Will New Leaders Revive Market Project?
కొత్త పాలకవర్గం పాత పనులపై దృష్టి పెడుతుందో లేదో..?
నిలిచిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులపై కొత్త చైర్మెన్ దృష్టి పెడతారా…?
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఆదివారం సంత సమీపంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం సుమారు 7.50 కోట్ల నిధులను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేటాయించి పనులను కూడా ప్రారంభింప చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులను నిలిపివేశారు. నిధులు లేవని సాకు చూపిస్తూ పనులను అర్ధాంతరంగా ఆపించేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ,మొదటి అంతస్తు కు కూడా స్లాబ్ పడింది, దాదాపు సగం పనులు పూర్తయ్యాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో నూతనంగా బిఆర్ఎస్, సీపీఐ కూటమి పాలకవర్గం ఏర్పాటు కాగా గత ప్రభుత్వంలో మంజూరైన నిధులతో నిలిచిన ఈ మార్కెట్ పనులను పూర్తి చేయిస్తారో? లేదో అని పుర ప్రజలు గుసగుసలాడుతున్నారు. చైర్మెన్,వైస్ చైర్మన్ పీఠాల కోసం ప్రజలు స్పష్టమైన మెజారిటీని కూటమికి కట్టబెట్టిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులన్నీ మళ్లీ ప్రారంభించేలా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి పై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారో లేదో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయించి, తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.చూడాలి మరి కొత్త పాలక వర్గం ఏం చేస్తుందో అని.
