ఈ నెల 13న ఆర్టీఐ కమిషన్ కు హాజరుకావాలని ఆదేశాలు
దుబ్బాక నేటి ధాత్రి
స.హ చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు పంపింది.ఈనెల 13న తమ ఎదుట హాజరు కావాలంటూ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట కి చెందిన సమాచార కార్యకర్త ఎన్.బాలరాజు అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 27, సెప్టెంబర్ 13 న మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి వచ్చిన నిధులు వాటిని ఖర్చు పెట్టిన అభివృద్ధి పనుల వివరాలు,కార్యాలయంనకు బకాయి పడ్డ పన్ను ఎగవేతదారుల వివరాలు,
ఉద్యోగులు వారి జీతభత్యాలు,
కార్యాలయానికి అవుతున్న ఖర్చుల వివరాలు,సొంత ,అద్దె వాహనాల కొనుగోలు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకున్నాడు.కోరిన సమాచారానికి ప్రజా సమాచార అధికారి అసంపూర్తి సమాధానం పంపడంతో గతేడాది నవంబర్ 15 న సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పిలేట్ అధికారి కి దరఖాస్తు చేశాడు దానికి కూడ మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంతో
ప్రథమ అప్పీలు చేసుకున్నారు.
అయినను సరైన సమాధానం రాకపోవడంతో సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ కు ఈ ఏడాది జనవరి 7న రెండో అప్పీలు చేసుకున్నాడు.దీనిపై స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ ఈనెల 13న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ దుబ్బాక మునిసిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.