BRS Leaders Slam Congress Over Kathanpalli Issue
గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….
బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తుంది….
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
సింగరేణి, పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త….
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సిపిఐ పార్టీ ప్రలోభాలకు లొంగదు…
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్
రామకృష్ణాపూర్, నేటిదాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి అన్ని వార్డుల్లో పోటీ చేసి 14 సీట్లు కైవసం చేసుకున్నా సరే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని, గెలిచిన కౌన్సిలర్లను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కౌన్సిలర్ల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

11వ వార్డు లో గెలిచిన కౌన్సిలర్ బొమ్మ భూమయ్య గౌడ్ ఇంటి సమీపంలోకి సింగరేణి అధికారులు వచ్చి అట్టి భూమి సింగరేణికి సంబంధించిందని, సూచిక బోర్డులు పాతి భూమయ్య గౌడ్ భార్యను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, సిపిఐ కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామకృష్ణాపూర్ లోని కౌన్సిలర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.కౌన్సిలర్ భార్యకు మనోధైర్యాన్ని అందించారు.అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తోందని దుయ్యబట్టారు. సిపిఐ పార్టీ కౌన్సిలర్లను బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న సరే ఎక్కడ కూడా కౌన్సిలర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ బెదరకుండా ముందడుగు వేస్తున్నారని అభినందించారు. క్యాతన్ పల్లి మునిసిపాలిటీ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసి అక్రమంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించారని, అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయ్యిందని అన్నారు. బిఆర్ఎస్, సీపీఐ నాయకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

దాడులకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీసులు తెలిపాలని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిగా విఫలమయిందని, అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి లకు తలొగ్గి కౌన్సిలర్ల కుటుంబాలపై ఒత్తిడి తీసుకొస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి, స్థానిక మంత్రికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సిపిఐ పార్టీ ఎలాంటి ప్రలోభాలకు లొంగదని , పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
