
తల్లిపాలు నవజాత శిశువుకు వెలకట్టలేని సంపద…
నేటి ధాత్రి :-
శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు అందించడం శ్రేష్టకరమని, పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధి తో పాటు తల్లి ఆరోగ్యానికి తల్లి పాలే కీలకమని పెద్దకిష్టపురం అంగన్వాడి కార్యకర్త భూక్యా సంత్ర అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పెద్ద కిష్టాపురం గ్రామపంచాయతీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ర మాట్లాడుతూ, ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలు పట్టే సమయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేష్టమని, తల్లిపాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని దీని ద్వారా ఆ బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.తల్లి పాలలో మంచి పౌష్టికాలు ఉండి పిల్లవాడు ఎదుగుదలకు మరింత తోడ్పడుతాయని అన్నారు. పిల్లలకు తల్లిపాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని, దీనివల్ల శిశువుకు ఎటువంటి మానసిక వైకల్యం లేకుండా ఉండడమే కాకుండా తల్లిపాల వల్ల బాలలకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరవని అన్నారు. అనంతరం సీజనల్ వ్యాధుల పట్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.వీరభద్రం, వేణు కుమార్, రామ, మానస, రమ్య, కళ్యాణి, మమత, రేణుక తదితరులు పాల్గొన్నారు.