టికెట్ పై ఓ రేటు వసూలు చేసేది ఓ రేటు..
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
పెద్దపల్లి జిల్లా లోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సమ్మక్క సరక్క జాతర ఉన్నందున భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది ఆలయంలో నిలువు దోపిడీ చేస్తున్నారు.ఆలయంలో స్పెషల్ దర్శనం అని 50 రూ బోర్డ్ పెట్టి ప్రత్యేక దర్శనం అని100రూ తీసుకుంటున్నారని, మదన పోచమ్మ ఆలయం వద్ద బోనం చిట్టి 10 రూపాయలకు బదులు 50 వసూలు చేస్తున్నారని,అదే విధంగా టికెట్ తీసుకున్నా పట్నం మీద 300 నుండి 500 రూ పెట్టేదాక పట్నం వేయడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా జాతరకు వచ్చే వాహనాల కు పార్కింగ్ కు సరైన ప్లేస్ లేకున్నా పార్కింగ్ పేరిట వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఇలా సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.ఆలయంలో ఫ్యాన్ లేక ఉడుకపోతకు గురువుతున్నామన్నారు.భక్తులు ఆలయ అధికారులను సమాచారం అడగాలంటే కనీస హెల్ఫ్ లైన్ నంబర్ లు కూడా కనబడక పోవడం తో భక్తులు అయోమయానికి గురవుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
