కాటారం నేటి ధాత్రి:
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తలపెట్టిన నిరాహార దీక్ష మండలంలో కొనసాగుతుంది. ఆశా కార్యకర్తలు స్థానిక తాసిల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల నెలసరి వేతనాన్ని 18 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆశాలకు పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు నినాదాలు చేశారు. ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించి 5 లక్షల రూపాయలకు పెంపు చేయాలని, ఆశాలకు రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఏఎన్ఎం, జిఎన్ఎమ్ పోస్టులలో ఆశాలకు వెయిటేజ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగాలలో ప్రమోషన్ సదుపాయం వర్తింపచేయాలని వారు కోరారు. ఆశాలతో ఉద్యోగ బాధ్యతలతో సంబంధం లేని పనులను చేయించవద్దని వారు డిమాండ్ చేశారు