నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ,అభ్యర్థుల తుది జాబితా తయారీ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ సంపత్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలని,నిర్దేశిత సమయంలోగా ప్రక్రియ పూర్తి చేసి నిబంధనల ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలని అధికారులకు సూచించారు.నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సి సి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోగ్రఫీ చేయడం జరిగిందని తెలిపారు.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్,12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులను సందర్శించి వంటశాల,ఇతర పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు.తదనంతరం కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పాఠశాలలు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని,వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.పాఠశాలకు మంజూరైన భోజనశాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మండలంలోని రేగులగూడ గ్రామంలో గల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాలకు మంజూరైన అదనపు గదుల నిర్మాణ ప్రక్రియను పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
