ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది టీ హస్తంపార్టీకి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పొన్నాల తన రాజీనామా లేఖను పంపించారు. జనగామ టికెట్ ఆశించిన పొన్నాల అసంతృప్తి వ్యక్తంచేస్తు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పొన్నాల నీటి పారుదల శాఖామంత్రిగా పనిచేశారు.అలాగే గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
పొన్నాల రాజీనామా చేసిన క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు.ఫోన్ లో మాట్లాడేందుకు యత్నిస్తే కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్నారనే వస్తున్న వార్తల్ని పొన్నాల ప్రస్తావించారు. బీసీ నేతలను ఓడిపోయేవారిగా చిత్రీకరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికి ఇస్తున్న ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వటంలేదంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు పొన్నాల లక్ష్మయ్య. కాగా పొన్నాల బీఆర్ఎస్ లో చేరతారు అనే ప్రచారం జరుగుతోంది. దీంట్లో నిజమెంత..? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి కూడా ఇటీవలే బీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.