కేసముద్రం (మహబూబాబాద్),నేటి ధాత్రి:
కార్మిక చట్టాల పరిరక్షణకై సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐటీయూసీ మండలకార్యదర్శి మంద భాస్కర్,సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజ్,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో కార్మిక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను,కార్మికవర్గ సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందన్నారు.73% సంపద ఒక్క శాతం ఉన్న సంపన్నుల వద్ద కేంద్రీకృతమైందన్నారు.దీనివలన నిరుద్యోగం,కనీసవేతనం,గిట్టుబాటు ధర,ద్రరిథ్యం,వలస లాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.కార్పొరేట్లకు అనుకూల విధానాలను కేంద్ర ప్రభుత్వం బరితెగించి తీసుకురావడం వలన వాళ్ల సంపద అనేక రేట్లు పెరిగిందన్నారు.సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే విధంగా శ్రామికుల శ్రమను దోచే విధంగా తయారు చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తోందని విమర్శించారు.అనేక సంవత్సరాలు పోరాటం చేసి బ్రిటిష్ కాలంలోనే సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించడం సిగ్గుచేటన్నారు.ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఎనిమిది గంటల పనిదినాన్ని అవహేళన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాల్లో పన్నెండు గంటల పనిదినాన్ని అమలు చేస్తుందన్నారు.సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంక్, రైల్వే,ఎల్ఐసీ,రక్షణ తదితర రంగాలను ప్రైవేట్ పరం చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.దేశ ప్రజల సహజ సంపదను సంపన్నవర్గాలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.నూతన పరిశ్రమను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల సంఖ్య మరింత పెంచిందన్నారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం వలన రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు నిత్యావసర ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్నారు.ప్రజలపై భారం మోపి ప్రజలను దోపిడీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అని ప్రశ్నించారు.దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే దేశభక్తా అని ఎద్దేవా చేశారు.కార్మిక చట్టాల పరిరక్షణకై, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుట కొరకై బ్రిటిష్ సామ్రాజ వాదులకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం తాసిల్దార్ చందా సురేష్ కు మెమొరండం ఇవ్వనైనది.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు చాగంటి కిషన్,దాసరిలింగస్వామి,బట్ట మేకల రాజు,మిట్ట గడపుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.