…అందుకే రాజకీయాలలో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వ త మిత్రులు కూడా వుండరు. ఎవరు ఎప్పుడు కలుస్తారో..ఎప్పుడు విడిపోతారో…ఎందుకు ఒకటౌతారో…అన్నది వారి చేతుల్లో కూడా వుండదు. కాలం ఆడే ఆటలో నాయకులు కూడా పావులే…వెనక్కితిరిగిచూసుకోకపోతే అంతా శూన్యమే…! ఇది ఏ నాయకుడైనా తెలుసుకోవాల్సిందే…ఆచరించాల్సిందే…అనుసరించాల్సిందే…అన్వయించుకోవాల్సిందే…!

 ఈ మధ్య రాజకీయాల్లో వినిపిస్తున్న ఆసక్తికరమైన అంశాలలో ఈటెల రాజేందర్‌ తిరిగి సొంత గూటికి అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది. 

నిజంగా కేసిఆర్‌ ఆ ఆలోచనలో వున్నాడా? లేడా? అన్నది దాని గురించే సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఈటెల రాజేందర్‌ వస్తే బాగుండు? అని టిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా అనుకుంటున్నాయా? అన్నది కూడా వినిపిస్తూనే వుంది. అంతే కాదు ఈటెల రాజేందర్‌ కూడా అదే కోరుకుంటున్నట్లు కూడా కొంత మంది చెబుతున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు మధ్య విభేదాలు వచ్చినా, కాలం గడుస్తున్నకొద్దీ, ఆ కోప తాపాలు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. వెనక్కితిరిగి చూసుకునే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ఈటెల వస్తే మళ్లీ పార్టీలో మరో జోష్‌ నెలకొనొచ్చన్న వారు కూడా వున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసులో ఏముందనేది తెలిస్తే గాని అసలు చర్చకు ముగింపు వుండదు. 

 ఈటెల రాజేందర్‌ గర్‌ వాపసీ అన్న అంశంపై ఎవరూ నోరు విప్పే అవకాశం లేదు.

 అంతా నర్మగర్భవ్యాఖ్యలు…లేకుంటే మౌనాలు..ఇంతకు మించి ఇప్పుడే సమాధానాలు ఆశించలేం…అందువల్ల ఈటెల ఎపిసోడ్‌లో ఔనని టిఆర్‌ఎస్‌ అనడంం లేదు…కాని ఈటెల కూడా కొట్టేయలేదు. తాజాగా ఈటెల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగానే వున్నాయి. తనను ముఖ్యమంత్రి కేసిఆర్‌ వద్దనుకున్నాడు…కాని కేటిఆర్‌ వదులుకోవాలనుకోలేదు…అన్నాడు. అంటే టిఆర్‌ఎస్‌ మీద మమకారం ఈటెలకు తగ్గలేదని తేలిపోయింది. కేసిఆర్‌ మీద కోపం లేదన్నది అర్ధమౌతోంది. పొరపొచ్చాలకు కారణమేదో అయ్యింటుందన్నది మాత్రం తెలుస్తోంది. ఆ మబ్బులు వీడితే మళ్లీ వెలుగే అన్నది కూడా వినిపిస్తున్న మాట…ఈటెల టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతాడన్న మాట..! అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటికీ ఈటెల మీద కేటిఆర్‌కు ప్రేమ తగ్గలేదన్నది పరోక్ష సంకేతాల ద్వారా తెలుస్తోంది. ఈటెల రాజేందర్‌ పుట్టిన రోజున కేటిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఈటెల రాజేందర్‌ తండ్రి స్వర్గస్ధులైనప్పుడు కూడా కేటిఆర్‌ స్పందించారు. నిజానికి ఈటెల వ్యక్తిగతంగా బిజేపిలో వున్నా, మనసు మాత్రం టిఆర్‌ఎస్‌లో వుందని ఆయన సన్నిహితులు చెబుతున్నమాట. టిఆర్‌ఎస్‌లో ఆయనకు జరిగిన ఇబ్బందులు ఆయనకు తప్ప మరెరికీ తెలియవు. కాని ఆయన అనుభవించిన స్వేచ్ఛ మాత్రం ప్రజలు చూశారు. ఈటెలరాజేందర్‌ కుమార్తె పెళ్లి జరిగిన తర్వాత వేములవాడకు వెళ్లిన రోజున ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూపిన ప్రేమ ప్రజలు చూసిందే…ఈటెల కుటుంబం కోసం అరగంట పాటు కాన్వాయిని ఆపి మరీ వారిని సిఎం. కేసిఆర్‌ తన వెంట తీసుకెళ్లారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సమయంలోనూ సిఎంతో పాటు, కేటిఆర్‌ లేడు…హరీష్‌రావు లేదు. కాని ఈటెల మాత్రమే వున్నాడు. అంటే ఈటెలపై ఆ రోజుల్లో కేసిఆర్‌కు ఎంత గురి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. పొరపొచ్చాలు ఎవరికైనా సహజమే…అవి సమసిపోవడం కూడా అంతే సహజం.

ఈటెల గర్‌వాపసీ అన్నది జరగాలనే అందరూ కోరుకుంటున్నారు. 

అయితే ఈటెలది కూడా కాదనలేని, ఔననలేని సందిగ్ధ పరిస్ధితుల్లోనే వున్నాడనేది కూడా కొంత వాస్తవం. ఈటెల రాజేందర్‌కు టిఆర్‌ఎస్‌లో వున్నంత స్వేచ్ఛ బిజేపిలో లేదనేది నిజం. ఎందుకంటే టిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఈటెల మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు మరమరాలకన్నా తక్కువయ్యాయని అంటున్నారు. బిజేపి పెద్దలు రిమోట్‌ పట్టుకొని మాట్లాడిస్తే మాటల్లానే వుంటున్నాయే తప్ప, ఈటెల స్వభావరిత్యా, సహజసిద్దంగా ఆయన గొంతును సవరిస్తే వచ్చే మాటలు రావడం లేదు. అయినా ఈటెల రాజేందర్‌ గురించి ఎవరు చెప్పాలనుకున్నా, ఆయన చరిత్ర అంతా టిఆర్‌ఎస్‌తోనే ముడి పడి వుంటుంది. కమలంలో ఆయన చరిత్ర వెలుగు లేని గుడ్డిదీపంలాగే వుంటుంది. తానేంటో చెప్పాలనుకున్నా టిఆర్‌ఎస్‌లో విజయాలు చెప్పుకోవాల్సిందే…బిజేపిలో వున్న స్ధానమేమిటో ఆయనకు కూడా తెలియందే…అందుకే తన రాజకీయ జీవితానికి పునాది వేసిన టిఆర్‌ఎస్‌కు మళ్లీ వెల్లడం అన్నది జరగడమే ఆయన రాజకీయ జీవితానికి మరో చిగురింపు అని అందరూ అంటున్నారు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం వున్నాయి. ఒకనాడు ఇందిరాగాంధీ చేత బహిష్కరింపబడ్డ ప్రణబ్‌ ముఖర్జీ, తర్వాత కాలంలో రాజీవ్‌గాంధీకి సన్నిహితమయ్యాడు. తర్వాత కాలంలో కాంగ్రెస్‌కు ఆయనే ఊపిరయ్యాడు. సోనియాగాంధీకి మార్గదర్శకంగా నిలిచారు. కాంగ్రెస్‌పార్టీ మూలంగా రాష్ట్రపతి అయ్యాడు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరని ఇందుకే అంటారు. 

 అయిన వాళ్లు తిట్టినా అందంగానే వుంటుంది.

 కాని వాళ్ల కనుచూపు కూడా కఠినంగానే వుంటుంది. ఈటెల రాజేందర్‌ను టిఆర్‌ఎస్‌నుంచి పంపినా, ఆయనపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ కూడా ఆయనను కించపర్చలేదు. కాని మునుగోడు ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదకు వచ్చిన తొలిరోజు ఈటెల రాజేందర్‌పై కేంద మంత్రి కిషన్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. దాంతో ఈటెలపై బిజేపి నేతలకు ఎంత ప్రేమ వుందో అర్ధం చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈటెల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అన్నాడు. ఆ స్వేచ్ఛను చూపించుకున్నాడు. బెరుకుతనం లేకుండా మాట్లాడగలిగాడు. మరి అదే బిజేపిలో అలాంటి మాటలు మాట్లాడే చాన్స్‌ వుందా? టిఆర్‌ఎస్‌లో మంత్రిగా వుంటూనే పరిగలేరుకొని బతకడం కాదు…పంట కుప్ప మీద కూర్చొవాలన్నాడు. బిజేపిలో అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం వుందా? దేశంలో ప్రజలు అధిక ధరలతో ఇబ్బందిపడుతున్నారని అనగలడా? ప్రజలు మోయలేని పన్నుల బారంతో మధనపడుతున్నారని చెప్పగలరా? అందుకే బిజేపిలో రాజేందర్‌ ఎంత కాలం వున్నా ఆయన బలపడేదిలేదు. ఆయనను బలపడనిచ్చేవారు లేరు. బిజేపి పెద్దల మందు, ముందు వరుసలో కూర్చునేందుకు కుర్చీయేలేదు. ఆఖరుకు రాష్ట్ర పార్టీలోనూ కీలక స్ధానంలోఆయనకు సీటులేదు. బిజేపి పల్లకి ఎంత మోసినా, ఎంత కాలం మోసినొ నొప్పి పుట్టేది ఈటెల భుజాలే…ఎల్ల కాలం ఊరేగేది ఆపార్టీ పెద్దలే…ఎప్పటికైనా బిజేపిలో ఈటెలకు మిగిలేది ఊడిగమే…అని ఆయన శ్రేయోభిలాషులే అంటున్నారు..మరి ఈటెల ఏమనుకుంటున్నారో..! అన్నది కాలమే సమాధానం చెప్పాలి…కనీసం కేటిఆర్‌ కోసమైనా టిఆర్‌ఎస్‌లోకి వస్తాడనుకుంటున్న టిఆర్‌ఎస్‌ శ్రేణుల మాటలన్నా నిజం కావాలి..!

మీ కోరిక మేరకే..!

`త్వరలోనే కేటిఆర్‌ ను సిఎం చేద్దాం!

`కేసిఆర్‌ నేడు చెప్పనున్న మాట?

`నాతో కొందరు జాతీయ

రాజకీయాలకు, 

`కేటిఆర్‌తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు.

`టి(బి)ఆర్‌ఎస్‌ మరింత సరికొత్తగా…

`యువకుడు కేటిఆర్‌ ప్రభుత్వ సారధ్యం…

`వివాదాల జోలికి పోకండి

`ప్రజలతో మమేకం కండి.

`టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీ.

`ఎంతో బలంగా వుంది.

`బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు.

`ఆవేశం వద్దు-ఆలోచన కావాలి.

`ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు.

`తొందరపడి మాటలు జారకండి.

` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ వుంటారు.

`సంయమనం ఎంతో అవసరం.

`ప్రతిపక్షాలది దూకుడు కాదు…వింత పోకడ.

`అది కనిపెట్టుకొని వ్యవహరించాలి.

`బిజేపిది బలం కాదు, వాపు కూడా లేదు.

`దానికి రియాక్ట్‌ కావాల్సిన అవసరం లేదు.

` ప్రజలు అడిగేవాటికి సానుకూల స్పందన కనబర్చండి.

`ఎన్నికల ముందు ఇలాంటివి సహజం.

`గత ఎన్నికల ముందు కూడా ఇలాగే చేశారు.

`ప్రజలు మనవైపు వున్నారు.

`ప్రతిపక్షాలు సృష్టించే వివాదాలు నెత్తికెత్తుకోవద్దు.

`ముఖ్యంగా పార్టీ శ్రేణులతో కలివిడిగా వుండండి. 

`మళ్ళీ గెలిచేది మనమే…

`కమలం ఎప్పుడో వాడిపోయింది.

`గులాబీ గుభాలింపు, పరిమళం ఎప్పటికీ వుంటుంది. 

`త్యాగాల పునాదులు మనకే వున్నాయి.

`తెలంగాణ అభివృద్ధి ఘనత టిఆర్‌ఎస్‌ కే దక్కుతుంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి కేటిఆర్‌కు ప్రమోషన్‌ రానున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం వుంది. అతి త్వరలో కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మాట ఈ రోజు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పార్టీ నాయకులు మందు ప్రస్తావించే అవకాశం వుంది. ప్రతిపాదించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ అనూహ్య సమావేశానికి కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు పార్టీ నాయకులకు ఈ విషయం వెల్లడిరచి, వారి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం వుంది. ముందు సీనియర్‌ నాయకులైన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులందరి చేత తీర్మాణాలు చేయించే అవకాశం కూడా వుందన్న సంకేతాలు అందుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న కోరిక చాలా మంది మంత్రులు కూడా వ్యక్తపర్చిన సందర్భం చూసిందే…అది ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయం నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటిస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటేనే ఓ సంచనలం. ఆయన తెలంగాణ ఉద్యమం చేపట్టడం ఒక గొప్ప ఘట్టం. సుధీర్ఘంగా తెలంగాణ ఉద్యమం సాగించాల్సి వస్తుందన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం మరో విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక గొప్ప సందర్భం. అది కేసిఆర్‌ కలల రూపంగా ఆవిష్కరింపబడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ కావడం అన్నది తెలంగాణ మలుపుకు గొప్ప సంకేతం.  

                      తెలంగాణ ప్రగతికి కేసిఆర్‌ ఒక వరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కావడం వల్లే ఇప్పుడున్న వెలుగులు,ప్రగతి పరుగులు, కాలువల్లో నీళ్లు, ప్రాజెక్టులు, నిండు కుండల్లా చెరువులు,ఎక్కడా చూసినా పచ్చదనం, తెలంగాణకే మణిమకుఠం కాళేశ్వరం…ఇలా చెప్పుకుంటూ అధ్భుత తెలంగాణ మన కళ్ల ముందు కదిలే ప్రతి అభివృద్ధి కేసిఆర్‌ కలల రూపం. అలాంటి కేసిఆర్‌ దేశ రాజకీయాలను మార్చే మరో యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట సమితిగా రూపాంతరం చెందుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు మంత్రి కేటిఆర్‌కు అప్పగించడానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పూర్తి స్దాయిలో ఇక దేశ రాజకీయాల మీద దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కేసిఆర్‌ పట్టు అంటే ఎలా వుంటుందో అందరికీ తెలుసు. ఆయన ఒక్కసారి కమిటైతే ఇక దాని అంతు చూడకుండా వుండలేదు. దాన్ని సాధించేదాకా విశ్రమించరు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎవరు ఎన్ని మాట్లాడినా వాటిని గురించి పట్టించుకోలేదు. ఏ ఒక్క సందర్భంలోనూ వెనకడుగు వేయలేదు. పిడికిలి ఎత్తిన నాడే అడుగు మొదలుపెట్టారు. తొలి అడుగు వేసిన నాటి నుంచి తెలంగాణ సాధన విజయాన్ని ముద్దాడేదాకా తన ఉద్యమ ప్రస్ధానంలో ప్రయాణంలో అలుపు లేదు. వెనుదిగిరి చూడలేదు. ఇప్పుడు అదే కసి, అదే లక్ష్యం, అదే అంకితభావంతో మరోసారి దేశ రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. అందుకే ముందు కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసి, ఆ తర్వాత దేశ రాజకీయాలో విప్లవాత్మకమైన మార్పు కోసం బయలుదేరనున్నాడు.  

తెలంగాణ అంటే టిఆర్‌ఎస్‌. టిఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ. తెలంగాణలో మరో పార్టీకి తావు లేదు. కాసింత చోటు అంతకన్నా లేదు. ముఖ్యంగా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు ఉనికి లేదు. తెలంగాణకు సహకరించని పార్టీలకు ప్రజలు ఊపిరందించే పరిస్ధితే లేదు. తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ టిఆర్‌ఎస్‌. రాజకీయంగా ప్రభల శక్తి. ఎదురులేని,తిరుగులేని రాజకీయ ప్రస్దానం టిఆర్‌ఎస్‌ది. అయితే ఎంత బలవంతమైన పార్టీ అయినా సరైన నాయకత్వం ఖచ్చితంగా వుండాలి. అందుకే కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలి. దేశ రాజకీయాల్లోకి కేసిఆర్‌ ప్రవేశిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఆపార్టీ రక్షణకు, పాలక పగ్గాలు చేపట్టేందుకు సరైన నాయకుడు కేటిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనయుడుగా వారసుడైనా, ఉద్యమ కారుడుగా కూడా కేటిఆర్‌ త్యాగాల పాత్ర కూడా వుంది. తెలంగాణ ఉద్యమంలో కేటిఆర్‌ కీలక భూమిక పోషించారు. కేసిఆర్‌ వెనకుండి ఉద్యమాన్ని ఆయన కూడా లీడ్‌ చేశాడు. ఇక ఎమ్మెల్యేగా ప్రజల అవసరాలు తీర్చాడు. ప్రజలకు సేవ చేస్తున్నాడు. మంత్రిగా పరిపాలనతో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. ప్రగతిని పరుగులుపెట్టించాడు. అందుకే ఎటు చూసినా కేటిఆర్‌లో గొప్ప నాయకుడే వున్నాడు. గొప్ప సామాజిక వేత్త వున్నాడు. సామాజిక సృహను మనసులో నింపుకున్న రామన్నగా గుర్తింపు పొందాడు. అందువల్ల కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే సరైన సమయం. మరో వైపు బిఆర్‌ఎస్‌ దేశ వ్యాప్తం కావాలి. పార్టీ విస్తరణ జరగాలి. అన్ని రాష్ట్రాల్లో ముందు జెండా ఎగరాలి. యంత్రాంగం కావాలి. అందుకు ఎంతో శ్రమ పడాలి. ఎంతో సమయం కేటాయించాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు, ఇప్పుడు కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రం తిరగాలి. ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. తెలంగాణ రాజకీయాలు పదిలంగా కొనసాగాలి. బిఆర్‌ఎస్‌లో కొత్త ఉత్తేజం నెలకొనాలి. అందుకోసం ఇప్పటినుంచే బిఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా కేసిఆర్‌ ప్రయాణం మొదలు కావాలి. పార్లమెంటు ఎన్నికల దాక అలుపెరగని ప్రయాణం కొనసాగాలి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేం కావాలి. తీరిక లేని కాలం చూడాల్సివుంటుంది. అదే సమయంలో తెలంగాణలో అభివృద్ధి ఆగిపోవొద్దు. ప్రగతి కుంటుపడొద్దు. దేశ రాజకీయాలలో తెలంగాణ మోడల్‌ ఒక ఐకాన్‌ కావాలంటే యూత్‌ ఐకాన్‌గా ముద్ర వున్న కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి. ఆయన ఆధ్వర్యంలో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా పాలనలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవాలి. ఒకప్పుడు యూత్‌ మొత్తం టిఆర్‌ఎస్‌ జెండా, ఎజెండానే చూపించారు. కాని కొంత మార్పు వచ్చింది. నిన్నటి యువతరం నేడు పెద్ద తరమైపోయింది. ఆ తరం ఎప్పటికీ టిఆర్‌ఎస్‌ వెంటే వుంటుంది. కాని ఇప్పటి తరం టిఆర్‌ఎస్‌ వెంట నడవాలంటే, యువ నాయకత్వం తెలంగాణలో కావాలి. అది కేటిఆర్‌ కావాలి. ఇప్పుడిప్పుడే ఇతర పార్టీల వైపు ఆకర్షితులౌతున్న యువత తిరిగి టిఆర్‌ఎస్‌ వైపు చూసే అవకాశం వుంది. పైగా ఉద్యమ తరం కూడా కేటిఆర్‌తో కలిసి వచ్చేందుకు కూడా ఆసక్తి కనబర్చుతున్నారు. తెలంగాణ కోసం రండి అంటే ఎంతో మంది మళ్లీ టిఆర్‌ఎస్‌వైపు అడుగులేసేందుకు సిద్దంగా వున్నారు. కొత్త నాయకత్వంలో కొత్తకొత్త కొలువులు కూడా వచ్చే అవకాశం వుందన్న నమ్మకం యువతలో బలపడేందుకు దోహదపడుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే కేటిఆర్‌ మాత్రమే సుసాధ్యం చేస్తాడన్న విశ్వాసం కూడా పార్టీలో ఎంతో కనిపిస్తోంది. అందుకే త్వరలో కేటిఆర్‌ ముఖ్యమంత్రి అనే మాట ఈసారి మరింత బలంగా, సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నోట కూడా ఆ మాట వినడానికి అందరూ ఆసక్తిగా కూడా ఎదురుచూస్తున్నారు. కేటిఆర్‌ అనే నేను అనే మాట ఎప్పుడు వింటామా….కేటిఆర్‌ ఎప్పుడు చెబుతాడా? అని యువత కూడా రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తోంది. పార్టీ శ్రేణులనుంచి బలంగా వినిపిస్తోంది.

త్వరలో కేటిఆర్‌ సిఎం!

`కేటిఆర్‌ సీఎంగానే వచ్చే ఎన్నికలు.

`పార్టీలో యువత ప్రధాన్యం పెరగాలంటే కేటిఆర్‌ సీఎం కావాలి.

`పార్టీ శ్రేణులనుంచి పెరుగుతున్న ఒత్తిడి.

`మంత్రుల మనసులో మాట ఇదే…

`సీనియర్లు చర్చించుకుంటున్నదీ ఇదే విషయం.

` కేసిఆర్‌ దేశ రాజకీయాలపై పూర్తి దృష్టి.

`సీనియర్‌ నేతలంతా కేసిఆర్‌ తో దేశ రాజకీయాలకు…

`యువకులంతా కేటిఆర్‌ తో రాష్ట్ర రాజకీయాలు.

` బిజేపికి కళ్లెం వేయాలన్నా, కాంగ్రెస్‌ ను కట్టడి చేయాలన్నా ఇదే సరైన సమయం.

`బిజేపి పన్నుతున్న కుయుక్తులను దేశ స్థాయిలో కేసిఆర్‌.

`రాష్ట్ర స్థాయిలో కేటిఆర్‌ ఎదుర్కోవడమే మేలు.

`రాష్ట్రం మీద సమస్యల పట్టు కేటిఆర్‌ సొంతం.

`పరిపాలనపై ఇప్పటికే పూర్తి స్థాయి పట్టు.

`పార్టీపై నిర్థిష్ట ప్రణాళికతో ముందుకు

`అన్ని రకాలుగా అన్ని విషయాలపై సమగ్ర అవగాహన

`దేశ విదేశాల పాలనలపై ప్రత్యక్ష అనుభవం.

`పారిశ్రామిక ప్రగతిపై ఇప్పటికే అనేక సమ్మిట్లు…

`నాయకులతో కలుపుగోలు తనం…

`ఎప్పుడూ ఉల్లాసంగా కనిపిస్తూ గౌరవంగా పలకరింపు కేటిఆర్‌ వ్యక్తిత్వం.

`ఎవరు పిలిచినా పలికే తత్వం…

`ట్విట్టర్‌ ద్వారా సమాచారం అందించినా స్పందించే గుణం.

`రాజకీయాలలో వుండాల్సిన సంపూర్ణ నాయకత్వం కేటిఆర్‌ నిదర్శనం

`సేవాభావానికి నిలువెత్తు సాక్ష్యం. 

`అందరూ అజాత శత్రువు అని పిలుచుకునే మూర్తిమత్వం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కల్వకుంట్ల తారకరామారావు అనే నేను…అనే మాట త్వరలో అశేష ప్రజానీకం నడుమ వినపడనుంది. ఎట్టకేలకు కొద్ది రోజుల్లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సిఎం కానున్నారు. ఇది ఫిక్స్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమచారం. గత కొంత కాలంగా ఈ మాట వినిపిస్తున్నా అప్పటి పరిస్ధితుల దృష్ట్యా వాయిదా పడుతూ వచ్చిందే. సరైన సమయం కోసం ఎదురుచూడాల్సివచ్చింది. కాని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ స్ధానం, కేసిఆర్‌ రాజకీయ ప్రస్ధానం మరో రెండు దశాబ్ధాల పాటు సాగాలంటే, భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ శక్తిగా నిబడాలంటే యువతరం నాయకత్వం కావాలి. పరిపాలనలోనూ యువతరం రంగంలోకి దిగాలి. అందుకు ముఖ్యమంత్రిగా కేటిఆర్‌ను రంగంలోకి దింపాలి. ఇంకా ఆలస్యం చేస్తే కూడా నష్టదాయం కావొచ్చన్న సూచనలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణ నూతన సచివాలయంలో కొత్త కేటిఆర్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. నిజానికి సచివాలయం దసరాకే పూర్తి చేసి, ప్రారంభిద్దామనుకున్నారు.కేటిఆర్‌ సిఎం కావడానికి సుమూర్తాలు తర్వాత వున్నాయన్న సూచనల మేరకు వాయిదా మాత్రమే పడిరది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర నాయకుల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ఒత్తిడి వున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ రాజకీయాలమీద దృష్టిపెడుతున్నారు. పార్టీ పేరు కూడా మార్పు జరిగింది. ప్రజల్లోకి ఆ పార్టీ పేరు వెళ్లింది. దేశ రాజకీయాల్లో నూతన శకం రానున్నదనే సంకేతాలు దేశ వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు క్లియరెన్స్‌ వస్తుందా? అన్న ఎదురు చూపు మాత్రమే మిగిలివుంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తున్న కేసిఆర్‌ అనేక రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. ఆ మధ్య డిల్లీలోనూ ఓ పది రోజుల పాటు వుండి, బిఆర్‌ఎస్‌ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇప్పుడు కూడా ఆయన డిల్లీకి వెళ్లారు. అటు జాతీయ రాజకీయాలు, ఇటు రాష్ట్ర ప్రరిపాలనా వ్యవహారాలు ఏకకాలంలో చూడడం అన్నది ఎంతైనా ఇబ్బంది కరమే. రాష్ట్రంలో ఎంత యంత్రాంగం వున్నప్పటికీ ముఖ్యమంత్రి స్వయం పర్యవేక్షణ లేని పాలన కొంత ఇబ్బంది కరమే…అందుకే ప్రతిపక్షాల నుంచి ఆ అపవాదు ఎదుర్కొనే అవకాశం రాకముందే కేటిఆర్‌ను సిఎం చేయాలని సంకల్పించినట్లు కూడా తెలుస్తోంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తనయుడిగా కేటిఆర్‌ మాటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతోంది. పైగా ప్రతిపక్షాలు కేటిఆర్‌ను డిఫాక్టో సీఎం అంటూనే వున్నారు. అది నిజం చేసి, కేసిఆర్‌ డిల్లీ రాజకీయాలకు వెళ్లడానికి కూడా ముహూర్తం రెడీ అయ్యింది.  

టిఆర్‌ఎస్‌లో యువత ప్రాధాన్యం మరింత పెరగాలి.అందుకు కేటిఆర్‌ నాయకత్వం, పరిపాలన ఎంతో అవసరం. ఎంత కాదనుకున్నా, రాష్ట్రంలో కొంత యువత బిజేపి వైపు ఆకర్షితులౌతున్నారు. మరి కొంత రేవంత్‌ వర్గంగా ముద్రపడుతున్నారు. ఒక్కసారి కేటిఆర్‌ రంగంలోకి దిగితే యువతను కదిలిస్తే ఆయన వైపు మళ్లడం జరుగుతందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ రాజకీయాల్లో నిన్న తరం తర్వాత నేటి తరం అన్నది ఎంతో ముఖ్యం. గత తరం త్యాగాల పునాదులు నేడు తెలిసిన వాళ్లతోపాటు, నేడు తెలియాల్సిన యువతరం కూడా కావాలి. వారికి కనెక్టు కావాలంటే టిఆర్‌ఎస్‌లో యువతరం రావాలి. అందుకు కేటిఆర్‌ నేతృత్వంలోనే అది సాగాలి. ఇదీ పార్టీకి చెందని నేతలు చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేటిఆర్‌కు ప్రజలతో సాన్నిహిత్యం వుంది. సుధీర్ఘ కాలం పాటు ఆయన కూడా ఉద్యమం కోసం అన్ని ప్రాంతాల ప్రజలతో ఆయనకు పరిచయాలు వున్నాయి. ఆయా ప్రాంతాల మీద పూర్తి స్ధాయి అవగాహన కూడా వుంది. ఇక ప్రజలను గుర్తించడంలో కూడ తెలిక. పార్టీపరంగానే కాదు, రాజకీయ నాయకులుగా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన నేత. ప్రజల్లోకి చొచ్చుకుపోయే తత్వం కేటిఆర్‌ది. ముఖ్యంగా పెద్దతరం ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆయన వ్యవహార శైలి అనేక సందర్బాలలో కనిపించింది. ఇక తెగువ కూడా వున్న నాయకుడు. ఉద్యమ కాలంలోనే కాదు, కరోనా కాలంలో ఆయన చూపిన చొరవ అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో బైటకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాని సందర్భాలలో కూడా మున్సిపల్‌ మంత్రిగా ఆయన హైదరాబాద్‌లో రెడ్‌ జోన్‌ ఏరియాల్లో కూడా తిరగుతూ ప్రేజలకు ధైర్యం చెప్పిన నాయకుడు. ఇది కేటిర్‌లో వున్న తెగువకు నిదర్శనం. ప్రజలపై ఆయనకు వున్న మమకారానికి సాక్ష్యం. ఉద్యమ కాలంలో ముందుండి నడిచినట్లే, ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు తీర్చడంతో కూడా అంతే ముందున్నాడు. అందుకే ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడినా సిరిసిల్ల గురించి ప్రస్తావించకుండా వుండలేరు. అంటే తనను ఎన్నుకున్న ప్రజలకు నూటికి నూరు శాతం సేవ చేయడంలో కేటిఆర్‌కు అందరికన్నా ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం కోసం చేసే సేవ ఏమిటో మన కళ్లముందే వుంది. ఆయన నిర్వహిస్తున్న శాఖల తీరుతోనే మంత్రి కేటిఆర్‌ పనితనం ఏమిటో చెప్పొచ్చు. రాష్ట్రం ఈ రోజు పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతుంటే అందుకు కారణం కేటిఆర్‌. ఆయన చొరవ. ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవన్ని నెరవేరాలన్నా, విజయవంతం కావాలన్నా సంబంధిత మంత్రి పని తీరు కూడా ఎంతో ముఖ్యం. అందులో కేటిఆర్‌ ముందున్నాడనేది అందరూ అంగీకరిచాల్సిన విషయం. అటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడిరటుగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. పార్టీ అధ్యక్షుడుగా అరవై లక్షల కార్యకర్తలను తయారు చేసిన ఘనత కూడా ఆయనదే అని చెప్పాలి. ఇకమంత్రిగా ఐటి పరిశ్రమను నిలబెట్టాడు. 

పెద్దఎత్తున ఐటి కంపనీల ఏర్పాటుకు కృషి చేశాడు.ఒక దశలో తెలంగాణలో ఐటి పరిశ్రమ పరిస్దితి ఎలా వుంటుందో అన్న సందేహాలను సైతం పటాపంచెలు చేసి, ఐటికి తెలంగాణ కేఆర్‌ఆఫ్‌ అడ్రస్‌ చేశాడు. అంతే కాదు జిల్లాల్లో ఐటి పరిశ్రమలు అన్నది ఎవరూ ఊహించింది కాదు. కాని కరీంనగర్‌, హన్మకొండలలో ఐటి హబ్‌లను ఏర్పాటు చేయించారు. ఆ ఊహలను నిజం చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జరిగిన సమ్మిట్లకు హజరై పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చిన ఘనత కూడా కేటిఆర్‌కే దుక్కుతుంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ పరుగులుపెట్టడానికి అవసరమైన టిఎస్‌ ఐపాస్‌ వంటి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేసి, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామం చేశాడు. అంటే ఒక నాయకుడికి వుండాల్సిన విజన్‌లన్నీ కేటిఆర్‌లో వున్నాయనేది ఇక్కడ స్పష్టమైంది. ఇక రాజకీయంగా అందరి మన్ననలు పొందుతూ వివాదాలు లేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఎక్కడా ఎవరినీ నొప్పింపకుండా ఎక్కడా మాట దొర్లకుండా చూసుకునే నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ లా దూకుడు వున్నా, అది పనితనంలో తప్ప మాటల్లో చూపించడు. మాటలు ప్రవాహంలా వచ్చినా, వాటిని కొత్త దారులకు వినియోగిస్తాడు. అంతటి చాణక్యుడు కేటిఆర్‌. అటు పార్టీ పరమైన సమర్ధత, ఇటు పరిపాలనా పరమైన విశిష్టత వున్న నాయకుడిగా కేటిఆర్‌ ఎప్పుడో తన సమర్ధతను నిరూపించుకున్నాడు. పైగా పార్టీ మొత్తం ముక్త కంఠంతో కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలనడం కూడా చూస్తూనే వున్నాం. గతంలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్‌ అంటూ మంత్రులు కూడా చెప్పిన మాట. కాకపోతే అప్పుడు మంత్రులైనా, సీనియర్‌ నాయకులైనా ప్రజలతో చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కే చెప్పి, కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. దటీస్‌ కేటిఆర్‌…రేపటి తెలంగాణ డైనమిక్‌ విజన్‌, విస్‌డమ్‌ లీడర్‌.

నమ్మకం తీసిన ప్రాణం… హోప్‌ లెస్‌ వైద్యం!!

`ఒకసారి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుగుసార్లు!

`జరిగింది తప్పే అని ముందు ఒప్పుకోవడాలు?

`తర్వాత ప్లేటు పిరాయింపులు?

`ఠాగూర్‌ సినిమా చూపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు!

`ఇదే వైద్యం ప్రభుత్వాసుపత్రిలో జరిగి ఫెయిల్‌ అయితే?

`ఆపరేషన్‌ వికటించిన వ్యక్తి ఉదయం మరణిస్తే…సాయంత్రం దాకా హైడ్రామా?

`బిల్లు చెల్లించి తీసుకెళ్లమని ఆజ్ఞలు…!

`జనం కదిలితే దిగొచ్చారు…ప్రభుత్వ వైద్యాదికారులు మధ్య వర్తిత్వం చేశారు?

`ప్రాణం పోయినా కేసులేదు…నాలుగు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు!

`పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు…

`కాల్‌ ఇన్‌ డాక్టర్లతో ఆపరేషన్లు…

`చనిపోయిన వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు!

`నమ్మించారు…హోప్‌ లెస్‌ అని చేతులెత్తేశారు..!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 సేవ రంగాలన్నీ వ్యాపారాలైపోతున్నాయి. ప్రైవేటు వ్యవస్ధలో వేళ్లూనుకుపోతున్నాయి. విచ్చలవిడి తనాన్ని సంతరించుకుంటున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు పరంలో లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందులో ప్రాణాలు కాపాడాల్సి వైద్య వృత్తి సైతం వ్యాపారమై, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రైవేటు వైద్యం అంటే ఒక నమ్మకం అనుకునే పరిస్ధితి నుంచి బతికితే మా పుణ్యం…లేకుంటే మీ ఖర్మం అన్నట్లు సాగుతోంది. తాజాగా హన్మకొండలో జరిగిన సంఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. వైద్యం కోసం వచ్చిన సామాన్యులను పీల్చి పిప్పి చేయడమే కాదు, ఠాగూర్‌ సినిమా వైద్యం కూడా అందిస్తూనే వున్నారు. చనిపోయిన వారికి సైతం వైద్యం చేసినట్లు నటిస్తూ లక్షలు వసూలు చేస్తున్నారు. మానవత్వాన్ని మంటగల్పుతున్నారు. మానవ సమాజంలో వైద్యులంటే దేవుళ్లతో సమానమన్న భావనను వాళ్లే విస్మరిస్తున్నారు. ఏదో ఒక ఆనారోగ్య సమస్యతో వచ్చిన వారికి వైద్యం ఎలా చేయాలన్నదానికన్నా, ఎంత ఖచ్చు చేయించొచ్చు అన్నదే ఎక్కువగా ఆలోచిస్తున్నారన్న మాటలు సర్యత్రా వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎంత ఖర్చైనా సరే అన్న ఒకే ఒక్క పదం పట్టుకుంటారు. ఎంత మేలైనవైద్యం చేస్తున్నారన్నది అసలే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏటా వందలాది కోట్ల రూపాయలు ఖచ్చు చేస్తూ, పేదల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపడమే వారికి వరంగా మారింది. ఈ మధ్య కాలంలోనే వరంగల్‌లో వైద్యం వికటించి ఇద్దరు చనిపోయారు. కారణం ఆయా ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక…సరైన వైద్యులు పర్యవేక్షణ చేయక…! కాని పైన పటారం లోన లొటారం అన్నట్లు ఆకర్షణీయమైన బోర్డులు తగిలించి, హంగూ ఆర్భాటాలు ఏర్పాటు చేసి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యం కోసం వస్తున్నవారి ప్రాణాలంటే లెక్కలేని వైద్యం చేస్తున్నారు. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే చాలు…మీడియా..ప్రజా సంఘాలు…రాజకీయ పార్టీలు వస్తాయి. జరిగిన ఘోరాన్ని బ్రేకింగ్‌ల పేరుతో వార్తలు వండి వారుస్తాయి. వారికి న్యాయం జరగాలని కొట్లాడతాయి. మరి అదే ప్రైవేటు ఆసుపత్రిలో జరిగే దారుణాలపై రాజకీయ పార్టీలు కనీసం స్పందించవు. పార్టీల పరంగా ఏదైనా సమస్యలో వెనకపడిపోతున్నామన్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు కదులుతుంటాయి. 

తాజాగా ఈ మధ్య వరంగల్‌లోని ఓ ఆసుపత్రికి వైద్యం కోసం ఓ వ్యక్తి వచ్చాడు. పేరు పెద్దగా వుంది.

 కొత్త ఆసుపత్రి. వైద్యం బాగా చేస్తారనుకున్నాడో ఏమో? కాని వచ్చాడు…ఇక్కడ ఇరుక్కుపోయాడు. సహజంగా ఏదైనా ఆపరేషన్‌ అంటే మొదటిసారే సక్సెస్‌కావాలి. అందులోనూ శరీర అంతరభాగాలలో జరిగే ఆపరేషన్లపై డాక్టర్లకుఎంతో అవగాహన వుండాలి. అనుభవం వుండాలి. పట్టుండాలి. అంతే గాని ఏ పేషెంటు వచ్చినా పట్టుకోవడం, ఇతర ఆసుపత్రుల్లోని వైద్యులను పిలించి వైద్యం చేయిచండం కూడా అలవాటు చేసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని నమ్మించి బాగు చేస్తామని నమ్మించి, ఆపరేషన్‌ చేయాలని ఒప్పించారు. చేశారు. కాని అది వికటించింది. సస్సెస్‌ కాలేదు. ఆ వ్యక్తి మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు. మళ్లీ ఆపరేషన్‌ చేశారు. అప్పుడైనా సస్సెస్‌ అయ్యిందా? అదీ లేదు. మళ్లీ ముచ్చటగా మూడోసారి ఆపరేషన్‌ చేశారు…అదే జరిగింది. ఆపరేషన్‌ మళ్లీ ఫెయిల్‌ అయింది. ఇక లాభం లేదనుకొని ఆ వ్యక్తికి ఈసారి హైదరాబాద్‌ వెళ్లి ఆపరేషన్‌ చేయించుకుంటానని అన్నాడు. కాని ఆ ఆసుపత్రి యాజమాన్యం ఈసారి ఖచ్చితంగా సక్సెస్‌ చేస్తామన్నారు. ఆ వ్యక్తి ప్రాణం పోవడానికి కారకులయ్యారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆపరేషన్‌ చేసి డాక్టరు నీళ్లు నమిలాడు. ఒకసారికే విజయంతం కావాల్సిన ఆపరేషన్‌ నాలుగు సార్లు చేయడం తప్పే అని ఒప్పుకున్నాడు. ఇదిలా వుంటే ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల అండతో ముందు కాస్త భయపడ్డ ఆసుపత్రి యాజమాన్యం..ప్లేటు పిరాయించింది. ఆ వ్యక్తికుటుంబ సభ్యులు, సామాజికవేత్తలు, విద్యార్ధి సంఘాలు పెద్దఎత్తున ధర్నా చేయడంతో సదరు వ్యక్తికి కొంత ముట్ట జెప్పి,చేతులు దులుపుకున్నారు. ఇక్కడే అసలు నిజాలువెల్లడి కావాల్సివుంది….

సంఘటన జరిగిన ఆసుపత్రికి పోలీసులు వచ్చారు. 

అందరితోనూ చర్చించారు. కాని కేసు నమోదు చేయలేదని సమాచారం. ఆసుపత్రి మీద చర్యలకు ఉప క్రమించలేదు. ఆసుపత్రి ముందు ఆందోళన చూశారు. పిర్యాధు చేస్తేనే వచ్చిన పోలీసులు, ఏ కేసు నమోదు చేయకుండానే వెళ్లిపోయారు. ఇక ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ జిల్లా ఉప వైద్యాధికారి కూడా వచ్చాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఎలాంటి రిపోర్టు తీసుకున్నాడో ఏమో! కాని అందరూ కలిసి ఆ కుటుంబం చేత లెటర్‌ రాయించుకున్నారు. చేతులు దులుపుకున్నారు. అసలు ప్రభుత్వ వైద్యాధికారి ఎవరిని కాపాడినట్లు? పోలీసులు వచ్చి ఏం చేసినట్లు? జరిగిన తంతును చూసేందుకు వచ్చారా? మృతుని కుటుంబ సభ్యుల వల్ల లాండ్‌ ప్రాబ్లం వస్తుందని వచ్చారా? లేక నష్టపోయిన కుటుంబానికి న్యాయం చేయడానికి వచ్చారా? అన్నది తెలియాల్సివుంది. వైద్యం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వారి జీవితాలు ఆగం కాలేదా? వారి భవిష్యత్తు అంధకారం చేయలేదా? ఏంతొ కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటే వారి జీవితాలు బాగుపడతాయా? కొండంత అండలాంటి తండ్రి లేకుండా చేసిన వారిపై చర్యలుండవా? రాజకీయ నాయకుల అండతో, అనుభవం లేని వైద్యులతో వైద్యం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 

ప్రభుత్వాసుపత్రిలో ఎలుక కనిపించినా సంచలనమే…

ఆసుపత్రి ఆవరణలో ఏదైనా విషపురుగు సంచరించినా గందరగోళమే…కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులే ప్రజల ప్రాణాలు తీస్తుంటే మాత్రం పట్టించుకునేవారు లేరు. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటిస్తే ఆ క్షణమే ఆ వైద్యుల మీద చర్యలు, బాదిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాలు, ఉద్యోగాలు, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అలా వారికి న్యాయం జరగాలి. కాని ప్రైవేటు లో ఇలాంటి దారుణాలు జరిగితే అదే ప్రభుత్వ అధికారులు ఆసుపత్రులకు వంత పాడుతారు. ఆగమైనకుటుంబాలను గాలికి వదిలేస్తారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారు… ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఆసుపత్రులపై దృష్టిపెట్టాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలి. 

                        వైద్యంకోసం వచ్చిన వ్యక్తికి వైద్యం చేయలేక, ప్రాణాలతో లేకుండా చేసిన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం మీద సంచనల నిజాలు రేపటి నేటిధాత్రిలో…

కమ్యూనిటీ స్థలం’కాజే’శాడు!?

`ప్రైవేటు కాంప్లెక్స్‌ కట్టేశాడు?

`అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నాడు?

`అడిగేవారు లేరు…అధికారులు కూడా అమ్ముడుపోయారు?

`సొసైటీ స్థలంలో ప్రైవేటు నిర్మాణంపై కేసులు!

`అక్రమ కట్టడాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు?

`అయినా అమలు కాలేదు?

`ఫ్లాట్ల అమ్మకాలు ఆగలేదు?

`జరిగి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి ఫైల్‌ అక్కడే!

`కొట్లాడుతున్న వారి చెప్పులు అరడగమే! వారిది అరణ్యరోధనే!!

`ఇప్పటికైనా స్పందిస్తారా? మేమింతే…అమ్ముడుపోయామని చెబుతారా?

`వందల గజాల స్థలం కమ్యూనిటీ హాల్‌ కోసం కేటాయించి, అప్పార్టుమెంట్లు నిర్మిస్తే వదిలేస్తారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: స్థలాలు కాజేయడంలో ఆయన దిట్ట. ఇది జనం మాట. జూబ్లీ హిల్స్‌ ఫిల్మ్‌ నగర్‌ ఏరియాలో అందరూ అనుకునే ముచ్చట. ఆయన ఆక్రమించిన భూ పరంపరలో అన్ని వివాదాలే…జూబ్లీ హిల్స్‌ లోని రోడ్‌ నెంబరు ఐదులో పిల్మ్‌ నగర్‌ ఏరియాలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం ఆరువందల గజాల స్థలం కేటాయించారు. అందరూ దాని గురించి మర్చిపోయారు. కానీ పిల్మ్‌ నగర్‌ క్లబ్‌ కీలక పాత్రదారి మాత్రం టైం చూసి ఎలా దాన్ని సొంతం చేసుకోవాలా? అన్న దాని మీదే నిమగ్నమయ్యాడు. అనుకున్నది అమలు చేశాడు. సమయం చూసి దర్జాగా అక్కడ అప్పార్ట్‌ మెంట్‌ నిర్మాణం చేశాడు. అమ్మేశాడు. దానికి ఎవెన్యూ అనేశాడు. సహజంగా అప్పార్టుమెంట్‌ అంటే రూల్స్‌ వేరు. అవెన్యూ నిర్మాణం రూల్స్‌ వేరు. ఆ నిర్మాణానికి ఎంత కాల మైన సదరు వ్యక్తే ఓనరుగా వుంటాడు. అక్కడ కూడా తన తెలివితేటలు వినియోగించాడు. అయితే కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడం చట్టరిత్యా నేరం. దీనిని ప్రతిఘటిస్తూ కొందరు జిహెచ్‌ఎంసికి పిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆ నిర్మాణం కూల్చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు జీవో కూడా విడుదల చేశారు. కానీ జివో అమలు కాలేదు. నిర్మాణం ఆగలేదు. జరిగిన నిర్మాణం కూల్చేలేదు. ప్లాట్ల నిర్మాణం జరిగిపోయింది. అమ్మకాలు కూడా పూర్తయ్యాయి. ఇది గడిచి రెండేళ్లకు పైగా అవుతున్నా అధికారులు కదిలింది లేదు. అటు వైపు చూసింది లేదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసింది లేదు. ఇలా అధికార యంత్రాంగం అక్రమార్కలకు సహకరిస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నారు. అదే జూబ్లీ హిల్స్‌ లోని అంబేద్కర్‌ నగర్‌ లో పేదలు కొన్ని దశాబ్దాల క్రితం వేసుకున్న గుడిసెలు రాత్రికి రాత్రే తొలగించారు. ఓ వైపు బోరున వర్గం కురుస్తున్న సమయంలో అర్థరాత్రి వేళ పేదలకు ఇండ్లు ఖాళీ చేయించారు. కానీ కమ్యూనిటీ హాల్‌ కోసం కేటాయించిన స్థలంలో ఓ బడా వ్యక్తి ఎవెన్యూ నిర్మాణం చేసి, దర్జాగా కోట్లకు అమ్ముకున్నాడు. దీని వైపు మాత్రం అధికారులు చూడరు. జీవో అమలు చేయరు. పేదలపైనే అధికారుల ప్రతాపం. ఈ నిర్మాణం అక్రమమని కొంత మంది కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు కదలడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అధికారుల అలసత్వం గ్రహించి, అక్రమ నిర్మాణం తొలగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం జరగాలని కోరుతున్నారు.

జయహో బిఆర్‌ఎస్‌

` కారే గెలిచింది…

`దేశ రాజకీయాలను మార్చేందుకు మునుగోడు నుంచి బయలుదేరింది.

`నేటిధాత్రి ముందు నుంచి ఇదే చెప్పింది.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని మరో సారి రుజువైంది.

`గత ఎన్నికలలో చౌటుప్పల్‌ లో చతికిలబడ్డ కారుకు హుషారొచ్చింది.

`ప్రజా వ్యతిరేకత ప్రతిపక్షాలు చేసింత లేదని తరలిపోయింది.

`ప్రజల్లో టిఆర్‌ఎస్‌ మరింత గూడుకట్టుకొని వుందనేది స్పష్టమైంది. 

`టిఆర్‌ఎస్‌ కూడా కొంత మారాలి?

`నాయకులు నిస్తేజం వదలాలి?

` అధికారంలో వుంటేనే పని చేస్తామనే భావన తొలగిపోవాలి?

` ప్రజల్లోకి మరింత విసృతంగా వెళ్లాలి?

`పక్క చూపులు మానుకోవాలి?

`బిజేపి మాయ మాటలను నమ్మి మోసపోవొద్దు?

`కాంగ్రెస్‌ ఓటు టిఆర్‌ఎస్‌ కు బదిలీ!

`కాంగ్రెస్‌ బలహీన పడుతోందా?

`బిజేపికి చేసిన ప్రయోగంలో సక్సెస్‌ కాలేదు?

`తెలంగాణ ప్రత్యామ్నాయం మేమే అని బిజేపి చెప్పాలనుకున్నది…?

`మునుగోడుతో కూడా ఆ పార్టీకి అంత సీన్‌ లేదని తేలిపోయింది.

`బిజేపికి అద్దె నాయకులే దిక్కా?

` బిజేపిలో లీడర్లే లేరా! `క్యాడర్‌ కూడా లేదా?

`కమ్యూనిస్టులు కలిసొచ్చారా? పక్క చూపులు చూశారా!?

మునుగోడు ఉప ఎన్నికలో కారు మరో విజయం తన ఖాతా వేసుకున్నది. ప్రజల హృదయాలలో తన స్థానం చెక్కు చెదరలేదని నిరూపించుకున్నది. టిఆర్‌ఎస్‌( బిఆర్‌ఎస్‌) పార్టీకి ప్రజల్లో మద్దతు స్పష్టమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేదు, తిరుగులేదని మరో సారి రుజువైంది. తెలంగాణ దిక్సూచి, దశ, దిశ కేసిఆరే అని మునుగోడు మరోసారి ఎలుగెత్తి చాటినట్లైంది. అంతే కాదు మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కి టిక్కెట్‌ ఇస్తే కష్టమని ఎంత మంది చెప్పినా, ప్రజలపై తనకున్న నమ్మకం ఎంతటిదో కేసిఆర్‌ రుజువు చేసుకున్నట్లైంది. పైగా రాత్రికి రాత్రి బిజేపిలో చేరి ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారికి అసలు రాజకీయం బోధపడిరది. తెలంగాణ సంక్షేమం కోసం పాటుపడే కేసిఆర్‌ నాయకత్వాన్ని కాదని, బిజేపిని నమ్ముకొని పలుచనయ్యామని వారికి తెలిసిపోయింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడా బిజేపి మాటలు నమ్మి తొందరపడొద్దని టిఆర్‌ఎస్‌ నాయకులకు ఈ గెలుపు గుణపాఠం నేర్పినట్లైంది. బిజేపి వలలో పడేందుకు, పెంచి పోషించిన పార్టీని మోసం చేసి, స్వార్థం చూసుకుందామనుకున్న వారు మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం వారిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. నిన్నటి దాకా ఇక్కడ కాకపోతే అక్కడ రాజకీయం అని ఊహించుకున్న వారికి, లెక్కలేసుకున్నవారి లెక్క తప్పింది. టిఆర్‌ఎస్‌ ను వదిలేస్తే రాజకీయం వుండదని బోధపడిరది. కలలో కూడా టిఆర్‌ఎస్‌ ను, కేసిఆర్‌ నాయకత్వాన్ని వదులుకొని వెళ్తే భవిష్యత్తు లేదని ఇప్పటికే చాలామందికి అర్థమైవుంటుంది. ఇకపై బిజేపి నాయకుల మాటలు వినడానికి కూడా టిఆర్‌ఎస్‌ నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 

మునుగోడులో టిఆర్‌ఎస్‌ కు పదివేల మెజారిటీని కొందరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు.

 ఆఖరుకు వెయ్యి ఓట్లతో గట్టెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు లాంటి వారు కూడా మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయాన్ని చిన్నది చేస్తున్నారు. దుబ్బాక తాను వెయ్యి ఓట్లతో గెలిచే రీ సౌండ్‌ ఇలా వుంటది అని మాట్లాడిరడు. మునుగోడులో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన రీ సౌండ్‌ ను గురించి తేలిక చేయడం అంటే అత్మ స్థుతి, పరనింద కాలేదు. 

నవంబర్‌ సెంటిమెంట్‌ బిజేపిని నాకించేసింది. దుబ్బాక ఉప ఎన్నికల నవంబర్‌ లో జరిగింది. 

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నవంబర్‌ లోనే జరిగింది. మళ్ళీ మునుగోడు ఉప ఎన్నిక కూడా నవంబర్‌ నెలలోనే వచ్చింది. ఇక బిజేపికి ఎదురులేదు. గెలుపు ఖాయమని కలలుగన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు. అయినా సెంటిమెంట్‌ పేరు చెప్పి కూడా ప్రజల ఆలోచనల్లో మార్పు తెద్దామని చూశారు. కానీ కుదరలేదు. మొదటికే మోసం వచ్చింది. నిజానికి దుబ్బాక రఘునందన్‌ రావుకు కలిసివచ్చింది. అక్కడ ఆయనకు సానుభూతి ఓటు తోడయ్యింది. అక్కడ కూడా టిఆర్‌ఎస్‌ పార్టీ మరో నాయకుడికి అవకాశం ఇస్తే రఘునందన్‌ రావు అడ్రసు రాజకీయంగా అక్కడితో గల్లంతయ్యేది. రఘునందన్‌ రావుకు లక్కు ఆ రూపంలో కలిసి వచ్చింది. ఇక హుజూరాబాద్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా అది బిజేపి గెలుపు కాదు. దాని ఖాతాలో పడలేదు. నవంబర్‌ సెంటిమెంట్‌ ఇక్కడ వర్కౌట్‌ అయ్యిందని చెప్పడం అసలే కదరదు. కానీ నవంబర్‌ ను సెంటిమెంట్‌ అస్త్రంగా మార్చుకుందామని చూసి మునుగోడులో బిజేపి నిండా మునిగింది. సెంటిమెంట్‌ అని మళ్ళీ మాట్లాకుండా అయ్యింది. 

మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఆత్మగౌరవం, స్వార్థానికి మధ్య జరిగింది.

 అదేదో సినిమాలో పాట లాగా ఉన్నది కాస్త ఊడిరది. సర్వ మంగళం పాడిరది. తిరుక్షవరమైపోయింది అన్నట్లు వున్న ఎమ్మెల్యే పదవి పోయింది. కోట్లాది రూపాయలు ఖర్చయ్యింది. అతిగా ఆవేశపడిన ఆడది, అతిగా అత్యాశ పడిన వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. అనే డైలాగ్‌ ఇక్కడ నిజమైంది. 2018 ఎన్నికలలో ప్రజలు రాజగోపాల్‌ రెడ్డి ని మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ కృతజ్ఞత రాజగోపాల్‌ మర్చిపోయాడు. ఎంత లేదన్నా కనీసం రాజగోపాల్‌ రెడ్డి కి మూడు వందల కోట్లకు పైగా ఖర్చయ్యివుండొచ్చు. ఆ డబ్బులే నియోజకవర్గంలో ఖర్చు చేస్తే జీవితాంతం అతని నాయకత్వానికి తిరుగువుండకపోయేది. మునుగోడులో ఎలాగూ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లను కూడా ఫిల్టర్‌ చేసే ప్యూరిఫయర్లు ఊరికొకటి ఏర్పాటు చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికలలో కూడా ఆచరించేవారు. ఉప ఎన్నిక కోసం చేసిన ఖర్చుతో మునుగోడు మొత్తానికి సిసి రోడ్లు, స్కూల్‌ భవనాల నిర్మాణం జరిగేది. కానీ అత్యాశకు పోయి చేసిన ఖర్చు వల్ల వచ్చే ఎన్నికలలో ఒక వేళ పోటీ చేసినా నయాపైస లాభం వుండదు. అప్పుడు ఇప్పుడిచ్చిన దానికి మరింత అదనం జోడిస్తే గాని ఇప్పుడు పడిన ఓట్లు అప్పుడు పడవు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లోని అన్ని ప్రాంతాల బిజేపి శ్రేణులు శ్రమించాయి. వచ్చే ఎన్నికలలో ఒక్కడే రాజగోపాల్‌ రెడ్డి ఒంటరి ప్రచారం చేసుకోవాలి. ఇంతకు మించి ఖర్చు చేయాలి. 

మునుగోడు ఉప ఎన్నికతో బిజేపికి తెలంగాణ రాష్ట్రంలో అద్దె నాయకులే దిక్కన్నది స్పష్టమౌతోంది. 

ఎనమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్నా ఇప్పటికీ గెలిచే నాయకుడు ఆ పార్టీలో లేడన్నది తేటలెల్లమౌతోంది. ఈ లెక్కన భవిష్యత్తులో బిజేపికి మళ్ళీ పాత రోజులు తప్ప, మంచి రోజులు కనిపించడం లేదు. గెలుపు గుర్రాలు వస్తే, తప్ప బిజేపి బలపడే పరిస్థితి కనిపించడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి తాము బలపడ్డామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే చిదిమేశారు. మునుగోడు వరకు రాజగోపాల్‌ రెడ్డి బలమైన నాయకుడు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి 2018లో విజయం సాధించాడు. అదే రాజగోపాల్‌ రెడ్డి బిజేపిని నమ్మి, ఆ పార్టీ పంచన చేరి ఓడిపోయాడు. తనకు తానుగా బలవంతుడిని అని చెప్పుకునే చోటనే బలహీనుడయ్యాడు. వున్న బలం కోల్పోయాడు. నాయకత్వం వదులుకున్నాడు. ఎన్నుకున్న ప్రజల చేత ఓడిరపబడ్డాడు. ఒక వేళ రాజగోపాల్‌ రెడ్డి గెలిస్తే ఈ సారైనా ఆ గెలుపును ఖాతాలో వేసుకోవాలని చూసిన బిజేపికి ఆశనిపాతమే మిగిలింది. దుబ్బాక గెలిచినా అది బిజేపి గెలుపు కాదన్నారు. ముమ్మాటికీ రఘునందన్‌ రావు గెలుపన్నారు. రఘునందన్‌ రావు కూడా ఇప్పటి వరకు తన గెలుపు పూర్తిగా బిజేపి వల్లనే సాధ్యమైందని ఎక్కడా చెప్పలేదు. అలా చెబితే తన నాయకత్వం వీక్‌ అవుతుందని ఆయనకు తెలుసు. అందుకే రఘునందన్‌ రావు విజయాన్ని మీడియా బిజేపి ఖాతాలో వేయకపోవడమే మంచిదైందని అనుకునేవారిలో ఆయన కూడా వుంటారు. హుజూరాబాద్‌ గెలిచినా అది స్పష్టంగా ఈటెల రాజేందర్‌ గెలుపుగానే అందరూ చూశారు. రాజేందర్‌ గెలుపును ఎవరూ బిజేపి గెలుపుగా చెప్పుకోవడానికి ఆ పార్టీ నేతలే ధైర్యం చేయలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పుకుందామనుకుంటే అది కూడా దక్కడం లేదు. రాజగోపాల్‌ రెడ్డి ఓడినా వచ్చిన ఓట్లు కూడా ఆయన ఖాతాలోకే వెళ్లిపోతాయి. కొట్లాడిన బిజేపికి ఏమీ మిగలలేదు. మునుగోడు గెలిస్తే రాజకీయం ఆగం చేద్దామనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆరే చెప్పడం జరిగింది. బిజేపి పెట్టుకున్న ఆశలు తలకిందులయ్యాయి. రాజగోపాల్‌ రెడ్డి కి ఇచ్చిన కాంట్రాక్టు ఏమౌతుందో అన్న అనుమానం కూడా చాలా మందే వ్యక్తం చేస్తున్నారు. 

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఓటు టిఆర్‌ఎస్‌ కు మళ్లిందా? రాజగోపాల్‌ ఎత్తుకుపోయాడా? అన్నది కాంగ్రెస్‌ ఆత్మావలోకనం చేసుకోవాలి.

 క్రమంగా కాంగ్రెస్‌ ఇలా ఎందుకు కనుమరుగౌతుందన్న దానిని విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ లో అంతర్గత కుమ్ములాటలు సమసిపోవు. నాయకుల ఆధిపత్య రాజకీయాలు ఆగవు. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ జోడో యాత్ర వుండడం కూడా ఆ పార్టీకి మైనస్‌ అయ్యింది. సీనియర్లు మునుగోడు వైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అందరూ నేనే ముఖ్యమంత్రి అంటారు. అలాంటి వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులే ఎక్కువ. అందులో జానారెడ్డి లాంటి నాయకుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో జాడే లేడు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మునుగోడులో సొంతంగా ప్రచారం చేసింది లేదు. రేవంత్‌ రెడ్డి వచ్చినప్పుడు ,ఆ రోడ్‌ షోలలో మాత్రమే కనిపించాడు. ఇక సీనియర్లలో అన్నింటిలో మేమే ముందు అనే హనుమంతరావు, పొన్నాల, జగ్గారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, మధయాష్కీలు మునుగోడులో మకాం వేసింది లేదు. ప్రచారం చేసింది అంతకన్నా లేదు. స్రవంతిని ఒంటరి చేశారు. ఓటు ఎటువెళ్లినా ఫరవాలేదని పార్టిని గాలికొదిలేశారు. మునుగోడులో ఓట్లు తక్కువైతే రేవంత్‌ ను దించేయొచ్చన్న రాజకీయం తప్ప, పార్టీని గట్టెక్కిద్దామన్న సోయి ఎవ్వరిలో కూడా లేదు. 

ఆఖరుగా టిఆర్‌ఎస్‌ నాయకుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలి.

 టిఆర్‌ఎస్‌ కూడా కొంత మారాలి? తమ నాయకత్వమే కాదు, పార్టీ కోసం పని చేసే సమయం మరింత కేటాయించుకోవాలి. కేసిఆర్‌ చలువతో, పార్టీ ఊపులో గెలుస్తా? గెలవలనుకున్నప్పుడు పక్క చూపులు చూస్తా అన్నట్లు వ్యవహరించకూడదు. టిఆర్‌ఎస్‌ నాయకుల నిస్తేజమే బిజేపికి అడ్వాంటేజ్‌ అవుతుంది. అసలు బిజేపికి రాష్ట్రంలో బలమే లేదు. ఆ పార్టీ లోకి వచ్చే నాయకుల బలగంతోనే బిజేపి బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈ మాత్రం అవగాహన టిఆర్‌ఎస్‌ నేతలకు వుంటే చాలు. బిజేపి అన్న పదమే వినిపించుకోరు. ఇరవై రెండేళ్ల కాలం ఎన్నో విజయాలను చూసిన టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, రెండు వ్యక్తిగత గెలుపులను చూసి బిజేపి వైపు తొంగి చూసే నేతలు ఎప్పటినా ప్రమాదమే.

‘‘కాజా’’ తిన్నంత సులువుగా కబ్జా చేస్తాడు?

`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ..

`ప్రభుత్వ స్థలం హాంపట్‌….

`రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం…

`చోద్యం చూస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం.

`జూబ్లీ హిల్స్‌ క్లబ్‌ మెంబర్‌ షిప్‌ కు డిప్యూటీ కమిషనర్‌ కక్కుర్తి?

`కోట్లాది రూపాయల భూమి సంతర్పణం.

`అక్కడ గజం మూడు లక్షల పైమాటే.

`ముందు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు.

`వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు.

`అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు.

`ఇష్టారాజ్యం…పిల్మ్‌ నగర్లో భూములు భోజ్యం.

`ఫిల్మ్‌ నగర్‌ చుట్టూ ఆక్రమణలే…ప్రభుత్వ భూములు చెరబట్టుడే.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కనిపిస్తే కన్నేయడమే! కాజా తిన్నంత సులువుగా భూమిని కబ్జాపెట్టేయడమే! అతని పని. ఇది జూబ్లిహిల్స్‌లో చాలా మందికి తెలిసిన బాగోతమే! అది ప్రభుత్వ స్ధలమైనా సరే అతను కబ్జా చేస్తాడు. అది జనం నడవాల్సిన రోడ్డైనా సరే…ఆక్రమించేసుకుంటాడు. అక్కడ షెడ్లు నిర్మాణం చేసేస్తుంటాడు. పేరు మాత్రం చాలా పెద్దది. అందుకే ఇలాంటివి చేస్తుంటాడు. ఆ పేరును అడ్డం పెట్టుకొని అడ్డదడ్డమైన పనులు చేయపోతే ఎలా అనుకుంటాడో ఏమో! కాని చెప్పలేనన్ని ఆరోపణలు మూటగట్టుకున్నాడు. అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినా కబ్జా మాత్రం ఆపడు. ఆక్రమణలు వదిలిపెట్టడు. జూబ్లీహిల్స్‌ ఏరియాలో రోడ్డు కూడా ఖాళీగా కనిపించకూడదు. కనిపిస్తే ఇక అంతే…వాటిని ఆక్రమించేయడం…అమ్ముకోవడం..సొమ్ము చేసుకోవడం….కోట్లు కూడబెట్టుకోవడమే…ఆతని పని. ఏ భూమి ఆక్రమించినా దానికో మతలబు ముడిపెడుతుంటాడు. చెప్పడానికో సాకు వుంటుంది. పెద్దోళ్లందరూ ఆయన వెనకాలే వుంటారు. అధికారులు కూడా అతనికే వంతపాడుతుంటారు. ఇక భూములు ఎందుకు ఆక్రమించడు? ఒక రకంగా ఆయన జూబ్లిహిల్స్‌ మున్సిపల్‌ సర్కిల్‌లో ఆయన ఎంత చెబితే? అంత? ఏది చెబితే? అది? చెల్లుబాటు కావాల్సిందే…ఇప్పటిదాకా అవుతున్నదే? అది…ఏ అధికారైనా సరే ఊ అనాల్సిందే..ఊ కొట్టాల్సిందే…! అతను చేసే ఆక్రమణలన్నీంటికీ అధికారులనుంచి అనధికార అనుమతి వున్నట్లే లెక్క. అలాంటిదే ఈ కొత్త భూ ఆక్రమణం…!

  అది జూబ్లీహిల్స్‌లోని మెయిన్‌ రోడ్డు స్ధలం.

 120 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డు మీద గతంలో కొందరు మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే కొంత ప్రభుత్వ స్థలం వుంది. దానిపై ఆ వ్యక్తి కన్ను పడిరది. ఎలాగైనా ఆ స్ధలం సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు సమయం ఆసరాగా తీసుకున్నాడు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించాడు. తొలుత జిహెచ్‌ఎంసి ఒప్పుకోలేదు. దాని వెనకాల ఈ వ్యక్తివున్నాడని తెలియక జిహెచ్‌ఎంసి అధికారులు కాదన్నారు. అసలు విషయం తెలిశాక ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోవడంతో అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇదే అదునుగా అటు విగ్రహ నిర్మాణం చేపట్టారు. ఆ విగ్రహావిష్కరణ పూర్తి పూర్తిచేశారు. ఆ విగ్రహం వెనక వున్న స్ధలం అతను కబ్జా చేశాడు. దానిలో నిర్మాణాల మొదలుపెట్టేశాడు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం అని అనుమానం రాకుండా పూర్తి చేస్తున్నాడు. అందుకు జిహెచ్‌ఎంసికి చెందిన డిప్యూటీ కమీషనర్‌ వ్యవహార శైలి ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో కీలక పాత్ర దారిగా వున్న అతను, డిప్యూటీ కమీషనర్‌కు క్లబ్‌లో సభ్యత్వం ఇస్తానన్న వాగ్ధానం చేసినట్లు తెలుస్తోంది. దాంతో జిహెచ్‌ఎంసి అటు వైపు చూడడం కాని జరగడంలేదు. ఇక టౌన్‌ ప్లానింగ్‌కు చెందిన ఓ అధికారిని కూడా అందుకు సహకరిస్తోందన్న విమర్శలు వున్నాయి. ఫిల్మ్‌ నగర్‌లోని మెయిన్‌ రోడ్డులో స్థలం కాజేయడం అంటే మాటలు కాదు. అధికారుల పూర్తి సహకారంతోనే జరుగుతోంది. 

  ఈ స్ధలంలో వివాదం చాల రోజుల నుంచి నడుతున్నాడు. 

గతంలోనే ఇక్కడ ఓ సదరు వ్యక్తి ఓ రూం వేయడం జరిగింది. దాన్ని కొందరు స్ధానికులు ప్రశ్నించారు. అది జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన స్ధలం కాదంటే వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. స్దానిక నేతలు కొందరు గట్టిగా నిలబడడంతో కొంత కాలం ఆ నిర్మాణం ఆపేశాడు. అది ప్రభుత్వ స్ధలమన్న పక్కా ఆధారాలతో సదరు వ్యక్తిని స్ధానిక నాయకులు అడ్డుకోగలిగారు. అయితే ఎలాగైనా ఆ స్థలం కొట్టేయాలనుకున్న వ్యక్తి, అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుతో మళ్లీ కట్టడం మొదలుపెట్టాడు. ఓ దశలో ఆ విగ్రహ ఏర్పాటును కూడా స్ధానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని వెనక జరుగుతున్న అసలు విషయం తెలియని ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటును అడ్డుకోవద్దని సూచించారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తేనే స్థలం కబ్జా సులువౌతుందని గ్రహించిన సదరు వ్యక్తి, తన అనుకున్నది పూర్తి చేశారు. ముందు ఒక రూం వేశాడు. ప్రహారీ నిర్మాణం చేశాడు. ఎన్నీఆర్‌ విగ్రహం ఏర్పాటు కోసమంటూ చుట్టూ పరదా ఏర్పాటుచేసి, వెనక వున్న స్ధలంలో నిర్మాణం కూడా పూర్తి చేశాడు. అక్కడ అక్రమ నిర్మాణం జరగుతోందని కొందరు వ్యక్తులు జూన్‌నెలలోనే జిహెచ్‌ఎంసికి పిర్యాధు చేశారు. అయితే కేవలం పిల్మ్‌ నగర్‌లో సభ్యత్వం కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ స్ధలంలో డిప్యూటీ కమీషనర్‌ ఆ స్ధలంలో నిర్మాణాలను అడ్డుకోకపోవడం విడ్డూరం. 

 ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటును తొలుత అధికారులు కూడా అనుమతివ్వలేదు.

 విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు కూడా అధికారులే కూల్చేశారు. అదే అదికారులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ పక్కనే వున్న స్థలంలో సదరు వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే చూస్తూ వంత పాడుతున్నారు. ఇలా ప్రభుత్వ స్దలాలను కబ్జా చేయడం ఆ వ్యక్తికి కొత్త కాదని స్ధానికులు అంంటున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతమంటేనే ఇప్పుడు హాట్‌కేక్‌ లాంటిది. అక్కడ గజం ధర సుమారు రూ.3లక్షల పైమాటే. అలాంటి అక్కడ సుమారు 150 గజాల స్థలం ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్‌ 403లో వున్న ఈ స్ధలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణం తొలగించాలని స్ధానికులు డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించుకొని ఇలా నిర్మాణాలు చేయడం నేరం. అయినా అధికారుల అవినీతి మూలంగా, స్వార్ధపరులు ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోడం అలవాటు చేసుకుంటున్నారు. అందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి సహాయకుడైన మరో ఉద్యోగి సహాకారంతో స్థలం కబ్జా బాగోతం తంతుపూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే జూబ్లిహిల్స్‌ సొసైటీలో కీలకభూమిక పోషించే ఆ వ్యక్తి గతంలో ప్రభుత్వ స్థలాలను ఇదే విధంగా కబ్జాలు పెట్టి, నిర్మాణాలు చేసి అమ్ముకున్నట్లు అనేక విమర్శలున్నాయి. వాటిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అయినా అతని దుష్ట చేష్టలు ఆగడం లేదని స్దానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ స్ధలాలను కబ్జా చేస్తున్నవారిని ప్రభుత్వం నిలువరించకపోతే, భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలు వుండవని ప్రజలు కోరుతున్నారు. ఏకంగా రోడ్డు స్థలాన్నే మింగేయాలని చూస్తున ఆ వ్యక్తిని ఇలాగే వదిలేస్తే జూబ్లిహిల్స్‌లో స్ధలాలను మిగలనివ్వడని కూడా అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నేనేంటో చూపిస్త!

`బిజేపి చేత చుక్కలు లెక్కబెట్టిస్త!

`ప్రభుత్వాలను పడగొట్టుడు గొప్పదనమా?

`బిజేపి దురాగతాలు దేశమంతా వివరిస్తా!

`ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ఎండగడత.

`ప్రజలను అప్రమత్తం చేస్తా!

`రాష్ట్రాల నాయకత్వాలను ఐక్యం చేస్తా!

`ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?

`ప్రపంచం ముందు దేశం పరువుతీస్తున్న వారిని ఉపేక్షించాలా.

`దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. 

`ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

`ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల మీద పడాలని చూస్తున్నారు.

` ఈ దుర్మార్గులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి.

`రాజకీయాలలో అహంకారానికి తావులేదు.

`ప్రజలను కోసం పని చేయని పార్టీలకు మనుగడ వుండదు.

`అబద్ధాలు పదే పదే చెప్పి ప్రతి సారీ నమ్మించలేరు..

` ప్రజలను వంచించే పాలన ఎల్లకాలం సాగదు.

`ఇప్పటి దాకా ఒక లెక్క…ఇప్పటి నుంచి కేసిఆర్‌ లెక్క..

`రాసిపెట్టుకోండి…మీ గడియలు లెక్కబెట్టుకోండి.

                            తెలంగాణతో గోక్కున్నోళ్లు ఎవరూ ముందట పడలే! తెలంగాణను ఇబ్బందులకు గురిచేసినవాళ్లేవరూ చరిత్రలో గొప్ప స్ధానం పొందలే…అందులోనూ చరిత్రకే భాష్యం చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను నిందించిన వాళ్లు తమ రాజకీయ సన్యాసాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమకాలంలో కేసిఆర్‌తో కలిసొచ్చిన వాళ్లు తప్ప,కేసిఆర్‌ను తూలనాడిన వాళ్లేవరూ తెలంగాణ రాజకీయాల్లో స్ధానం లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే…భవిష్యత్తులో జరగేదదే! అరవై ఏళ్ల గోస తీర్చడం కోసం, పద్నాలుగేళ్ల పాటు నిరంతర ఉద్యమం చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. చరిత్రలో దేశ స్వాతంత్య్ర పోరాటం తప్ప, మరో పోరాటం ఇంత సుధీర్ఘమైనది ప్రపంచంలోనే లేదు. అంతటి విశిష్టమైనది మలితరం, కేసిఆర్‌ నేతృత్వ తెలంగాణ ఉద్యమం. ఒక రకంగా పవిత్రమైనది. ఉన్నతమైనది. తెలంగాణ వస్తే ఎలా వుండాలో అన్నదానిపై కూడా బ్లూ ప్రింట్‌ తయారు చేసుకొని మరీ తెలంగాణను తీర్చిదిద్దుతున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి తెలంగాణలో రాజకీయాలను అస్ధిర పర్చాలని చూస్తే ప్రజలే క్షమించరు. కేసిఆర్‌ కూడా ఉపేంక్షించరు. పండిరచిన వాడికి తెలుసు పంట విలువ. వండినవారికి తెలుసు వంట విలువ. కుప్ప మీద కూర్చొని తింటా అనేవాడికి ఈ రెండూ తెలియదు. ఇప్పుడు బిజేపి చేస్తున్నది, చేయాలని చూస్తున్నది అదే…అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి రాని బిజేపి నేతలకు తెలంగాణలో రాజకీయాలు చేసే నైతిక హక్కే లేదు. అయినా ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయం అన్నది అందరి హక్కు. దానిని నైతికంగా నిర్వహించాలి. ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల ఆశీస్సులు కావాలి. అంతే గాని ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు కోట్లు ఖర్చు చేస్తాం…రాజకీయాలను అస్థిరపర్చుదామని చూస్తే తెలంగాణలో వున్నది కేసిఆర్‌. ఆయన చూపు ఎంత చల్లనిదో..కోపం నిప్పులు కురిపిస్తది.  

                         తెలంగాణ ఎమ్మెల్యేలను కొనగోలు చేయాలని చూసిన వ్యవహరాన్ని కేసిఆర్‌ ప్రపంచం ముందు వుంచారు. ఇలా జరుగుతుందని బిజేపి కూడా ఊహించలేదు. పైగా నలుగురు ఎమ్మెల్యేల విషయంలో జరిగిన దాన్ని టిఆర్‌ఎస్‌ బైట పెట్టిన నాడు బిజేపి మాట్లాడిన మాటలకు ఏమైనా అర్ధముందా? అంతే కాదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ అడుగు ముందుకేసి యాదాద్రి వెళ్లి మరీ తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఇంత దిగజారుడు తనం రాజకీయాలు ఎక్కడా లేవు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేశాం. ఇక కూల్చాల్సినవి మూడు అంటూ ఎమ్మెల్యేలను పిలిచుకొని మరీ చర్చలు జరిపడం అంటే రాజకీయాల్లో బరితెగింపు తనం తప్ప మరొకటి కాదు. ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ లాంటి విజ్ఞత,విజ్ఞానం, రాజనీతి వున్న నాయకుడు మరొకరు లేదు. ఆసేతు హిమాచలం వరకు ఏ ప్రాంతం ఏమిటి? అక్కడి ప్రజల పరిస్ధితి ఏమిటి? భౌగోళిక పరిస్దితులు ఎలాంటివి? ప్రజల జీవన విధానం ఎలాంటింది? వంటి అనేక అంశాల మీద అవగాహన వున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకుడు కొట్లాడి సాధించిన తెలంగాణను ప్రగతి వైపు నడుపుతుంటే సహకారం విస్మరించారు. తెలంగాణకు న్యాయంగా విభజన సమయంలో ఇచ్చిన హమీల మేరకు నిధులు రాలేదు. ఆస్ధుల పంపకాలు పూర్తి కాలేదు. తర్వాత తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ చెప్పిన మిషన్‌ భగీరధకు నిధులు కేటాయించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి తెలంగాణకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. వీటికి తోడు తెలంగాణకు గతంలోనే ఇచ్చిన అనేక ప్రాజెక్టులు కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారు. ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ వెళ్లిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కుఫ్యాక్టరీ కుదరదన్నారు. ఇలా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వున్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ అస్ధితరను సృష్టించి చలి కాచుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమో దేశం మొత్తం తెలిసేలా చేస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

                          దేశమంతా తిరుగుతా! దేశంలోని అన్ని రాష్ట్రాలను చైతన్యం చేస్తా అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను కూల్చడం అన్నది నైతికత కాదు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అదే పని చేసింది. కాని ఏమైంది. ప్రజలు తిరగబడ్డారు. మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకున్నారు. ఎన్టీఆర్‌ను అంతకు మించి మెజార్టీతో ముఖ్యమంత్రిని చేశారు. ప్రపంచమంతా కీర్తించిన ఇందిరాగాంధీ ఇక తనకు తిరగులేదని, ఎదురులేదనే ఆలోచనకు వచ్చాక చేసిన ఎమర్జెన్సీ, ఎన్టీఆర్‌ను గద్దెదించడం వంటి పనులు మూలంగా ఆమె కీర్తి మసకబారింది. ఇప్పుడు అదే దారిలో బిజేపి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందనేది కేసిఆర్‌ చేస్తున్న ప్రధాన ఆరోపణం. మహారాష్ట్ర, గోవా, మధ్య ప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలిసిందే. అక్కడ ఎలాగైతే ప్రభుత్వాలను కూలదోసి, బిజేపి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారో…తెలంగాణ,డిల్లీ,రాజస్ధాన్‌లలో కూడా అమలు చేసేందుకు బిజేపి కుయుక్తులు పన్నుతున్నారన్నదానిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ బైటపెట్టారు. బిజేపి కటప బుద్దిని చీల్చి చెండాడాడు. 

                  ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న బిజేపిని ప్రజల్లోనే ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ పర్యటన కూడా చేపట్టే అవకాశం వుంది. ఎందుకంటే దేశ ప్రధాని ఎంతో హుందాగా వ్యవహారించాల్సి వుంది. కాని బెంగాల్‌ రాష్ట్రంలో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారని చెప్పడం ఏమిటని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రశ్నించారు. ఎంత సేపు రాజకీయాలేనా? ప్రగతి గురించి ఆలోచించేందేమైనా వుందా? అని నిలదీశారు. ఈ ఎనమిదేళ్ల కాలంలో ప్రభుత్వాలను కూల్చడం తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టైనా నిర్మాణం చేశారా? అని అన్నారు. ప్రభుత్వ ఆస్ధులు అమ్మకాలకు పెట్టడమే పనిగా బిజేపి పెట్టుకున్నదని ఆరోపించారు. ఇందుకోసమే స్వాముల అవతారంలో వున్న బ్రోకర్లు పనిచేయడం ఏమిటన్నారు. ఎక్కడైనా చూశామా? ఇలాంటి దురాగాతాలు అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు అప్రమత్తం చేయాల్సిన అవసరం వుంది. గతంలో ఇలాగే చంద్రబాబు తెలంగాణ అస్ధిరతకు పాల్పడే కుట్ర చేశారు. కాని జరగలేదు. ఇప్పుడు బిజేపి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తోంది. అసలు తెలంగాణ రావడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు జీర్ణించుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతీసారి దేశంలో ఏ సమస్య లేనట్లు తెలంగాణ మీద మాట్లాడడం ప్రధానికి అలవాటైపోయింది. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో అన్నాడు. తాజాగా పార్లమెంటు తలుపులు మూసి, తెలంగాణ ఇచ్చారని అన్నాడు. అంటే ఆయనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సుతారం ఇష్టం లేదని చెప్పకనే పలు మార్లు ప్రస్తావించారన్నది ఎప్పుడో తెలిపోయింది. 

                        తెలంగాణలోని సాగు విషయంలో ప్రతీసారి కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతూనే వుంది. బియ్యం కొనుగోలులోనూ ఇదే తంతు. ప్రతి సారి ఏదో రకమైన ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. తెలంగాణలోని రైతులు వినియోగిస్తున్న కరంటు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం బిజేపికి ఇష్టం లేదు. సాగు మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలన్నది బిజేపి నిర్ణయం. దాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడు. అందువల్ల తెలంగాణలో రాజకీయాలు అస్ధిరం చేయాలి. ప్రజల మద్దతుతో గెలిచే అవకాశం రాదు. కేంద్ర అధికారాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని కూలదోస్తే తమ ఇస్టానుసారం వ్యవహరించొచ్చన్నది బిజేపి వ్యూహం. కాని ఇక్కడ వున్నది కేసిఆర్‌…ఆయన ఒక్కసారి కమిటైతే… మిగతాది మీ అందరికీ తెలిసిందే!!

మునుగోడు కారుదే!

`అనూహ్యమైన మెజారిటీతో టిఆర్‌ఎస్‌ గెలుపు!

`20 వేల నుంచి 25 వేల మెజారిటీ అవకాశం.

`నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌.

`ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి.

`విద్యుత్‌ మోటార్లకు మీటర్లు ఒక అంశమైంది.

`రాజగోపాల్‌ రెడ్డిపై టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేసిన కాంట్రాక్టు విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి.

`ఫ్లోరైడ్‌ బాధ తీర్చిన పార్టీగా టిఆర్‌ఎస్‌ వైపు నిలిచిన జనం.

`ఈ ఎన్నికలలో సురక్షితమైన మంచి నీటి ప్రభావం కూడా రాజకీయంలో భాగమైంది.

`ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో టిఆర్‌ఎస్‌ పాత్రపై మొదటి సారి నేటిధాత్రి ప్రస్తావన.

`అదే ప్రతిపక్ష పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నించే దాకా వెళ్లింది.

`ఒక దశలో ఫ్లోరైడ్‌ సమస్యపైనే ప్రచారమంతా కేంద్రీకృతమైంది.

`ఆ క్రెడిట్‌ అంతా టిఆర్‌ఎస్‌ కే వెళ్లింది.

`కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ దక్కే అవకాశం లేకపోలేదు.

`రాజగోపాల్‌ రెడ్డిపై అసలైన బిజేపి శ్రేణుల అసంతృప్తి.

`రాజగోపాల్‌ రెడ్డి నాన్‌ లోకల్‌… కూసుకుంట్ల లోకల్‌ అనేది కూడా ప్రజలను ఆలోచింపజేసింది.

`ఎన్నికలైపోగానే రాజగోపాల్‌ రెడ్డి ఆస్ట్రేలియా ప్రయాణం అన్న అంశం కూడా తోడైంది.

`చండూరులో సిఎం సభ ప్రభావం కూడా కనిపించింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడులో కారు జోరు కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌ ల పరిస్థితి ప్రచారం జరిగినంతగా పోలింగ్‌ రోజు కనిపించలేదు. పోలింగ్‌ సరళిని బట్టి చూసినా బిజేపి, కాంగ్రెస్‌ లకు ఆశనిపాతమే ఎదురైంది. రాజగోపాల్‌ రెడ్డి తనకు తానుగా ఊహించుకున్నంత ఓటు బ్యాంకు ఆయనకు కనిపించలేదు. మునుగోడు ఉప ఎన్నిక కు ముందు నెల రోజుల పాటు నేటిధాత్రి సర్వే నిర్వహించింది. దాదాపు అన్ని గ్రామాల ప్రజలను నేటిధాత్రి బృందం కలిసింది. ఆ గ్రామాలలో ప్రజల ఆలోచనా సరళి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రతి గ్రామంలోనూ కొంతమందిని నేరుగా ప్రశ్నించడంతో పాటు, ఆయా గ్రామాలలో ప్రజల చర్చలను కూడా ఆసక్తిగా నేటిధాత్రి బృందం వినడం జరిగింది. ఏ ఉప ఎన్నికైనా ఏదొ ఒక బలమైన కారణం అంటూ వుంటుంది. ఈ మధ్య గత మూడేళ్ల కాలంలో తెలంగాణలో వచ్చిన ఉప ఎన్నికల విషయానికి వస్తే ముందుగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక జరిగింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపిగా ఆయన పోటీ చేసి గెలిచారు. దాంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ బిజేపి గెలిచింది. దుబ్బాక నుంచి బిజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌ రావు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో పాటు గతంలో రెండు సార్లు ఓటమి సానుభూతి ఆయనకు కలిసివచ్చింది. అయినా ఆయన గెలిచింది కేవలం పదకొండు వందల ఓట్ల మెజారిటీ మాత్రమే. అయినా అది రఘునందన్‌ రావు వ్యక్తి గత గెలుపు ఖాతానే. తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక లో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. దుబ్బాక గెలుపుతో బిజేపి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికపై బోలెడు ఆశలు పెట్టుకున్నది. కానీ బొక్కబోర్లా పడిరది. తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక. అది బలమైన రాజకీయ కారణం వల్ల వచ్చింది. అది కూడా ఈటెల వ్యక్తి గత గెలుపు ఖాతాలోనే పడిరది. ఈ ఉప ఎన్నికలన్నీ సహజ సిద్ధంగా వచ్చినవి. మునుగోడు అలా కాదు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థంతో వచ్చిందనేది ప్రజలు కూడా బలంగా నమ్మారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థ పూరిత రాజకీయాన్ని ఎండ గట్టడంలోనూ, ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ టిఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయ్యింది.మునుగోడు మొదటి నుంచి బిజేపి హైప్‌ క్రియేట్‌ చేసి, దానిని వాడుకుందామని చూసింది. 

కానీ బిజేపి అనుకున్నంతగా ప్రజలు నమ్మలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక హుజూరాబాద్‌ ను మించి కాస్ట్లీ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీలన్నీ ప్రచారం చేశాయి. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచే అన్ని పార్టీల ప్రచారం మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం మరింత ఊపందుకున్నది. ఈ దశలో టిఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా గ్రౌండ్‌ ప్రచారం విసృతంగా చేపట్టింది. టిఆర్‌ఎస్‌ కు చెందిన మంత్రులు రోడ్‌ షోలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి దాకా వెళ్ళి ప్రచారం చేశారు. ప్రజలను విసృతంగా కలిసి, ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రచారం చేశారు. ధరల పెరుగుదల, విద్యుత్‌ మోటర్లకు మీటర్లు వంటి అంశాలను ప్రజలకు మరింతగా వివరించారు. ప్రజల్లో వున్న కొన్ని అపోహలను టిఆర్‌ఎస్‌ నాయకులు నివృత్తి చేశారు. గతంలో పడిన గోసను గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితులకు, అప్పటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకునేలా చేశారు. కుల సంఘాల ప్రత్యేక సమావేశాలు టిఆర్‌ఎస్‌ విసృతంగా నిర్వహించింది. బిజేపి తెలంగాణ కు చేస్తున్న అన్యాయం బాగానే వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్య తీరడంలో టిఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర, ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవ, ప్రభుత్వ పనితీరు, మిషన్‌ భగీరథ విజయం వంటి అంశాలపై నేటిధాత్రి కొన్ని రోజుల పాటు ప్రస్తావిస్తూ వచ్చింది. అది మునుగోడులో అనేక చర్చలకు దారి తీసింది. చర్చా వేదికలలో ప్రధాన అంశమైంది. టిఆర్‌ఎస్‌ ఆ విషయాన్ని బాగా ఓన్‌ చేసుకున్నది. ప్రజలను కదిలించింది. ఫ్లోరైడ్‌ పై పోరాటం చేసిన స్వామి చేత ప్రజలను నిజాలు చెప్పించే ప్రయత్నం టిఆర్‌ఎస్‌ చేసింది. మంత్రి కేటిఆర్‌ కూడా ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీడియా కూడా ఫ్లోరైడ్‌ పై రకరకాల చర్చలు చేపట్డింది. ప్రతిపక్షాలు కూడా ఫ్లోరైడ్‌ రహిత మునుగోడులో తమ పాత్ర చూపించుకోలేకపోయారు. బిజేపికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. అయినా అబద్దాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వికటించింది. కాంగ్రెస్‌ ఫ్లోరైడ్‌ జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పటికే విమర్శల జడివాన కాంగ్రెస్‌ ను అతలా కుతలం చేసింది. రాజగోపాల్‌ రెడ్డి ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఏం చేయాలో తోచని స్థితిలో రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించిన మునుగోడు మ్యానిఫెస్టో మొదటికే మోసం చేసింది. ప్రజలు ఆ మ్యానిఫెస్టోను చూసి నవ్వుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా మునుగోడును అభివృద్ధి చేయలేననే చేతులెత్తేసిన రాజగోపాల్‌ రెడ్డి మళ్ళీ గెలిచినా చేసేదేమీ వుండదని ప్రజలు నిర్ణయించుకున్నారు. టిఆర్‌ఎస్‌ కు ఓటేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే వున్నందున ఈ ఏడాది కాలంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగోడును తీర్చిదిద్దుతుందని నిర్ణయానికి వచ్చారు. ఓట్లేశారు. సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. వారిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రతిపక్షాలు చెప్పే ప్రతి మాటను ప్రజలు గమనిస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. వున్నా తెలంగాణలో అమలవుతున్న పెన్షన్లు ఇతర రాష్ట్రాలలో అందడం లేదు. ఇక కరంటు కష్టాలు చూసిన తెలంగాణలో నిరంతర విద్యుత్‌ అందుతోంది. రైతులకు అవసరమైన విద్యుత్‌ ఉచితంగా అందుతోంది. దేశంలో ఎక్కడా లేని రైతు బంధు తెలంగాణలో అమలౌతోంది. ఇక ఆసరా పింఛన్లు వయసు మళ్ళిన వారి జీవితాలను నిలబెడుతున్నాయి.

దివ్యాంగుల పింఛన్లు ఏ రాష్ట్రంలో లేనంతగా ఇస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతృప్తికరంగా వున్నారు. వీటికి తోడు మంచినీరు. గత ఎన్నికలలో రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి గెలిపించినందుకు ఆయన పార్టీ మారడం ప్రజలకు నచ్చలేదు. రాజగోపాల్‌ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని ప్రజల బలంగా నమ్మారు. మళ్ళీ రాజగోపాల్‌ రెడ్డి ని గెలిపించినా, రాజకీయం తప్ప, అభివృద్ధి చేసేదేమీ వుండదని ప్రజలు గ్రహించారు. ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి చేతులెత్తేశాడు. పోరాటం చేయాల్సిన సమయంలో మరో పార్టీలొకి వెళ్లాడు. మళ్ళీ ఎన్నిక తెచ్చినా, ఆయన గెలిచినా మళ్ళీ ప్రభుత్వం పనులు ఇవ్వడం లేదని చేతులెత్తేస్తాడు. తన చేతగాని తనాన్ని ప్రభుత్వం మీద నెట్టేస్తాడు. అందువల్ల వున్న ఈ ఏడాదైనా అభివృద్ధి జరగాలంటే టిఆర్‌ఎస్‌ నే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక రాజగోపాల్‌ రెడ్డి ముందు పార్టీ శ్రేణులను నమ్మించి, చివరికి చేతులెత్తేశాడు. వచ్చే ఎన్నికలలో చూసుకుందామని చెప్పి కార్యకర్తలను నారాజ్‌ చేశాడు. బిజేపి లో కూడా రాజగోపాల్‌ రెడ్డి అంటే అసంతృప్తి పెరిగిపోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా ఎన్నిక దగ్గరకు రాగానే రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించింది. నాయకులంతా మునుగోడును వదిలేశారు. పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు. అయితే ఆ పార్టీ నాయకులు, అభిమానులు మాత్రం కాంగ్రెస్‌ కే ఓటు వేశారు. ఇక బిఎస్పి కూడా డబ్బు పంపకం అంతొ ఇంతో చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కూడా ఓట్లు చీలుస్తోంది. మొత్తం టిఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంకు, ఆసరా, ఇతర పించన్‌ దారులు, రైతులు మొత్తంగా టిఆర్‌ఎస్‌ వైపే నిలిచారు. కారుకు ఓటేశారు. కేసిఆర్‌ నాయకత్వానికి మరో సారి మునుగోడు ద్వారా మద్దతుగా నిలిచారు.

ఓటు నీ ఆయుధం

దానిని అమ్మకానికి పెట్టకు…

నోటు కోసం ఎదురుచూడకు..

నోటు పట్టుకొచ్చేవాడిని చీకొట్టు…

ప్రలోభాలకు గురికాకు…

ఆగం‌ కాకు..

నిజాయితీ గా ఓటేసి గర్వపడు…

మనస్సాక్షి చెప్పిందే విను..

ఓటు పవిత్రమైనది…

మీ జీవితాలను మార్చేది.

ఒకనాడు ఎన్నికలంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఓటు వేసే సమయంలో మనస్సాక్షి, ఆత్మసాక్షితో వేసేవారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు గురై నాయకులు చెప్పిన మాటలకు తలొగ్గుతున్నారు. ఓటును అపహాస్యం చేస్తున్నారు. ఓటు ఎంతో పవిత్రమైనది. ఇప్పుడున్న కాలంలో నిస్వార్ధ నాయకులు లేరు. స్వార్థపరులు తప్ప నిజాయితీ పరులు కానరారు. ఈ డెబ్బై ఏళ్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను చెడగొడుతున్నారా? నాయకులు ప్రజలను ప్రలోభ పెట్టి ఎన్నికలలో గెలుస్తున్నారా? అన్న దానిపై ఎంత చర్చ జీడిపాకంలా సాగుతుందే తప్ప, ముగింపు గురించి ఆలోచించే వారు లేకపోతున్నారు. ఎన్నికలలో గెలిచి నాయకులు చేసేదేమీ లేదు. తమకు ఉపయోగపడేదేమీ లేదు. అందుకే ఓటుకు నోటు తీసుకుంటున్నామనేది కొందరి వాదన. ప్రజలు అడిగి మరీ తీసుకుంటుంటే పోటీ ప్రపంచంలో నోటు పంచక తప్పడం లేదంటున్నారు నాయకులు. ‌ఎవరు ఎవరికి ఈ జాఢ్యం అంటించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అపవాదును జనం మీదకు తోసేస్తున్నారు నాయకులు. ఓ ముప్పై ఏళ్ల క్రితం వరకు ఓటుకు నోటు పంచడం అన్నది లేదు. తెలియదు కూడా… అయితే అప్పుడు నాయకుడు కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. పార్టీని చూసి ఓటు వేసేవారు. ఇప్పుడూ జనం అదే చేస్తున్నారు. కానీ నాయకుడు గురించి తెలుసుకుంటున్నారు. నాయకుడు ఎంత మంచివాడైనా నోటు పంచకపోతే ఓటు వేసే పరిస్థితి లేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం నోటు పంచక తప్పని పరిస్థితి. ఇది ప్రజల బలహీనత అని మాత్రం అంటే తప్పవుతుంది. ప్రజలకు నాయకులే అలవాటు చేశారు. ఎన్నికలలో పోటీ నాయకులు ఖర్చు చేయాల్సిన దెంత? ఖర్చు చేస్తున్నదెంత? ప్రజలకిచ్చేవి లెక్కలోకి రాని ఖర్చు. గెలిచాక ఆ నాయకుడు సంపాదన అంతకు వందల రెట్లు. ఇది ప్రజలు గమనించడం లేదు. నోటు తీసుకున్నాక అడిగే హక్కు ఓటరు కోల్పోతున్నాడు. ఒకప్పుడు నాయకుడు ఎన్నికల సమయమైనా, మామూలు సమయమైనా ప్రజలంటే వంగి వంగి దండాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు జనం చేతనే దండాలు పెట్టించుకుంటున్నారు. దండలు వేయించుకుంటున్నారు. ఎన్నికలలో గెలిచాక దండం‌ పట్టుకొని వాయిస్తున్నారు. పన్నుల వడ్డింపులతో నడ్డి వాయగొడుతున్నారు. అయినా జనంలో మార్పు రావడం లేదు. ఎన్నికల నాడు జనానికి రూకలు పంచడం కోసం నాయకులు వ్యాపార మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రజాసేవ గాలికి వదిలేస్తున్నారు. అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు. గెలుపు గుర్రాలు కావడానికి చేయకూడని పనులన్నీ చేసి సంపాదిస్తున్నారు. ఎన్నికల నాడు మెతుకులు విదిల్చి ఓట్లు కొంటున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టి, ఓటరు తనను తాను నిందించుకునే స్థితి తెచ్చిన నాయకుడి నోట నోటు అన్న పదం రానీయకుండా చేయండి. ఓటును కొనుక్కోవచ్చన్న దరిద్రపు ఆలోచన వున్న నాయకుడి భరతం పట్టండి. నోటు కాదు నగరం బాగు చేయండి అని చెప్పండి. ధరల మోత కాదు, సరసమైన ధరలుండేలా చూడమని నిలదీయండి. రోడ్లేయమని అడగండి. విద్య, వైద్యం ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేయండి. యువతకు ఉపాధి చూపించమని చెప్పండి. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ప్రభుత్వం ద్వారా సహకారం చేయమని సూచించండి. లేకపోతే నాయకుడి మాట నీళ్ల మూట అవుతుంది. డబ్బులు తీసుకొని ఓటేస్తే రాసిచ్చిన బాండ్ పేపర్లకు కూడా విలువుండదు. ఎన్నికల సమయంలో అలా రాసిచ్చే తప్పుడు వాగ్థానాలకు చట్ట బద్దత వుండదు. నైతికత అన్నది రాజకీయాలలో ఏనాడో కనుమరుగైంది. నీతి, న్యాయం మాటలకే పరిమితమైంది. అవినీతి రాజ్యమేలుతోంది. పేదోడి జీవితంతో రాజకీయం ఆటాడుకుంటోంది. అది మారాలి. సమాజంలో మార్పు రావాలి. అందుకు ముందు ఓటరు మారాలి. నోటు పట్టుకొని వచ్చి ఓటు కొనజూచిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. ఆ పార్టీ ఇవ్వలేదు, ఈ పార్టీ ఇవ్వలేదని లెక్కలేసుకునేవి కాదు ఎన్నికలు. ప్రజల తలరాత మార్చేవి ఎన్నికలు. ప్రజా పరిపాలనలో ప్రజలు అమ్ముడుపోవద్దు. నాయకుడికి ఓటును కొనుగోలు చేసే అవకాశం ఇవ్వొద్దు. మనల్ని పాలిచేందుకు ముందుకొచ్చిన వారిలో మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు ఒక మార్గం. ఆ మార్గంలో అనేక ప్రలోభాలుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. ఏయే పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయకులు ఎలాంటివారు? వారి పరిస్ధితి ఏమిటి? వారు ఎంత వరకు మేలు చేయగలరు? ఎవరు ఎంత స్వార్ధపరులు.. ..నిస్వార్ధపరులు. ఎంతోకాలం నుంచి రాజకీయల్లో ఉన్నవారు ఎవరు? ఇంత కాలం ఏంచేశారు. ఎవరు ఎక్కవకాలం సామాజిక సేవ చేస్తున్నారు. ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసినవారు ఎవరు? ఇలా అన్ని రకాల విషయాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయడం అన్నది ప్రతి ఓటరు విధి. నాకు వీలు కాలేదు..నేను వెళ్లలేదు?

ఇలాంటి మాటలు చెప్పకండి. మరీ ఇబ్బంది పడి వెళ్లలేని పరిస్ధితి ఉన్నవారు తప్ప ఓటు వేయడానికి అనుకూలంగా,ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఎంత దూరంలో ఉన్నా వెళ్లి ఓటు వేయండి. అంతే కాదు మంచో చెడో గాని ఆయా గ్రామాలలో ఓటు ఉండి, దూరం ఉన్న వారిని పార్టీలు కూడా రప్పించేందుకు సహకరిస్తాయి. కనీసం అలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక్క పూట పనిపోతే, నష్టపోయేదేమీ ఉండదు. కాని ఆ ఒక్క రోజు సమాజం మీద ఎంతో ప్రభావం చూపే రోజు కూడా. ప్రజల తలరాతల్ని మార్చే రోజు కూడా…అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా విద్యావంతులు ఓటు హక్కుపై ప్రజలకు అవాహన కల్పించాలి. కొందరు మేధావులు ప్రజలకు చైతన్యం నేర్పేవారు కూడా ఓటు వేయని వారు వున్నారు. ఓటు వేయం అనడం నైతికత కాదు. ఓటు వేయొద్దని చెప్పడం నేరం. అయితే సమాజంలో కొన్ని వ్యవస్ధలు ఓటును భహిష్కరించడం వంటివి చేసేవారు. అది కూడా నిరసనలో ఒక భాగమన్న మాట చెప్పేవారు. కాని అది సరైంది కాదు. అందుకే ఎన్నికల సంఘం నోటా కూడా తెచ్చింది. దాంతో ఓటును భహిష్కరించడం తగదు. ఎవరూ నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి కూడా మార్గం వుంది. అందువల్ల ఓటు వేయండి. నిత్యం సోషల్‌ మీడియాలో సమాజం గురించి, దేశం గురించి చెప్పేవాళ్లు కూడా చాల మంది ఓటు వేయరు. నిజానికి వాళ్లే ముందు ఓటు వేయాలి. ఇక మరి కొందరు పెద్ద క్యూలైన్‌ వుందని, తర్వాత చూద్దామంటారు. ఆఖరుకు ఓటు వేసే సమయం పూర్తయ్యాక బయలుదేరుతుంటారు. ఓటు వేయకుండనే వెనక్కి వస్తుంటారు. మరి కొందరు తమ పోలీంగ్‌ బూత్‌ను ఎక్కడో అర్ధం కావడం లేదని తిరిగి వచ్చేవారు వున్నారు. ఇలా రకరకాల కారణాలతో ఓటు వేయకుండా వుండేవాళ్లు కూడా సమజంలో సగం మంది వుంటున్నారు. అందుకే నూటికి నూరు శాతం కాకపోయినా, కనీసం 90శాతం ఓటింగ్‌ కావాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఎక్కడా మొత్తం ఓటింగ్‌ అయిన దాఖలాలు లేవు. కనీసం 70శాతం కూడా ఓటింగ్‌ నమోదు కాని సందర్భాలు అనేకం వున్నాయి. కొన్ని సార్లు మరీ ఘోరం. కనీసం 50శాతం కూడా పోలింగ్‌ కాని రోజులున్నాయి. ముపై ఐదుశాతం దాటని ఎన్నికలు కూడ వున్నాయి. ఇలాంటి పరిస్ధితులు వుంటాయని రాజ్యాంగ పెద్దలు ఊహించి వుండరు. అవగాహన లేకనో, అర్ధం కాకనో, ఓటు వేయడానికి రాని వారుంటారేమోగాని, ఓటు వేయడానికి బద్దకించి రాని వారు వుంటారని మన పెద్దలు అనుకోని వుండరు. ఈ తరం కన్నా…గత తరమే మిన్న గత ఇరవై ఏళ్ల క్రితం ఓటు పోతే, ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటరు లిస్టులో పేరు లేకుంటే నానా హంగామా చేసేవారు. ఓటు లేకపోతే పోయినట్లే అని అనుకునేవారు. అంతగా ఓటును పవిత్రంగా చూసుకునేవారు. ఇప్పుడు ఓటు ఉండాలి. అంత వరకే. ఓటు వేయడానికి మాత్రం రావడానికి ఇష్టపడరు. ఆ రోజు సెలవైనా రారు. ఒక్కరోజు సెలవు దొరికిందని ఎంజాయ్‌ చేసే రకాలు కూడా ఉన్నారు. ఇక ఐటి రంగం పెరిగిన తర్వాత ఓటు అంటే మరీ లెక్కలేకుండా పోయింది. ఉద్యోగానికి మాత్రం ఓటరు కార్డు కావాలి. కాని ఓటు వేయడానికి మాత్రం రారు. ఇప్పటికీ ఓటు ఒక వేళ గళ్లంతైతే ఆగం చేసేది నిన్నటి తరమే కాని, నేటి తరం ఓటు వుందా? లేదా? గల్లంతైందా? ఎందుకైంది? అని కూడా చూసుకునే తీరిక లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు. ఓటును అందరూ పొందాలి. అందరూ ఓటు వేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత ఫరిడమిల్లుతుంది. ప్రపంచంలోనే మనది అత్యంత పెద్ద రాజ్యాంగం. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం. 

 అందరికీ ఓటు కొట్లాడి సాధించుకున్నది

మనం ఈ తరంలో తెలంగాణ ఎలాగైతే కొట్లాడి సాధించుకున్నామో…అలాగే రాజ్యాంగ రచన కాలంలో, మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ కొట్లాడి మరీ సాధించిందే ఓటు. ఓటు ఎలా ఉండాలన్నదానిపై నాడు పెద్దఎత్తున చర్చ జరిగింది. చాలా వరకు సంపన్నులకు ఓటు ఉంటే చాలన్నారు. పురుషుల కు ఓటు ఉండాలన్నారు. కాని ఒక్క బాబాసాహెబ్‌ అంబెద్కర్‌ మాత్రమే అందరికీ ఓటు హక్కు వుండాలన్నారు. ధనిక, పేద, కులం, మతం, మగ, ఆడ అన్న తేడా లేకుండా యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కరికీ, మన దేశంలో నివసిస్తున్న వారందరకీ ఓటుహక్కు ఉండాలని పట్టుపట్టి ఓటు హక్కు కల్పించారు. స్వేచ్ఛాయుత సమాజ నిర్మాణం గావించారు. సమాజంలో పాలన అందరి సొందరి సొత్తన్నాడు. అందరూ పాలనలో పాలు పంచుకోవాలన్నారు. బలహీన వర్గాలు పాలనలో పాలు పంచుకోవాలన్నారు. సమాజానికి దగ్గరగా వున్నా, మను షులకు, వారి మనసులకు దూరంగా వున్న వారు కూడా పాలనలో భాగస్వామ్యం కావాలని రిజర్వుడు స్ధానాలు కల్పించాడు. ఎస్సీ, ఎస్టీలను చట్టసభలకు పంపేందుకు మార్గం వేశాడు. సమజాంలో అధికంగా వున్న బలహీన వర్గాల ప్రాతినిధ్యం, ప్రాదాన్యం వుండాలని బలంగా కోరుకున్నాడు. నిండైన రాజ్యాంగాన్ని నిర్మించాడు. మనకు వరంగా ప్రసాదించాడు. ఆ రాజ్యంగఫలాలు అందరూ అందుకోవాలి. రాజకీయ పాలనా పరమైన ప్రజాస్వామ్య విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలి.

ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.

రాజగోపాల్‌ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక. 

నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది.

ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక.

ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం.

రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు.

ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు.

మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం.

ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి…

ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు!

గెలుపు, బలాబలాలపై ఆరాలు…

మునుగోడు పోలింగ్‌ పై ఎన్నికల కమీషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మూడు నెలలుగా సాగుతున్న మునుగోడు ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. గ్రామాల్లో మైకుల మోత ఆగిపోయింది. ఒక్కసారిగా తుఫాను వెలిసినట్టు వాతావరణం చల్లబడ్డది. కాని లోపల ఈ గరం కనిపిస్తూనే వుంది. ప్రచారానికైతే స్వస్తి జరిగింది. కాని అసలు కథ ఈ రోజే మొదలౌతుంది. ప్రలోభాల పరిఘట్టం ఈ రోజే శ్రీకారం జరుగుతుంది. ఉప ఎన్నిక రోజు సాయంత్రం దాకా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నిక కోసం సర్వం సిద్దం చేసింది. యంత్రాంగం సిద్ధమైంది. పూర్తి బందోబస్తు మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, బలగాలను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మూడు నెలల క్రితం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. 

బిజేపి తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి రాజగోపాల్‌రెడ్డి రెండేళ్ల కిందనుంచే బిజేపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే చెప్పుకున్నాడు. ఇదిలా వుంటే బిజేపికి వెళ్లడానికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్ధితి అంతకంతకూ దిగజారుతోందని టిఆర్‌ఎస్‌లో చేరాలని పలు ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. ఈ విషయం సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా టిఆర్‌ఎస్‌ గాని, బిజేపిలోకి గాని వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అయితే టిఆర్‌ఎస్‌లోకి ఆయన ఆహ్వానించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. కోమటిరెడ్డి సోదరులు ఒక్క మాట మీద నిలబడే వ్యక్తిత్వం వారిలో లేదని కేసిఆర్‌ చెప్పినట్లు కూడా కేటిఆర్‌ వివరించడం జరిగింది. ఆయను నమ్మిన రాజశేఖరరెడ్డిని, జగన్‌ను మోసం చేశారని, అలాంటి వారు అవకాశవాదులని చెప్పడం జరిగిందన్నది కేటిఆర్‌ చెప్పడం జగింది.  

 రాజగోపాల్‌రెడ్డి స్వయంగా కేటిఆర్‌ను కలిసి తాను టిఆర్‌ఎస్‌లో జాయినౌతానని కూడాచెప్పినట్లు వెల్లడిరచారు. 

అంతే కాకుండా చాల మంది నేతలతో కూడా రాయబారాలు పంపినా మా పార్టీ రాజగోపాల్‌ను దరి చేరనీయలేదు. దాంతో ఆయన బిజేపి వైపు చూసినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా తన కొడుకు వ్యాపారమైన సుషి ఇన్‌ఫ్రా కోసం రూ.18వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా వచ్చేందుకు బిజేపి సహకరించడంతో ఆ పార్టీలో చేరినట్లు రాజకీయ ఆరోపణలున్నాయి. కాకపోతే కాంట్రాక్టుకు సంబంధించిన విషయం రాజగోపాల్‌రెడ్డే చెప్పడంతో రాజకీయ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. ఎప్పుడైతే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాడో అప్పటినుంచి రాజకీయ పార్టీలన్నీ మునుగోడులో మకాం వేశాయి. 

 రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చండూరులో పెద్ద ఎత్తున సభ జరిగింది.

 ఆ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డినుద్దేశించి ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్‌ ఆగట్టునుంటావా? ఈ గట్టునుంటావా? అంటూనే ఓ వ్యాఖ్య చేశాడు. అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వెంకటరెడ్డి ఆ ఒక్క మాటను అడ్డం పెట్టుకొని పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ గా వుంటూ కూడా ప్రచారం చేయలేదు. చేయనని కూడా తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తమ్ముడు రాజగోపాల్‌ గెలుపు ప్రచారం మొదలుపెట్టారు. గ్రామ స్ధాయి నాయకులకు, అనుచరులకు ఫోన్లు చేశారు. ఇదిలా వుంటే బిజేపి కూడా మునుగోడు ఉప ఎన్నిక మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నది. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరమైన విజయాలు కాకపోయినా, వాటిని ఖాతాలో వేసుకొని దూకుడు కనిపించేలా ప్రచారం సాగించింది. ఒక దశలో తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టించేందుకు కూడా ప్రయత్నం జరిగిందనేది తెలుస్తోంది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికకు మరింత హీట్‌ పెంచింది. హోరా హోరీగా మార్చింది. 

    మునుగోడు ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

 రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కొంత కాలానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సభ నిర్వహించారు. ఎన్నికల నాటికి మళ్లీ వస్తానని చెప్పి అక్టోబర్‌ 30న మరోసారి సభ నిర్వహించారు. తెలంగాణలోని 80 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీ మోహరించింది. ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు మొత్తం టిఆర్‌ఎస్‌ శ్రేణులన్నీ మునుగోడు ప్రచారం సాగించాయి. అదే విధంగా బిజేపి కూడా కేంద్రమంత్రులు, సీనియర్‌ నాయకులు, ఇతర జిల్లాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున మునుగోడులో ప్రచారం సాగించాయి. పెద్దఎత్తున వలసలు ప్రోత్సహంచారు. ఎవరు ఏ పార్టీలో వున్నారో, ఎటు వైపు వెళ్తున్నారో కూడా తెలియని గందరగోళం సృష్టించారు.  

  ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఆఖరు నిమిషం దాకా టిక్కెట్టు కన్‌ఫర్మ్‌ చేయలేదు.

 ఆమె కూడా గట్టిపోటీ ఇస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇలా మూడు నెలలుగా రకరకాల రాజకీయ విన్యాసాలతో ప్రచారం సాగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన ఏకైక అంశం అభివృద్ధి. అందులో ప్రధానంగా ఫ్లోరైడ్‌ సమస్య. ఫ్లోరైడ్‌ సమస్య తీర్చి, మునుగోడు కష్టంతీర్చడంతో టిఆర్‌ఎస్‌ పాత్రను ఎవరూ కాదనలేనిది. దశాబ్ధాలుగా జరగని పనిని తెలంగాణ వచ్చిన వెంటనే జరిగింది. మునుగోడులో ఫ్లోరైడ్‌ నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ఈ విషయాన్ని బిజేపి సైతం ఓన్‌ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది కాని సక్సెస్‌ అయినట్లు కనిపించలేదు. కాంగ్రెస్‌ మాత్రం ఆ విషయం ప్రస్తావించకుండా సైలెంటుగా ప్రచారం చేసుకుంటూ వెళ్లింది. 

 ఇక ప్రచార పర్వం పూర్తయ్యింది. ఇక ప్రలోభ పర్వం మొదలౌతుందంటున్నారు. 

ఏ ఎన్నికల్లో అయినా ఇది కామన్‌గా మారింది. ప్రచార సమయం ముగిసిన రోజు నుంచి పోలింగ్‌ రోజు వరకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నియోజకవర్గంలో రకరకాల తాయిలాలు గుట్టు చప్పుడు కాకుండా అందిస్తుంటారు. రాత్రికి రాత్రి పంపకాలు జరుగుతుంటాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో దసరా పండుగ రోజు రాజీకీయ పార్టీలు జరిపిన పంపకాలు కూడా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఇక దీపావళి పండుగను కూడా రాజకీయ పార్టీలు వదలలేదు. ఆ రోజు కూడా ప్రజలను మచ్చిక చేసుకునే ఎత్తుగడలు వేవారు. ఆ మధ్య జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో తమకు అందాల్సినవి అందలేదని ప్రజలు ధర్నా చేసిన సందర్భం కూడా చూశాం. అంటే ప్రజలను ఆ విధంగా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. ఓటర్‌ను అవినీతి పరుడిగా చిత్రీకరించే దుష్ట ప్రయత్నాలు కొన్నేళ్లుగా సాగుతూనే వున్నాయి. మునుగోడులోనూ అదే నడస్తోందన్న ప్రచారం ఊపందుకొన్నది. ప్రలోభాలు లేకుంటే ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఏ పార్టీకి లేదు. ఏది ఏమైనా ఓ వైపు ఎన్నిక టెన్షన్‌తోపాటు, లెక్కలు కూడా వేసుకోవడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. ఓటరు మహాశయుడు ఎవరిని కరునిస్తారో అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.

దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్‌రావు.

`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు.

`చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు. 

`పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి.

`రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు.

`మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు. 

`వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది. 

`40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి. 

`1200 మంది రైతులకు రైతు భీమా అందింది.

`టిఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే…బిజేపి కేంద్రం ధరలు పెంచుతోంది. 

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బిజేపి నాయకులు తీరు దివాళాకోరు తనాన్ని చూపిస్తుందని, చిల్లర చేష్టలతో దిక్కుమాలిన రాజకీయం

చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిజేపి నేతల తీరును తూర్పార పట్టారు. మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సభ సక్సెస్‌ కావడంలో బిజేపి నేతలకు మతి పోయినట్లైంది.

ప్రజలు చండూరు సభకు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం బిజేపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి సభకు అంత పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో తమ ఉనికే ప్రమాదంలో పడిరదని బిజేపి గాయిగత్తర చేస్తోందన్నారు. చండూరు సభతో టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందన్నది బిజేపి నేతలకు పూర్తిగా స్పష్టమైంది. తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిరూపమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తాము అండా దండా అని ప్రజలు మరోసారి నిరూపించారని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అని హరీష్‌రావు అన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో బిజేపి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి కంటిమీద కునుకు లేకుండాపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బిజేపి వాళ్ల మాటలను గురించి దేశంలో ఎక్కడ అడిగినా వాళ్ల వెకిలి, మకిలి మాటలే కాదు, సర్వం అబద్దాల మయమని ఎద్దేవా చేశారు. వారి బతుక్కి ఒక్క నిజం కూడా చెప్పరని అన్నారు. అబద్దాలు ఆడడమే బిజేపి పార్టీ డిఎన్‌ఏ అని మంత్రి విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్న కేంద్ర మంతులు పచ్చి అబద్దాలు ఆడడానికి కూడా వెనుకాడడం లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 

 సీఎం సభ తర్వాత బిజేపి నేతలకు దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాక, వింత వింత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. 

డిల్లీ నుంచి వచ్చిన బిజేపి నాయకులు గల్లీ నాయకులకు తీసిపోని విధంగా మాట్లాడడం విడ్డూరమన్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర నాయకులను ఆ పార్టీ నేతలే విశ్వసించడం లేదన్నది తేలిపోయిందని, దాంతో వారి స్ధాయి ఏమిటో అర్ధమైందన్నారు. ప్రజాస్వామ్యంలో బిజేపి నేతల తీరు చాలా బాధాకరమన్నారు. వ్యవసాయానికి మీటర్ల మీదగాని, జిఎస్టీల మీద గాని నిజాలు మాట్లాడే శక్తి బిజేపి నేతలకు వుందా?అన్నారు. ఎనమిదేళ్లలో తెలంగాణలోఎంత అభివృద్ధి జరిగిందో బిజేపి నేతలు కళ్లుండి కూడా చూడలేకపోతే వారిపై జాలి పడడం తప్ప చేసేదేమీ లేదన్నారు. మునుగోడులో తిరుగుతూ మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక పోతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ గోస తీర్చిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. శుద్ధిచేసిన కృష్ణానది నీళ్లు ఇంటింటికీ చేరుతున్నారు. మంచినీళ్ల కోసం బిందె భుజం మీద పెట్టుకొని నాలుగేళ్లయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే మా కష్టం తీరిందని ఓ చెల్లె చెప్పిందని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. ఎల్బీనగర్‌ నుంచి నీళ్ల క్యాన్‌లు వస్తే మంచినీటి చుక్క దొరకని పరిస్దితి ఒకనాడు మునుగోడుది. అలాంటి మునుగోడులో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందుతుండడం నిజం కాదా? ఆయన ప్రశ్నించారు. అయినా అబద్దాలు ఆడే బిజేపి నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టాల్సిందేనన్నారు. 

 ప్రతి ఇంటికీ తాగునీరు, రైతు బందు, సాగుకు ఉచిత విద్యుత్‌,రైతు భీమా, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్‌,వంటి పధకాలు కూడా మునుగోడులో అందిన సంగతి బిజేపి నేతలకు కనిపించడం లేదా?

 డిల్లీలో, హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడడం కాదు…మునుగోడు వెళ్లి ప్రజలను అడిగితే చెబుతారు అని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చాక, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ప్రతి ఇంటికి మునుగోడులో ఏదో రకమైన సంక్షేమ పధకం అందింది. కాని బిజేపి వల్ల రూ.400 వున్న సిలిండర్‌ ధర రూ.1200 అయ్యింది. మేం సంక్షేమ పథకాలు పంచితే, బిజేపి ధరలుపెంచిండ్రని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ రైతు బంధు పొందిన నియోజకవర్గం మునుగోడు. మా ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపించినా, వాటిని గడ్డిపోచల్లా వదులుకొని ప్రజా స్వామ్యపరిరక్షణకు నిలబడ్డారని అదీ టిఆర్‌ఎస్‌కు వున్న నిబద్దత అని మంత్రి అన్నారు. 

 రాజ్యాంగ బద్దంగా నిబందనలకు అనుగుణంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారే గాని, బిజేపిలా ప్రభుత్వాలను కూలగొట్టలేదని హరీష్‌రావు అన్నారు.

 ఈడిలు, బోడీలు నిజాయితీకి ప్రతీరూపమైన టిఆర్‌ఎస్‌ నాయకులను ఏమీ చేయలేరన్నారు. అబద్దాన్ని పదే పదే వల్లిస్తూ నిజం చేయాలని బిజేపి చూస్తోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించారన్నారు. బిజేపి చెప్పే మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్న విషయం రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు తెలియాల్సిన అసవరం వుందని మంత్రి అన్నారు. రైతుల ఉరితాడుకు వేళాడే పరిస్ధితి బిజేపి తెవాలని చూస్తుంటే, రూ.35వేల కోట్లు కాదని రైతులే తమకు ముఖ్యమనుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని హరీష్‌రావు చెప్పారు. వ్యవసాయ మీటర్లు పెట్టమని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని వివరించారు. జిఎస్టీ మీద హరీష్‌రావు సంతకం చేశాడని పచ్చి అబద్దాలు చెప్పడం కిషన్‌రెడ్డి,సంజయ్‌లు మానుకోవాలని హితవు పలికారు. చిన్న పిల్లాడికి సైతం బిజేపి నేతలవి చిల్లర మాటలని తెలిసిపోతుందన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేసి, ఆఖరకు ఏం చేప్పారో తెలిసిందే…మాట మీద నిలబడే తత్వం బిజేపిలో లేదన్నది ఎప్పుడో నిరూపించారు. ఇంకా ఆ పార్టీని ప్రజలు నమ్మడం అన్నది కలలో కూడా జరగదన్నారు. చేనేతపై జిఎస్టీ అమలు చేయొద్దన్నదానిపై అప్పటి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ బిజేపిలోనే వున్నారని, నిజం తెలుసుకొని మాట్లాడాలని హరీష్‌రావు అన్నారు. జిఎస్టీ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన బిజేపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లు ఇచ్చినట్లు కిషన్‌ రెడ్డి చెప్పడం అంతకన్నా పచ్చి అబద్దం ఏమైనా వుంటుందా? అని మంత్రి నిలదీశారు.

బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు.

మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు.

మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు.

అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది.

మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి.

కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే….

సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌…

పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు.

నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు.

సిఎం సభతో మరింత ఫిక్స్‌ అయ్యారు…

బిజేపి గెలిస్తే రాజగోపాల్‌ రెడ్డి ఒక్కడే బాగుపడతాడు.

టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది.

ఇది ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా ఇదే మాట వింటున్నాము.

1972 లోనే ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి రూ.254 కోట్లు ప్రతిపాదించారు

 నాయకులకు చిత్తశుద్ధి లేక నిధులు వాడలేదు…ఫ్లోరైడ్‌ పోలేదు.

ప్రతి ఎన్నికలలో ఫ్లోరైడ్‌ సమస్య తీరుస్తామని చెప్పడం, ఓట్లేయించుకోవడం కాంగ్రెస్‌ కు అలవాటు.

ఫ్లోరైడ్‌ లేకుండా చేసి టిఆర్‌ఎస్‌ ఓట్లడుగుతోంది. ఇది మా అంకిత భావం.

మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు బిజేపి, కాంగ్రెస్‌ కు లేదు.

జనాలు ఆ పార్టీలను అసహ్యించుకుంటున్నారు…

టిఆర్‌ఎస్‌ కే మా ఓటని ప్రజలే చెబుతున్నారు.           

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడు నియోజకవర్గంలో బిజేపియే లేదు. గ్రామీణ స్ధాయిలో ఆ పార్టీకి తెలంగాణలో చోటే లేదు. ఓటు బ్యాంకు అన్నది అసలే లేదు. కాని హైప్‌ క్రియేట్‌ చేసి, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి, ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బిజేపికి ఓట్లు వేయాల్సిన వాళ్లే మునుగోడులో లేరు. ఆ పార్టీకి సానుభూతి పరులు కూడా లేరు. గ్రామీణ జీవన వ్యవస్ధను చిద్రం చేస్తున్న బిజేపిని నమ్ముడం అంటూ జరిగే ప్రసక్తి లేదు. వ్యవసాయానికి కరంటు మోటార్ల దగ్గర నుంచి మొదలు పెడితే…ఎరువుల ధరలు పెంచి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి, గిట్టుబాటు ధరలు ప్రకటించడం మానేసి, మార్కెటింగ్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిన పార్టీయే బిజేపి కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రైతులు పండిరచిన బియ్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాదు, తెలంగాణ రైతులను నూకలు తినమని చెప్పిన అహాంకార పార్టీ బిజేపి. పైగా ప్రజలకు సంక్షేమ పధకాలు ఇవ్వడం వారిని సోమరిపోతులను చేయడం అన్న భావన వచ్చేలా, అభివృద్ధి కుంటుపడుతుందన్న సాకును చెబుతున్న బిజేపికి ఓట్లు పడతాయా? బిజేపి చేస్తున్న మోసాలను ప్రజలు ఇక సాగన్విరు. అది మునుగోడు నుంచే మొదలౌతుంది. బిజేపి పతనానికి మునుగోడే నాంది…వారి అబద్దాలకు ఇక్కడే పుల్‌స్టాప్‌ పడుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అంటున్నారు. ఆయన మాటాల్లోనే మునుగోడులో ప్రచారంపై కట్టాతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. 

బిజేపి ఎన్నెన్ని మోసాలు చేస్తుందో…ఎన్నెన్ని అబద్దాలు చెబతుందో ప్రజలు చూస్తున్నారు. 

నిత్యాసర వస్తువులు పెరిగినా వాటిని కంట్రోల్‌ చేయడంలేదు. అంటే బిజేపి ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారాలను ఐచ్చికంగానే వేస్తోందన్నది తేటతెల్లమౌతోంది. ఇక రూపాయి విలువ తగ్గడం కాదు, డాలర్‌ విలువ పెరుగుతుందని దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం అంటేనే పరిపాలన పట్లు వారికి వున్న చిత్తశుద్ది ఏమిటో తేలిపోయింది. పెట్రోల్‌ ధరలు నిత్యంపెరిగేలా వ్యవస్ధను ప్రోత్సహించి, ప్రజల నెత్తిన బారం మోపి, ప్రెట్రోలియం కంపనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఏకైక ప్రభుత్వం బిజేపినే… ఎవరైనా ప్రజలకవసరమైన వస్తువులు సరసరమైన ధరలకు, అందుబాటులో వుండాలని చూడాలి గాని, ప్రజల కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేసేలా వుండకూడదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో అంతిమంతా వాటి ప్రభావం సామాన్యుడు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల మీద పడుతున్నాయి. ప్రజల నడ్డివిరిస్తున్నాయి. దీనికి తోడు జిఎస్టీ బండ తెచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. గ్యాస్‌ బండ ధర విపరీతంగా పెంచుకుతున్నారు. అంటే ప్రజలు పెట్రోల్‌ ధరల మూలంగా పని చేసుకోలేక, పెరుగుతున్న ధరల మూలంగా కొనుగోలు శక్తి లేక, పెరిగిన గ్యాస్‌ ధరలకు కొనుక్కొలేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక, ఆఖరుకు వంట చేసుకొని నాలుగు మెతుకులు తినలేని స్ధితికి ప్రభుత్వమే నేట్టేడయం బాధాకరం. పైగా ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రే చెప్పడం అంటే ప్రజల జీవన స్ధితి మీద వారికి ఎంత అవగాహన వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి చేస్తున్న మోసాలు రాస్తే రామాయణమంతా, వినిపిస్తే బారతమంతా అవుతాయి. 

  వీటి ప్రభావం మునుగోడు మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డిని, బిజేపి పార్టీని ప్రజల అసహ్యించుకుంటున్నారు. తన స్వార్ధం కోసం, తన కంపనీకి రూ.18 వేల కాంట్రాక్టుకోసం నియోజకవర్గాన్ని ముంచిన నాయకులు చరిత్రలో ఎక్కడా కనిపించరు. ఒక్క రాజగోపాల్‌రెడ్డి తప్ప…అలాంటి వ్యక్తిని నమ్మి గతంలో ఓట్లేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల ప్రయోజనాలు, నియోకవర్గ ప్రగతిని విస్మరించి, గెలిపించిన ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలు ఎప్పుడూ అసహ్యించుకుంటూనే వుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి, వ్యాపారాలలో లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. అందుకే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డికి ఘోర ప్రభావం తప్పదు. మరోసారి మునుగోడు గురించి ప్రస్తావించే అర్హత కూడా కోల్పోయాడు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే రైతులను మోసం చేస్తుందో ఆపార్టీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి సంకేతాలిస్తున్నట్లో గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పడానికి ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి రాలేని పరిస్ధితి రాజగోపాల్‌రెడ్డిది. ఏ ఊరికెళ్లినా తరుముతున్నారు. మరో నాలుగు రోజులైతే మునుగోడులో ఒక్క బిజేపి కార్యకర్త కూడా కనిపించడు. మునుగోడులో ప్రచారానికి అద్దెకొచ్చిన వాళ్లు, మళ్లీ మునుగోడు ముఖం కూడా చూడరు. రాజగోపాల్‌రెడ్డి అసలే చూడడు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే నాయకులకు రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది. 

 నిజంగా ఉమ్మడి నల్లగొండను ఏలిన కాంగ్రెస్‌ నేతలకు ఏనాడు చిత్తశుద్ది లేదు. ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోవద్దన్నట్లే యాభైఏళ్లపాటు వ్యవహరించారు.

 ఆఖరుకు దివంగత పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నాడు. కాని నల్లగొండ జిల్లానేతలే ఆయనకు సహకరించలేదు. ఫ్లోరైడ్‌ను రూపు మాపేందుకు ఆయనకు తోడు నిలవలేదు. ఉమ్మడి రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని అనుకున్న పి.విని దించేశారు. ఫ్లోరైడ్‌నిధులు మురిపోయేలా చేశారు. ఆనాడు రాజకీయాల కోసం పి.వి. దించడానికి సహకరించిన నల్లగొండ కాంగ్రెస్‌ నాయకులు, ఫ్లోరైడ్‌ సమస్యను మాత్రం గాలికి వదిలేశారు. నాడు కేటాయించిన రూ.254 కోట్లు అక్కరకు రాకుండా చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యను సజీవం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతామని చెప్పడం, గెలవగానే ఫ్లోరైడ్‌ సమస్య మర్చిపోవడం. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ చేసింది ఇదే..అందులో కోమటి రెడ్డి బ్రదర్స్‌ కూడా భాగాస్వాములే… గత ముపై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యను పట్టించుకోలేదు. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలేదు. కాని ఆయన వ్యక్తిగత సంపాదన కోసం మాత్రం పులిచింతల ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఫ్లోరైడ్‌ సమస్య తీర్చలేదు. 

  ఫ్లోరైడ్‌ సమస్య తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఊరూరుకిచెప్పాడు.

 ఇప్పుడు ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీళ్లు అందిస్తున్నాడు. దటీజ్‌ కేసిఆర్‌… తెలంగాణ రాగానే మునుగోడులో ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతానని చెప్పాడు. అన్నట్లుగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, మునుగోడులో ఫ్లోరైడ్‌ లేకుండా చేశాడు. మిషన్‌ భగీరధ పైలాన్‌ ఇక్కడే ఏర్పాటు చేసి, తొలి స్వచ్ఛమైన మిషన్‌ భగీరధ నీటిని మునుగోడుకే ఇచ్చిండు. ఇదీ నాయకులకు వుండాల్ని కమిట్‌ మెంటు. ప్రజలకు మాటిచ్చామంటే నెరవేర్చాలి. అందులో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఫ్లోరైడ్‌ మహామ్మారి అంతం చూడాలంటే ముందు అలాంటి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక చొరవతో ముందుగా మునుగోడును శతాబ్ధాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చాడు. అందువల్ల మునుగోడులో ఓట్లడిగే హక్కు ఒక్క టిఆర్‌ఎస్‌కే వుంది. బిజేపికి, కాంగ్రెస్‌లకు ఓట్లడిగే నైతికతే లేదు. మునుగోడు ప్రజల జీవన సంజీవని మంచినీళ్లు..ఆ గొంతును తడిపిన అమృతమటువంటి సురక్షిత మంచినీరిచ్చిన టిఆర్‌ఎస్‌కే మా ఓటని ప్రజలే నినదిస్తున్నారు. కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డిని దీవిస్తున్నారు.

అన్నా, తమ్ముడి మధ్య తేడా’0’ నే!?

`కూడిన సున్నాతో వేలకోట్లకు పెరిగిన సంపాదన?

`కట్టాతో మునుగోడు నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.

`కుటుంబంలో రేపటి తరం కోసం, మునుగోడుకు చేసిన మోసం!

`ఆనాడు అన్నకు పులిచింతల పేరు మీద 18వందల కోట్లు?

`ఈనాడు తమ్ముడికి కేంద్రం నుంచి 18వేల కోట్లు?

`కాంట్రాక్టులలో కూడా ఫ్యాన్సీ నెంబర్లు…

`పులిచింతల కడితే అందులో దూకేస్తా అన్నాడు అన్న.

`రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్టు తీసుకొని కట్టిందే వెంకన్న.

`ఆనాడు నల్గొండ రాజకీయాలు అడ్డం పెట్టుకొని… అన్న కోట్లు కూడబెట్టుకున్నాడు.

`తమ్ముడు మునుగోడును ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి 18 వేల కోట్లకు టెండర్‌ పెట్టాడు….

`ఇద్దరూ కలిసి తెలంగాణ కు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేశారు.

`పులిచింతలతో తెలంగాణ గ్రామాలు ముంచారు.

`పోతిరెడ్డిపాడు తో తెలంగాణకే అన్యాయం తలపెట్టారు.

`ఇప్పుడేమో నీతులు, త్యాగాలను వల్లిస్తున్నారు.

`కుడి చేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకుండా చేయాలంటారు….

`చేసిన సాయాలు చెప్పుకొని అన్నదమ్ములు ఓట్లడుకుంటున్నారు.

`ఆ ఓట్లే లేకపోతే జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.

`సాయం పేరుతో మెతుకులు విదిల్చి, రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొన్నారు.

`పూటకో మాట, గడియకో వేషం కడుతున్నారు…

`అబద్దాల రాజకీయంలో ఓనమాలు నేర్చి, మోసపు రాజకీయాలలో పిహెచ్‌డిలు చేశారు.

`దొందూ దొందే…మరో సారి మునుగోడును ముంచేందుకే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలంటే ప్రజా సేవ అన్న అర్థాన్ని మార్చేసి, వ్యాపారానికి కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టులు నిర్వహించుకున్నవారిలో కోమటిరెడ్డి సోదరులు ముందువరసులో వున్నారు. గతంలో కాంట్రాక్టర్లకు రాజకీయాలకు సంబంధాలుండేవి కాదు. కాని రాజకీయ నాయకులే కాంట్రాక్టు అవతారాలెత్తిన వారిలో కోమటి రెడ్డి సోదరులు ప్రజలను మోసం చేయడానికి కూడా వెనుకాడడం లేదని మరోసారి నిరూపించారు. గతంలో అన్న పులిచింతల పేరు చెప్పి రాజకీయం చేశాడు. ఓట్లు దండుకున్నాడు. ప్రజలను మోసం చేశాడు. వారి నెత్తిన శఠగోపం పెట్టాడు. ఇప్పుడు తమ్ముడు అదే దారిలో నడుస్తున్నాడు. మాది చిన్న కంపనీ అని ఒకనాడు చెప్పాడు. ఇప్పుడేమో! మా రేంజ్‌కు కార్లలో కూడా కాదు, హెలీకాప్టర్లలో తిరగాలంటున్నాడు. పూటకో మాట…గడికో వేషం అన్నట్లు ప్రజలు బురిడీ కొట్టించి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టుల పేరుతో అడ్డదిడ్డంగా సంపాదించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లు కొని మళ్లీ గెలువొచ్చని చూస్తున్నారు. అన్నా దమ్ములు కుయుక్తులు మునుగోడు ప్రజలకు ఏనాడో తెలిసిపోయింది. రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు తల కిందికి పెట్టి తపస్సు చేసినా, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కొవాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఓట్లే పడే పరిస్థితి అసలే లేదు. వారికి ఈసారి మునుగోడులో ఓటమి తప్పదు. ప్రజల చేతిలో గుణపాటం తప్పదు అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి మునుగోడు నుంచి కట్టాతో…!ఒకనాడు మాది చిన్న వ్యాపారం అన్న నోటితోనే, కార్లలో కాదు, హెలీకాప్టర్లతో తిరిగేంత రేంజ్‌ అంటున్నారు.

అంటే ఆ సంపాదన పెరగడానికి కారణం రాజకీయాలు. నల్లగొండ ప్రజలు. భువనగిరి నియోజక వర్గ ప్రజలు, మునుగోడు ఆశీస్సులు. రాజకీయాలు చేసేవారు వ్యాపారాలు చేయొద్దని కాదు..కాకపోతే ప్రజలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు సంపాదించడం ప్రజలను మోసం చేయడమే. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు, ప్రజా సేవ మర్చిపోయి, వ్యాపారాలను పెంచుకుంటూ పోయి, ఎన్ను కున్న ప్రజలను మర్చిపోయి, సాయం పేరుతో పది మెతుకులు విదిల్చి, మేం సాయం చేస్తున్నాం…ప్రజలను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్పు. సాయం చేయడం అన్నది రాజకీయం కోసమే అని నిరూపించుకుంటున్నారు. కుడిచేత్తే చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా చేయాలంటారు. కాని కోమటి రెడ్డి సోదరుల ప్రచార పర్వంలో సాయమే ప్రధాన నినాదం చేసుకుంటారు. ప్రజలు ఒక రకంగా బ్లాక్‌ మొయిల్‌ చేస్తుంటారు. మేం మీకు సాయం చేయలేదా? అని ఓటర్లను భయపెడుతుంటారు. ఇవేనా రాజకీయాల్లో నైతికత. ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల నిర్మాణం అన్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు వ్యతిరేకించారు. పులిచింతల నిర్మాణం వల్ల తెలంగాణలోని గ్రామాలు మునిగిపోయాయి. ఒకనాడు పులిచింతల నిర్మాణం చేపడితే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవి నిజమని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మారు. కాని ఆ ప్రకటన వెనుక ఎంతో మోసం దాగి వుందని గ్రహించలేకపోయారు. ఏ నోటితో అయితే వెంకటరెడ్డి పులిచింతల అడ్డుకుంటానన్నాడో, అదే చేతితో పులిచింతల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. కాంట్రాక్టు దక్కించుకొన్నాడు. ఏడు వందల కోట్లతో పూర్తి చేయాల్సిన పులిచింతలను రూ.18 వందల కోట్లదాకా తీసుకెళ్లి లాభాల పంట పండిరచుకున్నాడు.

రాజకీయాన్ని వ్యాపారాన్ని ముడిపెట్టి సంపాదనలో కింగ్‌గా మారి, అదే బ్రాండ్‌ అని ప్రచారం చేసుకున్నాడు. ఓ వైపు పులిచింతలతో తెలంగాణ గ్రామాలకు అన్యాయం చేసి, ప్రతిగా కాంట్రాక్టు సంపాదించి, కృతజ్ఞతగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డికి తోడుగా నిలిచి, పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేయడానికి కోమటిరెడ్డి సోదరులు కారణమయ్యారు. పులిచింతలతో నల్లగొండకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడుతో మొత్తం తెలంగాణకే అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అందాల్సిన నీటిని రాయలసీమకు, ఆఖరుకు మద్రాసుకు తరలించేందుకు సహకరించారు. తెలంగాణలోనే కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చే మనసు రాలేదు గాని, ఎక్కడో వున్న మద్రాసుకు మరిన్ని నీళ్లు తరలించేందకు కోమటిరెడ్డి సోదరులు దోహదపడ్డారు. తెలంగాణను ఎండబెట్టారు. వ్యాపారం ముసుగులో మేమూ తెలంగాణ వాదులమే అని ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేశారు. మంత్రిపదవిని అడ్డం పెట్టుకొని పులిచింతల, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు చేసి, తెలంగాణ కోసం రాజీనామా చేశానని ప్రజలను నమ్మించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే వున్నారు. ఎన్నికల్లో గెలుస్తూ, కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. అవకాశాలిచ్చిన పార్టీలకు సున్నం పెట్టి, స్వార్ధం చూసుకుంటున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదిస్తున్నారు. అన్న దోరణి అలా వుంటే, తమ్ముడు తక్కువేం కాదని నిరూపిస్తున్నాడు. అన్న 18 వందల కోట్లతో పులిచింతల నిర్మాణం చేస్తే,తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు సొంతం చేసుకొని తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. ప్రజలు మోసం చేయడంలో పోటీ పడుతున్నారు. ఒకనాడు అన్న, ఇప్పుడు తమ్ముడు కుటంబంలోని రేపటి తరం కోసం ఆస్ధులు కూడబెట్టుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు.

ప్రజలకు సేవ చేయడం గాలికొదిలేశారు. ఇలా ప్రజలు ప్రతీసారి మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేస్తూ వస్తున్నారు. అదే వరుసలో మరోసారి మునగోడు ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి, మూడేళ్లుగా బిజేపి పాట పాడి, ఆఖరుకు రూ.18వేల కోట్ల ప్రాజెక్టు కొట్టేసి, మునుగోడు ప్రజలకు పంగనామాలు పెట్టేశారు… అభివృద్ధి విస్మరించారు. ఇప్పుడు కొత్త సుద్దులు వల్లిస్తున్నారు…మళ్లీ ఓట్లేస్తే కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అన్న ఆస్ట్రేలియా నుంచి ప్రచారం చేస్తుంటే…తమ్ముడు నోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. మునుగోడుతో తెలంగాణ అస్ధిత్వాన్ని కూడా ఆగం చేసేందుకు తెరలేపుతున్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్లోలం రేపుందుకు కారణమౌతున్నారు. మునుగోడు ప్రాంతానికి ఇన్నేళ్ల రాజకీయంలో కోమటిరెడ్డి సోదరులు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు…కాని ఇప్పుడేదో ఉద్దరిస్తామని చెప్పుకుంటున్నారు. ప్రజలకు కోమటిరెడ్డి సోదరుల అసలు స్వరూపం తెలిసిపోయింది. వారి నిజస్వరూపాలు బైటపడిపోయాయి. రాజగోపాల్‌రెడ్డిని మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా లేదు…ఓట్లేసేందుకు ససేమిరా? అంటున్నారు..గ్రామాల్లోకే రానివ్వడంలేదు. ఈసారి రాజగోపాల్‌ రెడ్డిని ఓడిరచి తగిన బుద్ది చెబుదామని మునుగోడు ప్రజలు చూస్తున్నారు. మరోసారి ప్రజలను మోసం చేయకుండా రాజగోపాల్‌ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇక్కడే పుల్‌స్టాప్‌పడేలా చేసుందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈసారి రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మమని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌కు ఓసారి అవకాశమిస్తే మునుగోడు అభివృద్ధి కాకుండా పోయింది. ఇప్పుడు మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్దంగా లేమని చెబుతున్నారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించి, అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. కోమటిరెడ్డిసోదరులకు చుక్కలు చూపించేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా వున్నారు.

టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌

`మెజారిటీ ఎంతనేదే లెక్కలేయాలి.

`మునుగోడులో కారు జోరు…ప్రతిపక్షాలు బేజారు

`కట్టాతో చౌటుప్పల్‌ నుంచి ఎమ్మెల్యే నరేందర్‌.

`ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో సర్థేసుకున్నాయి..

`ప్రతిపక్షాలను ప్రచారానికి కూడా ప్రజలు రానివ్వడం లేదు.

`రాజగోపాల్‌ రెడ్డి నైతే తరిమికొడుతున్నారు.

`గ్రామాలలోకి రాజగోపాల్‌ రెడ్డిని రావొద్దనే అంటున్నారు.

`ఇక కాంగ్రెస్‌ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది.

`పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు.

`నాయకులంతా రాహుల్‌ గాంధీ భజనకు వెళ్లారు.

`మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది.

`టిఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది.

`ప్రజలు టిఆర్‌ఎస్‌ కు బ్రహ్మరథం పడుతున్నారు.

`రాజగోపాల్‌ ను నమ్మి మోసపోయామంటున్నారు.

`మునుగోడు జనమంతా టిఆర్‌ఎస్‌ వైపే…

`కేసీఆర్‌ నాయకత్వం కోసమే…

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసినందుకు మధనపడుతున్నామని కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఆఖరుకు మంచే జరుగుతోందని, ప్రజలకు సేవ చేయలేనని రాజగోపాల్‌రెడ్డి చేతులెత్తేయడమే మంచిదైదందని ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను కాదనుకున్నందుకు నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. అందుకే ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తామని మునుగోడు నియోజకవర్గ ప్రజలు డిసైడైపోయారు. ఇప్పుడు బిజేపి, కాంగ్రెస్‌లు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. అంటున్న వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో మునుగోడు ప్రచార సరళిని పరిశీలిస్తున్న కట్టా రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా నన్నపనేని మాటల్లోనే…

                              మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ విజయం ఆగేది కాదు. ఆపేంత శక్తి బిజేపి, కాంగ్రెస్‌లకు లేదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలు వారిని దగ్గరకు కూడ రానివ్వడం లేదు. ముఖ్యంగా రాజగోపాల్‌నైతే ప్రజలు ఆయా గ్రామాల్లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఆయన వస్తున్నారని తెలిసిన వెంటనే ఊరు శివారులోనే ఆయన ఆపేస్తున్నారు. నిలదీస్తున్నారు. తరుముతున్నారు. రూ.18వేల కోట్ట కాంట్రాక్టుకోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టావంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా సాగనంపుతున్నారు. ఇదే దశలో ఓ గ్రామంలో రాజగోపాల్‌ రెడ్డి ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేయడంతో వున్న ఏ కొద్దోగొప్పే సానుభూతి కూడా లేకుండా చేసుకున్నాడు. టిఆర్‌ఎస్‌ది వన్‌ సైడ్‌ గెలుపుగా మారేందుకు ప్రజలే రాజగోపాల్‌రెడ్డిని అడుగు కూడ పెట్టనీయడంలేదు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారంలో మెజార్టీ ఎంత వస్తుందన్నదానిపై లెక్కలేసుకుంటున్నామంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురించే చెబుతున్నారు. తెలంగాణ రాకముందు మునుగోడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలే విరిస్తుంటే ఎంతో సంతోషమనిస్తుంది. మునుగోడు ప్రజల్లో వున్న చైతన్యం అంతా ఇంతా కాదు. తాను ప్రచారం చేస్తున్న చౌటుప్పల్‌లో ప్రజలు ఎంతో విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా సరే… ఏ ఎన్నికల్లోనైనా సరే…ప్రచారానికి వెళ్లిన సందర్భాలలో సరే..సరే అంటుంటారు. కాని మునుగోడు నియోజకవర్గంలో ప్రజలే తమకు హమీ ఇస్తున్నారు. ప్రచారం చేసేవారు చెప్పాల్సిన మాటను, ప్రజలు మాకు చెప్పి మాట ఇస్తున్నారు. మీరు నిశ్చింతగా వుండడి. మేము టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని మాలోనే మరింత ఆత్మస్ధైర్యాన్ని నింపుతున్న మునుగోడు ఓటర్లపై మరింత గౌరవం పెరిగింది. తెలంగాణ రాక ముందు వారి గోసలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తాము ఎంత లబ్ధిపొందామో ఒక్కక్కటీ చెబుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు మంచనీళ్లు తాగాలన్నా భయపడే పరస్దితి. కాని ఇప్పుడు ఫ్లోరైడ్‌ అన్నది లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎంత మొత్తుకున్నా గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలే…ఇప్పుడు నిత్యం మంచినీళ్లు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు పిల్లనియ్యాలంటే ప్రజలు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు మునుగోడులోని అన్ని గ్రామాలు సురక్షితమైన మంచినీరు అందుతోంది. ఇదీ ప్రజలు చెబుతున్న మాట. 

                        ఇక తన స్వార్ధం కోసం మునుగోడులో రాజీనామా చేసి, ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌ మళ్లీ అబద్దాలు షురూ చేశాడు. అవి కనీసం నమ్మశక్యంగానైనా వుండాలి. నిజానికి పార్లమెంటు నియోజకర్గ ఉప ఎన్నికైతే జాతీయ స్దాయిలో అధికారంలో వున్న పార్టీ అభ్యర్ధి అయితే ఏవైన వాగ్ధానాలు చేస్తే కొంత వరకు నమ్మొచ్చు. అంతే కాని అసెంబ్లీ నియోజకరవర్గానికి పోటీ చేస్తూ, కేంద్రం నుంచి నిధులు తెస్తానంటే సాధ్యమయ్యే పనేనా? ప్రజలు ఆ మాత్రం ఆలోచించుకోలేరా? ప్రజలను ప్రతీసారి మోసం చేయలేరు. ఇక్కడ ఓ విచిత్రమైన విషయం చెబుతాను. చౌటుప్పల్‌లో పది పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి తెప్పిస్తానని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల మ్యానిఫెస్టో విడుదల చేశాడు. ఎక్కడైనా పది పడకల ఆసుపత్రి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అందులోనూ పది పడకల ఆసుపత్రికి ఈఎస్‌ఐ ఆసుపత్రి సౌకార్యలు ఇవ్వడం సాధ్యమౌతుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఆసుపత్రులు కనీసం ముప్పై పడకలు వుంటాయి. ఇక కేంద్రం ప్రకటించే ఆసుత్రులు ఎయిమ్స్‌ స్ధాయిలో వుండాలి. రాజగోపాల్‌రెడ్డి అన్న అయిన వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా వున్నాడు. ఆయన బీబీ నగర్‌ నిమ్స్‌కు ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని నిధులు తెచ్చాడు. నిమ్స్‌లో వైద్య సేవలు మొదలయ్యేలా ఎంత కృషి చేయలేదు. ఈ విషయం చెప్పే దమ్ము రాజగోపాల్‌కు వుందా? ఆలు లేదు..చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మునుగోడులో మళ్లీ గెలిచినట్లు, కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్లు రాజగోపాల్‌ ఇప్పుడే పగటి కలలు కంటున్నాడు. అవన్నీ అబద్దాలని ప్రజలకు తెలుసు. రాజగోపాల్‌రెడ్డి వల్ల ఏదీ కాదని కూడ తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌కు చుక్కెదురౌతుంది. ప్రచారమే చేసుకునే వీలు లేకుండాపోతున్నది. 

                  ఇక ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాల్లో అనైతిక రాజకీయాలకు బిజేపి పార్టీ పాల్పడుతుందో కనిపిస్తోంది. ప్రజలు బిజేపిని చీ కొడుతున్నారు. అబద్దాల పునాదుల మీద పార్టీని ఎల్ల కాలం బిజేపి నడలేదు. ఎమ్మెల్యేలకు వల వ్యవహారంలో తొలి రోజు బిజేపి నాయకులు చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమి? సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆ రోజు అసలు ఆ ఫోటోల్లో వున్నవారు ఎవరో తెలియదన్నాడు. ఈరోజేమో! అందులో తప్పేముంది? అంటున్నాడు. ఇంత కన్నా నీచాతి నీచమైన రాజకీయాలు ఎవరైనా చేస్తారా? ఇంత దిగజారుడు తనం అవసరమా? రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ప్రజల మద్దతుండాలి. వారి ఆశీర్వాదం కావాలి. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అంతే కాని ప్రజల్లో మద్దతు లేకున్నా, వారి ఆశీర్వాదం లేకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం దుర్మార్గం. మహారాష్ట్ర, గోవా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా చేద్దామనుకున్నారు. కాని ఇక్కడు వున్నది తెలంగాణ సాధకుడు. సుధీర్ఘమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ కారుడు. రాజకీయ చాణక్యుడు. కేసిఆర్‌ వున్నాడు. ఆయను సూటిగా చూడడమే ఎవరి వల్లా కాదు. ఆయన రాజకీయ చతురత ముందు ఎవరూ నిలబడలేరు.

                  దేశంలో ఏ రాష్ట్రంలో లేని , అమలు కానటువంటి సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి తెలంగాణ మేమూ భాగస్వాములం కావలంటే మా ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపమని పొరుగు రాష్ట్రాల ప్రాంతాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాంటి తెలంగాణలో అస్ధిర రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే బిజేపిని చీరి చింతకు కట్టేస్తారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకుండా, తెలంగాణకు గతంలో కేటాయించిన ప్రాజెక్టులు తరలించుకుపోయారు. తాజాగా విమానాల తయారీ ప్రాజెక్టును కూడా గుజరాత్‌కే కేటాయించుకున్నారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేస్తున్న బిజేపికి తెలంగాణలో చోటు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు కూడా పడదు. మునుగోడులో బిజేపి గోడు ఎవరూ పట్టించుకోరు సరి కదా…ఓటంటూ ఎవరైనా వస్తే ప్రజలు గోడకేసి కొడుతున్నారు. టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రజలే ఖాయం చేస్తున్నారు.

మునుగోడులో టిఆర్‌ఎస్‌ విజయం ప్రభంజనమే.

`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్‌ కు మునుగోడు ప్రజల బహుమతే…

`కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి

`ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది.

`ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్‌ కే ఓటు వేస్తామని చెబుతున్నారు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు.

`ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది. 

`మిషన్‌ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి.

`ఫ్లోరైడ్‌ రక్కసి పీడ వదిలిపోయింది. 

`పెన్షన్‌ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే!

`రైతుబంధు రైతన్నకు వెన్నుదన్ను.

`కళ్యాణ లక్ష్మీతో పేదింట పెళ్ళికి ఎంతో భరోసా.

`బిజేపి మునుగోడులో అంతంత మాత్రమే….

`కాంగ్రెస్‌ ఎప్పటిలాగే కష్టమే…

`తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ కు తిరుగులేదు…

`కేసిఆర్‌ నాయకత్వానికి ఎదురులేదు.                        

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. ఎదురు లేదు. ప్రతిపక్షాలకు అసలు తెలంగాణలో తావు లేదు. ప్రజలు వారిని నమ్మే పరిస్ధితి అసలే లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. దేశం మొత్తం మీద కేసిఆర్‌ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేదు. తెలంగాణ అమలౌతున్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న పధకాలలో కనీసం పదో వంతు సంక్షేమ పథకాలు కూడా మరే రాష్ట్రంలోనూ లేవు. అమలు కావడం లేదు. అలాంటిది మునుగోడు ఉప ఎన్నికపై తర్జన భర్జన ఎందుకు? మునుగోడు మాదే…గెలిచేది మేమే…ప్రతిపక్షాలకు మునుగోడులో స్ధానమే లేదు. బిజేపికి క్షేత్రస్ధాయి బలం లేదు. బలగం లేదు. యంత్రాగం లేదు. కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రజల్లో నమ్మకం లేదు. ఆయనపై విశ్వాసంలేదు. ఆయన పార్టీ ఎందుకు మారిండో మునుగోడు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. ఇక ఆయన కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంత కోపంతో వున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య నాంపల్లి అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్ధులంతా తరిమేసినంత పనిచేశారు. ఆయనను కనీసం పది నిమిషాలు కూడా అక్కడ వుండన్విలేదు. అలాంటిది తాను మళ్లీ గెలుస్తానన్న భీరాలు తప్పతే, గెలిచేది లేదు. ఆయనకు ఓట్లు పడేది లేదు. ఇక కాంగ్రెస్‌ పరిస్ధితి అంతకన్నా మెరుగైన పరిస్దితి కూడా ఏమీ లేదు. ఆ పార్టీకి నాయకత్వం లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఎలాంటి సీన్‌ లేదు. మొన్ననే రేవంత్‌రెడ్డి మునుగోడులోని ఓ తండాకు ప్రచారం పేరుతో వెళ్తే ఏం జరిగిందో తెలిసిందే. రేవంత్‌ రెడ్డి ముఖం పట్టుకొని ఓ మహిళ ఇక్కడి నుంచి వెళ్లిపో… అని గర్జించింది. ఆ కోపం చూసి అక్కడినుంచి రేవంత్‌ రెడ్డి జారుకోవడం తనవంతైంది. కాంగ్రెస్‌ నాయకుల ముందు ఆయన పరువు పోయినంత పనైంది. అదంతా మీడియాలో వచ్చిందే…జనమంతా చూసిందే… కాంగ్రెస్‌కు మింగుడుపడందే…ఆదిలోనే రేవంత్‌ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూసిందే…అయినా పార్టీ అంతా లుకలుకలే…అంతే కాదు ఆపార్టీకి చెందిన స్టార్‌ క్యాంపైనర్‌ తమ్ముడే బిజేపి తరుపున పోటీ చేస్తున్నాడు. అన్న వెంకటరెడ్డి తన తమ్ముడికి ఓట్లేయాలని కోరుతున్నారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇంకే ముంది కాంగ్రెస్‌కు మునుగోడులో ఏం మిగిలింది. రాజగోపాల్‌ రెడ్డి రూపంలో వున్నదే పోయింది. కొత్త గా కాంగ్రెస్‌కు వచ్చేదిలేదు. ఆ పార్టీకి ఓట్లు పడేది లేదు….అయినా మేం మెహర్భానీకి వెళ్తాం…తమను తాము మోసం చేసుకుంటామని అనుకుంటే చేసేదేముంది? జనం కూడా ఆ రెండు పార్టీలను చూసి జాలి పడుతున్నారే తప్ప, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. 

                      తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలమైన పార్టీ. త్వరలో జాతీయ స్ధాయిలో వెలుగొందేందుకు సిద్ధమౌతున్న పార్టీ. దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలన్నీ తమ రాష్ట్ర ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణతో సరిహద్దు కల్గిన ప్రాంతాలన్నీ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అంతే కాదు కర్నాకటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపాలని కోరినట్లు వార్తలు చూసిందే. ఎందుకుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం కూడా కర్నాటకలో లేదు. కేసిఆర్‌లా రాజనీతిజ్ఞత వున్న నాయకుడు లేదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేదు. పాలకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు లేదన్నది పొరుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాటే…

                             మునుగోడు విషయంలో అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా వున్నాయని చెబుతున్నాయి. అంతే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేయించే సర్వేల్లో కూడా టిఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్‌ సుమారు 41శాతంతో అన్ని పార్టీలంటే ముందుంజలో వుంది. అన్ని సర్వేల్లోనూ ఇదే తేలుతోంది. మునుగోడులో సుమారు 2లక్షల40వేల ఓట్లు వున్నట్లు సమాచారం. అందులో సంక్షేమ పధకాలు అందుకుంటున్న కుటుంబాలన్నీ టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తాయన్నది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే రైతుబంధు నుంచి మొదలు, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, కళ్లుగీత కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు అందుకునే వారు మెజార్టీ ప్రజలున్నారు. వారంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో వున్నారు. ఇక ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాలో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి మరింత పెరిగింది. గతంలో కరంటు లేక ఇన్వర్టర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు వాటి అవసరం లేకుండాపోయింది. నాణ్యమైన కరంటు అందుతోంది. ఇక రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. ఓ వైపు పెరిగిన భూగర్జ జలాలు, మరో వైపు నిరంతరంగా నాణ్యమైన కరంటు…పెట్టుబడి సాయం కింద రైతు బంధు…అన్ని రకాల సౌకర్యాలు గతంలో సమకూర్చాలన్న ఆలోచన చేసిన నాయకుడే లేడు. పాలకులు లేరు. మరి దేశంలోనే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇక పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదని, ప్రభుత్వం తరుపున కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్‌ పేరుతో లక్షనూటపదహారు రూపాయలు ఇస్తున్నారు. తాజాగా దళిత బంధు పేరుతో ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేసిఆర్‌. మరి అలాంటి టిఆర్‌ఎస్‌ను ప్రజలు కాదనుకుంటారా? బిజేపి, కాంగ్రెస్‌ లాంటి వారిని నమ్మి, మళ్లీ తమ జీవితాలను ఆగం చేసుకుంటారా? గతంలో డెబ్బై ఏళ్ల గోస పడరాని కష్టాలు పడ్డ ప్రజలు, మళ్లీ బిజేపి,కాంగ్రెస్‌లను నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారి మాయ మాటలు వినేందుకు ఇష్టపడడం లేదు. నిజంగా బిజేపికి ప్రజల మీద ప్రేముంటు, ప్రేద ప్రజలను ఆదుకోవాలనుకుంటే పెరుగుతన్న నిత్యావసర ధరలేమిటి? పెట్రోలు, డీసెల్‌ పెంపులేమిటి? గ్యాస్‌ ధర నియంత్రణ లేకుండా పెరుగుడేమిటి? ఇదేనా బిజేపికి ప్రజల మీద వున్న గౌరవం. ఓ వైపు జిఎస్టీ పేరుతో బాదుడు…మరో వైపు దేశం కోసం, ధర్మం కోసమంటూ సమాజాన్ని చీల్చుడు…మతం పేరుతో బిజేపి రాజకీయాలు ఎంతో కాలం సాగవు…

                                 ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశంలోనే ప్రస్తుతం వున్న రాజకీయ నాయకుల్లో తిరుగులేని నాయకుడు. ఎదురు లేని నాయకుడు. ఏ రాష్ట్రంలో కనిపించని ప్రగతిని తెలంగాణలో చూపించిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రంవచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇక మిగిలిపోయిన పనులంటూ లేకుండా అనేక పనులు పూర్తి చేశాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణమే జరగదని చెప్పి నేలపై, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చూశాడు. సాధ్యం కాదన్న వాటిని సుసాధ్యం చేసి చూపించాడు. అసలు తెలంగాణలో ఇలా నీటి పరవళ్లు చూస్తామని గతంలో ఎవరూ అనుకోలేదు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకెప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. కాకతీయ కాలంలో రూపకల్పన చేసిన చెరువుల ఆనవాలు లేకుండా చేసిన ఉమ్మడి పాలకుల దాష్టికాన్ని దిగమింగుకొని బతికిన తెలంగాణ ప్రజలకు మొత్తం 46వేల పైచిలుకు చెరువులు మళ్లీ గంగాళాలు చేశాడు. నీళ్లతో నింపేశాడు. ఎండాకాలం, వానా కాలం, ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా అన్ని కాలాలు చెరువుల్లో నీటి చుక్క ఇంకిపోకుండా చూసుకుంటున్నారు. మరి ఇలాంటిపరిస్ధితి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వుందా? అంతెందుకు దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రం తమిళనాడు. మరి అక్కడ చెరువులన్నీ ఖాళీ…చెన్నై నగరమే మంచినీటి కోసం కటకటలాడడం చూస్తూనే వున్నాం. కాని మన తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని మిషన్‌ భగీరధ ద్వారా అందిస్తున్నాము. ఇలా దేశమంతా ప్రజలకు మంచినీరు అందించాలన్నదే కేసిఆర్‌ కల. అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించేందుకు సిద్దమౌతున్నారు.

50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.

 

`కట్టాతో రవీందర్‌ రావు మునుగోడు నుంచి…

`ఆగష్టు నుంచే గడపగడపకు…

`బిజేపి దంతా పైన పటారమే…

`గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు…

`పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు…

`రాజగోపాల్‌ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

`ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే…

`చేతులెత్తేసినట్లే లెక్క…

`బిజేపి, కాంగ్రెస్‌ నాయకులంతా టిఆర్‌ఎస్‌ చేరుతూనే వున్నారు.

`బిజేపి, కాంగ్రెస్‌ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి.

`టిఆర్‌ఎస్‌ రోడ్‌ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు.

`తమ మద్దతు తెలియజేస్తున్నారు.

`ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కారు వైపే….

`రైతు బంధు లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్‌ వైపే

`అసరా పించన్లు, ఇతర పింఛన్‌ దారులంతా కేసిఆర్‌ నాయకత్వమే కోరుకుంటున్నారు.

`ఫ్లోరైడ్‌ బాధ విముక్తి టిఆర్‌ఎస్‌ తోనే జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయం చెబుతున్నారు.

`టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి రికార్డు సృష్టిస్తుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపు మామూలుగా వుండదు. మెజార్టీ 50వేలు దాటుతుంది. ఎక్కడికెళ్లినా జనం టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభంజనమే కనిపిస్తోంది. ఎన్నికలన్న తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలి కాబట్టి అన్నట్టుగానే వుంది. వారి ప్రచారం. వారికి ప్రజల్లో స్ధానం. బిజేపికి మునుగోడులో చెప్పాలంటే బిజేపికి లీడర్లు లేరు. క్యాడర్‌ అసలే లేదు. అద్దెకొచ్చిన నాయకులు తప్ప వారితో నడిచేందుకు జనమే లేరు. బిజేపి వైపు ప్రజలు చూడడమే లేదు. బిజేపి నాయకులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే తరిమికొడుతున్నరు. ఈ గ్యాస్‌ ధరలేంది…ఈ నిత్యావసర వస్తువుల ధరలేంది? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మోతేంది? అని బిజేపి నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలే బిజేపి నేతలను పరిగెత్తిస్తున్నారు. వారికి మాటలు లేకుండా చేస్తున్నారు. వారికి చెమటలు పెట్టిస్తున్నారు. ధరలు తగ్గించి రండి…అప్పుడు చూద్దాంపో అని మొహంమీదనే బిజేపి నేతలను ప్రజలు చీకొడుతుంటే ఏం చెప్పుకోవాలో? ఎలా చెప్పుకోవాలో తెలియని అయోమయంలో వున్నారు. దాంతో బిజేపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టిన సంగతి చూస్తునే వున్నాం. ఈ విషయం ముందునుంచి మనం చెబుతూనే వున్నాం. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిందంటే చాలు ఏదో ఒక నాటకానికి తెరతీస్తారని తెలుసు. అదే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అనుసరిస్తున్నది. ఇంకా ప్రజలు బిజేపిని నమ్ముతారా? వారికి ఓట్లేస్తారా? అంటున్న మునుగోడు ఉప ఎన్నికల నియోజవకర్గ ఇన్‌ఛార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…మునుగోడు నుంచి.మునుగోడు ప్రజలకు టిఆర్‌ఎస్‌పై ఎంత ప్రేమ, అభిమానం వున్నాయో గ్రామాలు తిరుగుతుంటే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తమకు జరిగిన మేలు ఏమిటో ప్రజలు మాకే వివరిస్తున్నారు. ముఖ్యంగా మిషన్‌ భగీరధ నీళ్ల గురించి చెప్పని వ్యక్తి అంటూ లేడు. ఏ గ్రామనికి వెళ్లినా ఇదే మాట…ఈ రోజు ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా వున్నారంటే కారణం నీళ్లు. ఈ నీళ్లకోసం ఏళ్ల తరబడి గోస పడ్డ ప్రజల కళ్లలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కృతజ్ఞతాభావం కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. కాంట్రాక్టులు తప్ప, నియోజవర్గ అభివృద్ధి తన వల్ల కాదని వదిలేశాడని ప్రజలు అంటున్నారు. ఆయనను శాపనార్దాలు పెడుతున్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఓట్లేస్తే ఏం చేస్తాడు? నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా నాలుగేళ్లు గాలి తిరుగుళ్లు తిరిగి మళ్లా ఎందుకొచ్చాడో మాకు తెలుసంటున్నారు. గత ఎన్నికల్లోనే రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి పొరపాటు చేశామని, ఈ సారి ఆ పొరపాటు చేయకుండా టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు. మునుగోడుకు నేను ఆగష్టులో వచ్చాను. 

అప్పటినుంచి దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలే కాదు, అన్ని గడపలు కూడా టచ్‌చేశాను. ప్రజల చెప్పే ప్రతి మాట విన్నాను. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ కలిశాను. వాళ్లంతా ఓట్లేసేందుకు సిద్ధంగా వున్నారు. అందుకే మేం మెజార్టీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. 50వేల మెజార్టీ వస్తుందన్న ఆలోచనతో వున్నాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు సభతో ఆ జోష్‌ మరింత పెరుగుతుంది. మా మెజార్టీ కనీవినీ ఎరగరి రీతిలో పెరిగే అవకాశం కూడా వుంది. ఎందుకంటే మేం నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులు. భవిష్యత్తులో గిరిజిన బంధు అమలు వంటి పధకాలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి వుంది. కేసిఆర్‌తోనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ రాకపోతే ఇలాంటి పథకాలు చూసేవాళ్లం కాదని అంటున్నారు. ఇక ఆసరా పెన్షన్‌ దారులు మాత్రం తమ ఓటు కేసిఆర్‌కే అంటూ చెప్పడం కూడా మీడియాలో చూస్తున్నదే. మాకు ప్రత్యక్ష అనుభవంతో వింటున్నదే. వాళ్లు కేసిఆర్‌ గురించి చెబుతున్న తీరు కూడా ఎంతో ముచ్చటేస్తుంది. గతంలో తమ జీవన విధానం, ఇప్పటి జీవిన విధానంలో కనిపిస్తున్న మార్పును స్పష్టంగా చెబుతున్నారు. తమ పెద్ద కొడుకు కేసిఆర్‌ అంటున్నారు. బీజేపీ ప్రచారమంతా పైట పటారమే.. ఆ పార్టీకి క్యాడర్‌ లేదు. లీడర్‌ షిప్‌ అసలే లేదు. కాని కాంట్రాక్టర్‌ను చూసి ఇతర ప్రాంతాలను ప్రచారానికి వస్తున్న జనమే గాని, మునుగోడు ప్రజలు బిజేపి సభలు వెళ్లడం లేదు. ప్రచారంలో పాల్గొనడంలేదు. అంతే కాకుండా ఈ మధ్య ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో ఆయన ఆవేశాలకు లోను కావడం. తాను చెప్పింది మాత్రమే జనాన్ని వినాలనడం…తనను ప్రశ్నించొద్దని ప్రజలను భయపెట్టడం కూడా ప్రజల్లో బిజేపిపై మరింత కోపం పెరిగింది. అసలు రాజగోపాల్‌రెడ్డి పరిస్దితి చూసి, ఆ పార్టీ నేతలెవరూ ప్రచారానికి కూడా రావడంలేదు. ఆయన వెంట తిరిగేందుకు ఇష్టపడడం లేదు. ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రజలు చీ కొడుతున్నారు. అసలు రాజీనామా ఎందుకు? చేశావో మాకు తెలుసంటూ మొహం మీదనే రాజగోపాల్‌రెడ్డిని తిడుతుంటే ఆయనకు రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. తన రాజకీయ భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోంది. ఎందుకు రాజీనామా చేశానా? అన్నది తన ముఖ కవలికల్లో తెలిసిపోతుంది. ఇక కాంగ్రెస్‌ పరిస్దితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. పాల్వాయి స్రవంతికి ప్రచారం చేయడానికి కూడా ఎవరూ లేరు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ జోడోయాత్ర జోష్‌లో వుంది. మునుగోడును వదిలేసింది.

ఎలాగూ మునుగోడులో గెలిచేది లేదు. కనీసం డిపాజిట్‌ కూడా వచ్చేది లేదు. టిఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు నిలబడి కొట్లాడే శక్తి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. దాంతో రాహుల్‌ యాత్రలో పాల్గొన్నాకనీసం పేరొస్తుందన్న ఆలోచనలతో నాయకులు వున్నారు. స్రవంతిని ఒంటరిని చేసి వదిలేశారు. నిజానికి బిజేపి, కాంగ్రెస్‌లు ఎప్పుడో చేతులెత్తేశాయి. మునుగోడులో ప్రజల నాడి వారికి అర్ధమైపోయింది. టిఆర్‌ఎస్‌ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే ప్రచారం మానుకున్నారు. వార్‌ వన్‌ సైడ్‌ చూసి పక్కకు తప్పుకున్నారు. ఇదిలా వుంటే మునుగోడు నియోజవర్గం మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తరాల యుద్దం మొదలుపెట్టారు. మునుగోడులో బిజేపిని పాతిపెట్టేందుకు సిద్ధమౌతున్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడిస్తామని శపధం చేస్తున్నారు. పద్మశాలీలంతా చేనేతపై జిఎస్టీ వేయడాన్ని నిరసిస్తూ పోస్టు కార్డు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టరు. ఈ ఉద్యమం ఒక విప్లవంగా సాగుతోంది. మొదట పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ఉత్తరం రాశారు. పార్టీ శ్రేణులతోపాటు, పద్మశాలీలు ప్రధానికి ఉత్తరాలు రాస్తున్నారు. అంటే చేనేత వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఎలా తుంచేయాలని చూస్తుందో జిఎస్టీతో తేటెతెల్లమైంది దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకమైన ఘట్టం. విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తు ఉత్పత్తి, వినియోగం. ఇది దేశమంతా ఒక ఉప్పెనలాంటి విప్లవాన్ని సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అదే చేనేతతో కేంద్ర ప్రభుత్వాన్ని కదలించేందుకు, వచ్చే ఎన్నికల్లో బిజేపి ప్రభుత్వాన్ని దించేందుకు, ఇప్పుడు మునుగోడులో బిజేపిని ఓడిరచి బుద్దిచెప్పేందుకు ఇక్కడినుంచే అడుగులు మొదలయ్యాయి. చేనేత సోదరులు ఉత్తరాలతో బిజేపి పునాదులు కదలనున్నాయి. పేదలపై భారాలు మోపుతూ, చిన్న చిన్న వ్యాపారాలను చిదిమేస్తూ, చేతి వృత్తులను నాశనం చేస్తున్న బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, బిజేపిని ముంచేందుకు మునుగోడులోనే శ్రీకారం జరుగుతుంది. బిజేపిపై గెలిచి మరోసారి టిఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో చూపిస్తాం…!

మునుగోడు జీవితాలను నిలబెట్టింది కేసిఆర్‌ :ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది.

`కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.

`మిషన్‌ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది.

`మునుగోడులో మంచినీరే సంజీవని.

`ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది.

`కనికరం లేని కాంగ్రెస్‌ నేతల శాపమే ఫ్లోరోసిస్‌ రక్కసి.

`ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్‌ నాయకులకు జాలి కలగలేదు.

`ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు.

`మునుగోడు మీద రాజగోపాల్‌ రెడ్డి కి ఎలాంటి ప్రేమ లేదు.

`వెంకట రెడ్డి మంత్రిగా వున్ననాడు మునుగోడుకు మంచినీళ్లు తేలేదు.

`కిరణ్‌ కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లాకు 8 వేల కోట్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు.

`పులిచింతల ప్రాజెక్టు లాభాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు.

`1972లోనే పివి. నరసింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యకు నిధులు కేటాయించారు.

`ఆ విషయం కూడా కోమటి రెడ్డి సోదరులకు తెలియదు.

`నల్గొండ మాదే, బ్రాండ్‌ మేమే అని చెప్పుకుంటే సరిపోతుందా?

`తెలంగాణ వచ్చిన తర్వాతే మునుగోడు దాహార్తి తీరింది.

`ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందుతోంది.

`ఫ్లోరైడ్‌ బాధితుల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి.

 

`ఫ్లోరైడ్‌ ను మునుగోడు నుంచి తరిమిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ కే దక్కింది.

`మునుగోడులో గెలిచేది కారే…`ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వెంటే…

`జనం నమ్మకమంతా కేసిఆర్‌ నాయకత్వం మీదే…

హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ రాకపోతే మునుగోడు లాంటి ప్రాంతాలుఎలా వుండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. గత పాలకుల పాపానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎంతో మంది అభాగ్యుగులు, ఫ్లోరైడ్‌ పీడితుల జీవితాలను చూస్తుంటే కళ్లలోనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అసలు వాళ్లు కొన్ని దాశాబ్దాల కాలంగా పసి తనం నుంచి వయసు మళ్లే దాకా ఎలా బతికి బట్టకట్టారో అన్నది వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎలా జీవించారో , ఎలా జీవితాలను నెట్టుకొచ్చారన్నది చూస్తుంటే గుండె చెరువౌతుంది. తినే తిండిలో ఫ్లోరైడే…తాగే నీటిలో ఫ్లోరైడే…శరీరమంతా ఫ్లోరైడ్‌నిండి, ఎండిన కర్రల్లా ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో! అనుకుంటూ క్షణ క్షణం బతకడం అంటే ఎంత నరకమో!! వినడానికే గుండె ధైర్యం చాలడం లేదు. అలాంటి మునుగోడు వాసుల గోడు వింటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుణ్యమా అని మిషన్‌ భగీరథ ద్వారా అందుతున్న మంచినీళ్లు వారి జీవితాలకు అమృతంలా మారి, ఆయు ప్రమాణాలు పెంచాయో వారి మాటల్లో వింటుంటే ఆనందమేస్తుంది. మిషన్‌ భగీరధ నీళ్లు వారి జీవిత కాలాన్ని పెంచాయని చెబుతుంటే అంతకన్నా సంబురం మరొకటి వుంటుందా? అని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డితో మునుగోడు నుంచి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు…. మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనోగతాన్ని వివరించారు.

ఆ విషయాలు ఆయన మాటల్లోనే… ప్రచారం కోసం మర్రిగూడ ప్రాంతంలో ప్రజలు చూసినప్పుడు గత పాలకులు చేసినపాపం ఏమిటో? వారికి వత్తాసు పలికిన నాయకులు, కనీసం తమ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడగలేని దద్దమ్మలాంటి నాయకులు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సిగ్గూ శరం విడిచి, మానాభిమానుల వదిలేసి, ఇంకా ప్రజలకు తామే దిక్కని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా అక్కడి ప్రజలను పాలించిన నాయకులు ఎంత దుర్మార్గులో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీల నాయకులంటే ప్రజలు అసహ్యించుంకుటున్నారు. అంతే కాదు బిజేపిపార్టీకి చెందిన నాయకులు సిగ్గు లేకుండా తాము ఫ్లోరైడ్‌ సమస్య తీర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు బాధితుడైన స్వామి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు,మంత్రి కేటిఆర్‌ తమకు ఎలాంటి సాయం చేశారన్నది చెబుతున్నాడు. తెలంగాణరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ తమ మునుగోడుకు ఏం చేశారన్నది చెబుతున్నాడు. ప్లోరైడ్‌ను ఎలా పారద్రోలాడో స్వామి చెబుతున్నాడు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు మిషన్‌ భగీరధ ద్వారా ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. వాటిని చూసుకుంటూ, స్వామి లాంటి వారు చెప్పే మాటలు వింటూ కూడా ఇంకా బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్‌ బాధితుడైన స్వామికి సైతం కాంగ్రెస్‌ పార్టీ ఇల్లు ఇవ్వలేదు. అతని వృత్తి చేసుకునేందుకు అవసరమైన చేయూతనివ్వలేదు. ఫ్లోరైడ్‌సమస్య మునుగోడులో తీర్చలేదు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు గోడును ఏనాడో తీర్చారు. స్వామి లాంటి వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చారు. ఆయన కాళ్ల మీద ఆయన నిలబడేందుకు అవసరమైన సెలూన్‌ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించారు. దివ్యాంగుల పెన్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇదీ మునుగోడు ప్రాంత ఫ్లోడైడ్‌ బాధితులైన దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత. నిస్సహాయులైన ఫ్లోరైడ్‌ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అన్నది ఫ్లోరైడ్‌ ఉద్యమంలో భాగస్వామైన స్వామి చెబుతున్నారు. ఇవి కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలకు రుచించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడానికి కూడా ఆ రెండు పార్టీలకు ఎలాంటి అర్హత లేదు. ఓటు అడిగే నైతిక హక్కు వారికి అసలే లేదు. ఏ ఒక్కనాడు ఫ్లోరైడ్‌ భాధితుల గోడు వినుకుండా దశాబ్ధాల పాటు మునుగోడులో రాజకీయం చేసినందుకు వాళ్లు సిగ్గుపడాలి. ఇప్పుడు మునుగోడు ప్రగతిని చూసి తల దించుకోవాలి.నిన్నటి తరం మునుగోడు బాధలుపట్టని పాలకుల నిర్ధయకు బలై, ఎంతనరకం అనుభవించారో కదిలిస్తే ఒక్కొ ఇంటిలో ఒక్కొ ధీనగాధ వినిపిస్తోంది.

 కళ్ల ముందే ఫ్లోరైడ్‌ శరీరంలో నిండిపోయి, తనువు చాలిస్తున్నవారిని చూస్తూ తమ జీవితానికి కూడా రోజులు లెక్కబెట్టుకున్న వారు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ఫ్లోరైడ్‌ మహామ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టామని చెబుతున్నారు. కేసిఆర్‌ లాంటి పాలకులు వుంటే ప్రజలు ఏ సమస్య రాదని చెబుతున్నారు. అప్పటి రోజులకు ఇప్పటి రోజులు పూర్తి భిన్నం. ఉద్యమ నాయకుడైన కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రమంతా తిరిగారు. అందులో భాగంగా ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పరిస్దితి తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అప్పటిపాలకులతో కొట్లాడాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ పాలకులకు కనికరం లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు నాలుక లేకపోయింది. ఆ నాలుకలో నరం చచ్చుబడిపోయింది. కనీసం ఉద్యమ నాయకుడు కేసిఆర్‌తో కలిసి గళమెత్తే ధైర్యంలేకపోయింది. వారికి పదవులు కావాలి. కాంట్రాక్టులు కావాలి. ప్రజల గోడు విన్నది లేదు. మునుగోడు బాధ పట్టించుకున్నది లేదు. ఫ్లోరైడ్‌ మూలంగా ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా, ఉమ్మడి పాలకులతో కొట్లాడాలన్న సోయి రాలేదు. ఉద్యమ కాలంలో మునుగోడు బాధలు చూసిన కేసిఆర్‌ తెలంగాణ రాగానే మిషన్‌ భగీరధ ఫలితాలు ముందు మునుగోడుకే అందించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. కొన్ని విషయాలు వింటుంటే వారి జీవితానుభవాలు పగవారికి కూడా రాకూడదని అనిపిస్తుంది.

ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు కూడా ముందుకు వచ్చేవారు కాదని తెలిసి ఆశ్చర్యపోయాను. మునుగోడులోని మర్రిగూడ మండలంలో పనిచేయాలంటే ఉద్యోగులు మరింత భయపడేవారట. వాళ్లు ఇక్కడి మంచినీళ్లు తాగలేక దాహం తీర్చుకునేందుకు యూరిన్‌ను పట్టుకొని, వడబోసి తాగేవారని తెలిసింది. అంత దుర్మార్గమైన పరిస్ధితులను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారన్నది విని మనసు చలించిపోయింది. ఇలాంటి పరిస్ధితులు అనుభవించిన వారు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మిషన్‌ భగీరధ కార్యాక్రమం ఎందుకు ఎంచుకున్నారో అర్ధమౌతుంది. అలాంటి పరిస్ధితులు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి రాకూడదన్న బృహత్‌ సంకల్పంతోనే మిషన్‌ భగీరధ పథకం తీసుకొచ్చారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్ధం కావాలి. మిషన్‌ భగీరధ ఎంత విజయవంతమైన సంక్షేమ పథకమో అప్పుడర్ధమౌతుంది. మాట్లాడేవారు చాలా మాట్లాడతారు. ఒక్కసారి మునుగోడు ప్రజలు బాధలు చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మంచినీళ్ల విలువ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తెలియకున్నా, మునుగోడులో మంచినీళ్లే అమృతంతో సమానం. జీవితాలను నిలబెడుతోంది. అర్ధాంతర ఆయువులను అడ్డుకుంటోంది. గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది. భవిష్యత్తును అందమైన లోకం చేస్తుంది. మునుగోడు ప్రజల జీవితాలను ఆనందమయం చేసింది నీళ్లే…ఆ నీళ్ల కోసమే దశాబ్దాలు వాళ్లు పోరాడిరది. మాకు ఏమీ ఇవ్వకున్నా ఫరావాలేదు. మంచినీళ్లివ్వండి మహాప్రభో అని డిల్లీదాకా వెళ్లే, ఉత్తచేతులు చూపించారు. మళ్లీ ఊసెత్తలేదు. నీళ్లకోసం నిధులు విడుదల చేస్తామని చెప్పి మాట మార్చారు. మర్చిపోయారు. ప్రజలు జీవితాలను ఆగం చేశరు. తెలంగాణ వస్తే గాని మునుగోడు లాంటి ప్రాంతాల బాధ తీరదని చెప్పారు. తెలంగాణ తెచ్చాక మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, తినే తిండిలో, తాగే నీళ్లలో ఫ్లోరైడ్‌లేకుండా చేశారు…ఫ్లోరైడ్‌ ను పెంచి పోషించిన పాపాత్ములకు రాజకీయాల్లో స్ధానం లేకుండా చేశారు…అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌నే కొలుస్తున్నారు. టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని చెబుతున్నారు.

పూటకోమాట…!

 

`మాయమాటలు…ఊసరవెల్లి రంగులు?

 `రెండు రోజుల్లో మూడు మాటలు!

`కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్‌ షోకాజ్‌ నోటీస్‌

`రాజకీయ దివాళా కోరుతనం అంటున్న జనం…

`ఇంత దగాకోరు మాటలు గతంలో ఎవరూ మాట్లాడలేదంటున్న కాంగ్రెస్‌ శ్రేణులు….

`నేనే పిసిసి అంటాడు….ఈసారికి తమ్ముడిని గెలిపించాలంటాడు…

`కాంగ్రెస్‌ గెలిచేది లేదంటున్నాడు!

`నన్ను నమ్మనప్పుడు పార్టీలో ఎందుకుంచుకుంటున్నారంటాడు…!

`రాజకీయాలనుండి తప్పుకుంటానంటాడు….

`నేనిక్కడే వున్నా నేనెక్కడికి పోలేదన్నాడు…

`రెండు రోజులకు ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం…

`ఇన్ని జిత్తుల మారి వేషాలా?

`ప్రజా ప్రతినిధిగా ఇన్ని అబద్దాల?

`ఎన్నికలలో గెలవడానికి నమ్మి నెత్తిన పెట్టుకున్న పార్టీకే వెన్నుపోటా!

`తమ్ముడు కాంట్రాక్టు కోసం…

`అన్న ,తమ్ముడి రాజకీయం కోసం…

`ఓట్లేసిన జనాన్ని వెర్రివెంగలప్పలను చేద్దాం!

`మంటెక్కి వున్న కాంగ్రెస్‌ నేతలు!

`గతంలో డిల్లీలో వుండి సోనియా గాంధీ చేసిన ధర్నాలో పాల్గొనలేదు..!

`రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు డుమ్మా కొట్టాడు…!

`నమ్మి మునుగోడు చేతిలో పెడితే నిండా ముంచిన అన్నాదమ్ములు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 నేను నిజాయితీ పరుడిని…నేను ప్రజల కోసం త్యాగం చేసే నాయకుడిని…ప్రజల ప్రతినిధిని…పేదోళ్లకు అండగా వుండే నాయకుణ్ణి…అని చెప్పుకునే గొప్పలన్నీ ఉత్తవే అని, నమ్మించి మోసం చేయడానికే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించుకుంటున్నాడు. ఇంత కాలం ఆయన మాటలు నమ్మిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక నాయకుడు తన స్వార్ధం కోసం కూడా ఇంత కాలం నమ్మించగలడా? ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన కోసం పనిచేస్తూ, తన ఎదుగుదలకు పార్టీని వాడుకుంటూ, ఇంకా ఆ పార్టీలోనే వుంటూ, ఇంత కాలం పదవులు అనుభవిస్తూ, పార్టీకే గోతులు తవ్వుతూ తమ బ్రాండ్‌ అసలు నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో వుండడం వెంకటరెడ్డికి కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసే ధైర్యం లేదు. తమ్ముడి కోసం త్యాగం చేయాలని వున్నా, అదును కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో గెలిస్తే, జంప్‌ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు..లేకుంటే కాంగ్రెస్‌లోనే కొనసాగాలన్న అంతర్మధనంలో వున్నాడు. తనంటత తాను వెళ్లిపోవాలని వున్నా, భవిష్యత్తులో ప్రజలు నమ్మరన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది. అందుకు పార్టీకి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడుతూ, తనను బైటకు సాగనంపితే వెళ్ధామని చూస్తున్నాడు…స్వయంగా ఆయనే నన్ను భరించమని ఎవరంటున్నారు… నా ప్రవర్తన నచ్చపోతే పంపించండని పార్టీకి సవాలు విసిరే మాటలు కూడా మాట్లాడాడు. అంటే తనను కాంగ్రెస్‌ పార్టీ బైటకు పంపిస్తే దాన్ని కూడా సానుభూతికింద వినియోగించుకుందామని చూస్తున్నాడు. కాని ప్రజలు అంత అమాయకులా? 

 గతంలో ఎన్నడూ వెంకటరెడ్డి వంటి నాయకులను చూడలేదన్నది రాజకీయాలు తెలిసిన వారు అంటున్న మాట.

 ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుబంధం వున్న పార్టీని ఇంత కాలం తన స్వలాభం కోసమే వెంకటరెడ్డి వినియోగించుకున్నాడన్నది నిజం. ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది. ఆయన నిజ స్వరూపం చూపించుకున్నాడు. అంతటి సీనియర్‌ నాయకుడు పూటకో మాట…గంటకో తిరకాసు రాజకీయం చేయడం అన్నది ఎక్కడా చూడలేదు… రెండు రోజుల్లో మూడు రకాలైన మాటలు మాట్లాడి, తనకు నాలుక మడతెట్టడం చాలా సులువు అని నిరూపించుకున్నాడు. జనం వెర్రి వెంగలప్పలని చెప్పకనే చెబుతున్నాడు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి చూస్తుంటే కూడా వెంకటరెడ్డి మాట్లాడే మాటలు వెగటుపుట్టిస్తున్నాయి. చండూరు సభలో అద్దంకి దయాకర్‌ మాటలు తనను గాయపర్చాయని చెప్పి కొంత కాలం సాగదీశాడు…తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్షమాపణచెప్పాలన్నాడు. అద్దంకిని పార్టీనుంచి పంపించేయాలన్నాడు. తర్వాత ఏదో సందర్భంలో రేవంత్‌ రెడ్డి ఐపిఎస్‌, హోంగార్డుల మాటలు పట్టుకొని దాన్ని పెద్ద రాద్దాంతం చేశాడు…అలా కొంత కాలం గడిపాడు…ఆఖరుకు అద్దంకి దయాకర్‌తోపాటు, రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు…అబ్బే…నా మనసు కరగలేదన్నాడు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెబితే మునుగోడు ప్రచారం గురించి ఆలోచిస్తానన్నాడు. తీరా రేవంత్‌ క్షమాపణ చెప్పాక తూచ్‌ అన్నాడు. నాకు మనస్తాపం ఇంకా తగ్గలేదన్నాడు. సీనియర్లందరి చేత పట్టుబట్టించి పాల్వాయి స్రవంతికి టిక్కెట్టు వచ్చేలా రాజకీయం చేశాడు… రేవంత్‌ను అలా దెబ్బకొట్టాడు…గాంధీ భవన్‌లో పాల్వాయి స్రవంతిని దీవించి, మళ్లీ తూచ్‌ అన్నాడు…తమ్ముడి కోసం సెల్‌ఫోన్‌ ప్రచారం మొదలు పెట్టాడు…అదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆ ఆడియా ఇప్పటిది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు… పార్టీ మీ మీద గుర్రుగా వుందని మీడియా ప్రశ్నిస్తే ఎందుకు ఎవరు భరించమంటున్నారంటూ పార్టీని ప్రశ్నించాడు…ఆఖరుకు ఆస్ట్రేలియా వెళ్లి, నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదన్నాడు. ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తానన్నాడు. మునుగోడు ఫలితం వచ్చే దాకా వెంకటరెడ్డి ఇండియాకు రాకపోవచ్చు…వచ్చి అప్పుడేం చెబుతాన్నది ఆసక్తి కరంగా మారింది. 

గత మూడు నాలుగు నెలల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కమాట మీద నిలబడే నాయకుడు కాదని తనకు తానే నిరూపించుకుంటూ వస్తున్నాడు.

 పదే పదే అబద్దాలు చెబుతూ వస్తున్నాడు. అందర్నీ నమ్మిస్తూనే , పార్టీని నిండా ముంచుతున్నాడు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నాడు. తన తమ్ముడికోసం పార్టీని శ్రేణులను అమోయయానికి గురిచేస్తున్నాడు. పార్టీ శ్రేణులకు ఆశ చూపించి ఓట్లేయించుకునేందుకు విదేశాలనుంచి స్కెచ్‌ వేస్తున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వెంకటరెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన కాంగ్రెస్‌ ఫార్టీ షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది. అందుకు పది రోజుల గడువు పెట్టింది. ఈ లోపు పుణ్య కాలం వెళ్లిపోతుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా తేలిపోతుంది. అప్పుడు మళ్లీ వెంకటరెడ్డి ఏ రాగం అందుకుంటాడో అని అంటున్నారు. ఇంత దగా కోరు మాటలు గతంలో ఏ నాయకుడు మాట్లాడలేదని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ మధ్య తనకు తెలసిన కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్‌ చేసి, ఈ ఒక్కసారి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయమని అడిగాడు. మంచికీ, చెడుకు పనికొచ్చేది మేమే అంటూ చెప్పాడు. అదేంటని మీడియా, పార్టీ ప్రశ్నిస్తే అది ఇప్పటిదికాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని ఎవరూ నమ్మలేదు. అది ఈ మధ్య మాట్లాడిన మాటలే అని తేటతెల్లమయ్యాయి. అంతే కాదు ఫోన్‌లోనే తానే పిసిసి ప్రెసిడెంటునౌతానని చెప్పాడు. ఇలా రెండు నాలుకల మాటలు అనడం కన్నా, ఊసరవెళ్లి రంగులు అని చెప్పడం కరక్టుగా వుంటుందని రాజకీయ పార్టీలంటున్నాయి. 

   నిజానికి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో దూరంగా వుంటున్నాడు.

 ఎందుకంటే పిపిసి అధ్యక్షుడిని నేనే అని కలలు గన్న వెంకటరెడ్డికి అధిష్టానం షాక్‌ ఇచ్చింది. రేవంత్‌ను పిసిసి చేసింది. దాంతో అప్పటినుంచి అక్కసు మొదలై, పార్టీకి దూరమయ్యేందుకే చూస్తున్నాడు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లుపెట్టి పిసిపి కొనుక్కున్నాడని అన్నాడు. ఇక గాంధీభవన్‌ మెట్లు ఎక్కనన్నాడు. కాని ఏ మాట మీద ఆయన నిలబడలేదు. రేవంత్‌తో కలసి ముచ్చట్లు బాగానే వుంటాయి…తర్వాత పక్కకు జరగ్గానే విమర్శలు అంతే విధంగా వుంటాయి. ఆ మధ్య సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ జరిగింది. ఆ సమయంలో సోనియాగాంధీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ జరిపారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో వెంకటరెడ్డి పార్లమెంటులో వున్నాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంతనాలు జరిపారు. ఇక తాజాగా రాష్ట్రంలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర జరుగుతోంది. కాని వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నాడు. ఇంతకన్నా నయ వంచన ఏదైనా వుంటుందా? పార్టీ ఎంపిగా వుంటూ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కోవర్టు రాజకీయాలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పార్టీ నమ్మి మునుగోడు చేతిలో పెడితే తమ్ముడు నిండా ముంచి పోయాడు…నల్లగొండ రాజకీయాలు అన్న వెంకటరెడ్డి చేతిలో పెడితే పార్టీనే నామరూపాలు లేకుండా చేస్తున్నాడు…! నైతికతకు అర్ధాలు మార్చుతున్నాడు…నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాడని కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version