నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన హరీశ్ రావు హాట్ కామెంట్స్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సదర్భంగా రైతులతో పాటు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘x’ (ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటన ఉన్న ప్రతిసారి ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. మొన్న నాగర్కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.నేడు జహీరాబాద్లో రైతులను, రైతు నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం అది ఎలా ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ హక్కును హరించడం దుర్మార్గమని.. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు, డీజీపీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.