ఆంధ్రాలో ‘‘రాజన్న బిడ్డ’’ దే ‘‘రాజ్యం’’

https://epaper.netidhatri.com/

`మూడో ముఖ్యమంత్రి ‘‘షర్మిలే’’

`ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్‌ చేతిలోనే.

`ఆంధ్రలో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్‌ పూర్తి సహకారం.

`రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రాలో కాంగ్రెస్‌కు పునర్వైభవం.

`షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వచ్చినప్పుడు రేవంత్‌ సూచన.

`ఇప్పుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనే ఆచరణ.

`తెలంగాణలో కాంగ్రెస్‌ నీ అధికారంలోకి తెచ్చాడు.

`ఆంద్రలో కాంగ్రెస్‌కు మళ్ళీ ఉపిరిపోస్తున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలు చాలా విచిత్రమైనవి. ఒక నాడు అన్న కోసం త్యాగం చేసిన చెల్లె, ఇప్పుడు అన్నతోనే పోరాటం చేయాల్సివస్తోంది. ఒకనాడు అన్న అన్యాయం జరిగిందని అన్న పక్షాన నిలబడి కొట్లాడిన చెల్లె ఇప్పుడు అన్నతోనే కొట్లాడాల్సి రావడం విచిత్రం. అన్నకు అధికారం కోసం ఆరాపడిన చెల్లె, ఇప్పుడు అదే అన్నను గద్దె దించేందుకు పోరాటం చేస్తోంది. ఇలాంటి సందర్భాలు బహుషా ప్రపంచ చరిత్రోలనే ఎక్కడా జరిగి వుండకపోవచ్చు. రాజుల కాలంలో ఏమైనా జరిగాయో? ఏమో కాని ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న తర్వాత ఎక్కడా జరిగిన ధాఖరలాలు లేవు. ఒక దశలో నాకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని చెప్పిన షర్మిలనే తెలంగాణ రాజకీయాలకు వచ్చి భవిష్యత్తులో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నేడు నేనెందుకు ముఖ్యమంత్రి కావొద్దని అనుకుంటోంది. నేనెందుకు రాజకీయాలు శాసించకూడదనుకుంటోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆమె అన్న వదిలిన బాణమే అన్నారు. ఆ తర్వాత అన్న సహాకారంలో కేసిఆర్‌ వదిలిన బాణం అన్నారు. మరి కొంత కాలానికి బిజేపి వదిలిన బాణం అన్నారు. కాని ఆమెకు మాత్రమే తెలుసు. తనకు తాను నాయకురాలిగా నిరూపించుకునేందుకు ఎక్కడో అక్కడ నిలడాలనుకున్నారు. నిలిచి రాజకీయం చేయాలనుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొవాలనుకున్న సామెతను ఇప్పుడు నిజం చేస్తున్నారు.
ఆంధ్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు మెరుసింది షర్మిల.
ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పే స్ధితికి చేరుకున్నది. అయితే ఇదంతా కేవలం ఆమె రాజశేఖరరెడ్డి బిడ్డ కావడం వల్లనే అన్నది కొందరి వాదన. కాని నిజానికి షర్మిల ఒక పోరాట యోధురాలు. దాంతో ఇప్పుడు జరుగుతున్న చర్చను ఓసారి గమనిస్తే ఆంధ్రాలో రాజన్న బిడ్డదే రాజ్యమా! అన్నదే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత విజయవాడ మొత్తం జన సందోహంతో నిండిపోయింది. కాంగ్రెస్‌ జెండాలు చాలా కాలం తర్వాత రెపరెపలాడాయి. విజయవాడ మొత్తం కాంగ్రెస్‌ మయమైంది. నిజానికి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం మారిపోతుందని ఊహించేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వుంది. ఆ పార్టీకి అధ్యక్షుడు వున్నాడు. కాని గత పదేళ్ల కాలంలో ఆ పార్టీకి మనుగడ లేదు. నాయకుల ఉనికి లేదు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్‌ విభజించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు. కాకపోతే ఇంత తొందరగా ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ జెండాలు పట్టుకుంటారని కూడా ఎవరూ అనుకోలేదు. అది కూడ షర్మిల రావడం మూలంగా జరిగిందే తప్ప, సోనియా గాంధీ వచ్చినా జెండా ఎగిరేదికాదు. పది మంది జనం రోడ్లపైకి వచ్చేవారు కాదు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో షర్మిల రాక సునామీ తలపిస్తోందంటున్న వాళ్లు కూడా వున్నారు. అందుకేఉ ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రి షర్మిలే అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకనాడు కాంగ్రెస్‌ను వదిలి జగన్‌ వెంట వెళ్లిన వాళ్లుంతా, మళ్లీ షర్మిల కోసం రావడం అంటేనే కాంగ్రెస్‌కు పాత రోజులు వచ్చినట్లే లెక్క. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగరవేయ బోతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇక కాంగ్రెస్‌ చేతిలోనే వుండబోతున్నాయి. షర్మిలకు తెలంగాణ నుంచి పూర్తి సహాకారం అందేందుకు అన్ని రకాల హమీలు కూడా వున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడానికి కూడా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది రేవంత్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు కూడా ఊపిరిపోయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఒకనాడు అన్నకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, పోరాటం చేసిన వనిత షర్మిల.
ఓదార్పు యాత్రలో వున్న అన్న జగన్‌ను అప్పటి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు తరలించిందని ఓదార్పు యాత్ర చేపట్టింది. ఆ తర్వాత బస్సు యాత్ర చేసింది. తదనంతరం అన్న కోసం పాదయాత్ర చేసింది. అన్నను అధికారంలోకి తీసుకురావడానికి దశాబ్ధ కాలంపాటు అహర్నిషలు కృషి చేసింది. జనంలో వున్నది. అన్న కోసం పనిచేసింది. అన్నను ముఖ్యమంత్రి చేయాలిని కంకణం కట్టుకున్నది. 2014 ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ప్రచారం చేసింది. కాని వైసిపికి 2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కలేదు. అయినా జగన్‌ నిరుత్సాహపడలేదు. షర్మిల కూడా అలసిపోలేదు. 2019 ఎన్నికల్లో అన్న కోసం మళ్లీ ప్రచారం చేసింది. 2019 ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కాని చేయలేదు. 2019లో కూడా విశాఖపట్నం నుంచి షర్మిల పోటీ చేస్తుందనుకున్నారు. చేయలేదు. అంతకు ముందు 2014లో విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో షర్మిల కీలక భూమిక పోషిస్తుందనుకున్నారు. కాని జరగలేదు.
ఉన్నట్లుండి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది.
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది. మళ్లీ 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేస్తానని చెప్పింది. అక్కడ ఇల్లు కూడా నిర్మాణం చేసుకున్నది. ఖమ్మం జిల్లాలో పెద్ద రాజకీయ సభ ఏర్పాటుచేసింది. ఆ సభ కూడా ఎంతో విజయవంతమైంది. దాంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే షర్మిల తెలంగాణ రాజకీయాలు చేయడం ఎవరికీ సుతారం ఇష్టం లేదు. తెలంగాణ నా మెట్టినిల్లు ..అసలైన ఇల్లు అని ఎంత చెప్పుకున్నా ఆమెను పెద్దగా జనం నమ్మలేదు. పాదయాత్ర సందర్భంగా ఆమెకు ప్రజలు బాగానే వచ్చినా ఎక్కడో ఆమెకు నమ్మకం కలగలేదు. ఇదే సమయంలో తెలంగాణలో అన్ని పార్టీలతోనూ ఆమె గిచ్చి కయ్యం పెట్టుకున్నట్లే వ్యవహరించారు. దాంతో ఆమెను ఎవరూ నమ్మేందుకు సిద్దం కాలేదు. ఆఖరకు ఆమె పార్టీని ఎవరికీ జెండా పీకేశారు. అయితే ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయడంకోసం చేసిన రిహార్సల్‌ అని చాలా కాలం తర్వాత జనాలకు అర్ధమైంది. తెలంగాణలో ఆమె పరోక్షంగా కాంగ్రెస్‌కు సహరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టింది. ఏది ఏమైనా ఆమె అనుకున్న దారిలోనే ప్రయాణం చేస్తున్నట్లు మాత్రం అర్దమౌతోంది.
అన్నను బలంగా ఢీ కొట్టాలంటే బలమైన శత్రువుతో చేతులు కలిపి వెళ్తేనే కొట్టలను అనుకున్న షర్మిల కాంగ్రెస్‌ పంచన చేయడం ఎవరూ ఊహించిందికాదు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఇక్కడ వర్కవుటైంది. ఈ విషయంలో మాత్రం రాజశేఖరరెడ్డి రాజకీయాన్ని ఆమె మరోసారి చేసి చూపించిందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆమెకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ బలమే కాదు, తెలంగాణ కాంగ్రెస్‌ మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారం పూర్తిగా ఆమెకు వుంది. ఈ బలమంతా ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు కూడా చాలా మంది షర్మిలకు సహకారం అందిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్‌కు ఎట్టి పరిస్ధితిల్లోనూ సహకారం అందించలేరు. కాని షర్మిలకు అందించేందుకు అవకాశం వుంది. ఏదో రకంగా ఆ కుటుంబానికి సాయం చేసే అవకాశం రావడం మాకు అదృష్టం అనుకునే నాయకులు కూడా చాలా మందే తెలంగాణ కాంగ్రెస్‌లో వున్నారు. ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్‌ ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలను ఆమె ఏలుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *