Tragic Bhadrachalam Road Accident Kills 9
భద్రాచలం రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం
9మంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల మృతి ఘోరం
విచారం వ్యక్తం చేసిన పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి
*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం..
పలమనేరు(నేటి ధాత్రి)
భద్రాచలం నుంచి అన్నవరానికి యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు- మారేడుమిల్లి ఘాట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన ప్రమాదంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడడమే గాక అందులో పలమనేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న ప్రత్యేక సమావేశాలకు హాజరైన ఆయన ఈ ఘటనపై తక్షణం స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకొని వారికి అవసమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇక ప్రమాదంలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుపలమనేరుకు చెందిన శివశంకర్ రెడ్డి, సునంద రెడ్డిలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించిందని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు.
