నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు
-బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు
మొగులపల్లి నేటి ధాత్రి:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కళకళలాడిన గ్రామపంచాయతీలు..ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు ఆరోపించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాలక వర్గాలు లేక పాలన పడకేసిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువై గ్రామాలు సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో..నిర్వహణ భారం మోయలేక పంచాయతీ కార్యదర్శులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ట్రాక్టర్లను కొనుగోలు చేయించిందని, పారిశుద్ధ్య నిర్వహణకు, ఇతర పనులకు వాహనం తప్పనిసరి కావడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులకు తప్పడం లేదన్నారు. రుణం పై వాహనాలను కొనుగోలు చేయడంతో..ప్రతి మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో డీజిల్ కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సిబ్బంది తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధులు రాకపోవడం..వసూలు చేసిన పన్నులు సరిపోకపోవడంతో పారిశుద్ధ్య, మంచినీటి నిర్వహణ, ట్రాక్టర్ ఇతర వాటికోసం తప్పనిసరిగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు తనతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారని, ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో..బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన డబ్బులను ఎలా తీసుకోవాలన్న ఆందోళన కార్యదర్శుల్లో నెలకొందన్నారు.