దారి దోపిడి కేసును చేదించిన జహీరాబాద్ పోలీసులు..
• సుమారు 4.70 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాధీనం, నిందితుల రిమాండ్..
• కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
పరితోష్ పంకజ్ ఐపీఎస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా వివరాల్లోనికి వెళితే: తేదీ 22.01.2026 నాడు సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఫిర్యాది ఆదర్శనగర్ కాలనీలో గల తన ఇంటికి వెళ్తుండగా పల్సర్ బైక్ పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించే ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగిలించుకుని వెళ్లారని జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారి ఆదేశానుసారం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసి కేసు చేదించడానికి ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా ఈ రోజు తేదీ 30.01.2026 నాడు ఉదయం అందాజ 7 గంటల సమయంలో జహీరాబాద్ పట్టణంలో అల్గోల్ చౌరస్తా వద్ద గల మెహెఫీల్ హోటల్ వద్ద ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పైన సంగారెడ్డి వైపు నుండి వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించగా ఆదర్శనగర్ కాలనీలో దారి దోపిడీకి పాల్పడినది తామేనాని అంగీకరించారు. నిందితుల నుండి 2.5 తులాల పూసతెల తాడు, 2-కత్తులు, 1-పల్సర్ బైక్ స్వాదినం చేసుకొని జుడీషియల్ రిమాండుకు తరలించడం జరిగింది.
నిందితుల వివరాలు: 1) ఆయాజ్ తండ్రి ఆబేద్, వయస్సు 24 సం., వృత్తి: డ్రైవర్, గౌతం నగర్, పటాన్ చెర్వు. 2) మహ్మద్ నిజాం, వయస్సు 31 సం., వృత్తి కులీ పని, వేంకటేశ్వర కాలనీ పటాన్ చెర్వు. (ఇరువురు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు)
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానం, సిసి టీవీల ఆదారంగా నిందితులను ఛేదించడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలు సిసి టీవీల ప్రాధాన్యతను గుర్తించి, సిసిటీవి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందిని అభినందించి, రివార్డ్ లకు ప్రపోసల్ పంపించడం జరుగుతుంది అన్నారు.
