మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కలిసిన-వెలిచాల
నేడు కరీంనగర్ కు వెలిచాల
ఘన స్వాగతం, ర్యాలీకి
పెద్ద ఎత్తున ఏర్పాట్లు
కరీంనగర్, నేటిధాత్రి:
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రులు రాజేందర్ రావును శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజేందర్ రావు మంత్రులను శాలువాలతో సన్మానించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరింత కష్టపడి పనిచేయాలనీ, కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రాజేందర్ రావుకు సూచించారు. కరీంనగర్లో వార్డు వార్డునా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో సమస్యల పరిష్కారానికి రాజేందర్రావు ప్రత్యేక దృష్టి పెట్టాలని నిధుల మంజూరుకు సంబంధించి కృషి చేస్తామన్నారు. అందరం కలిసి కరీంనగర్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేద్దామని మంత్రులు పేర్కొన్నారు. కరీంనగర్లో సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలనీ ఇందుకు అధికారులతో నిత్యం టచ్ లో ఉండాలనీ మంత్రులు వెలిచాల రాజేందర్రావుకు సూచించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాజేందర్రావు వారికి తెలిపారు. నాయకులందరితో కలిసి సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అధిష్టానం పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అంటే కరీంనగర్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామని రాజేందర్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు మొట్టమొదటిసారిగా మంగళవారం కరీంనగర్ కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచాల అభిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అల్గునూరు చౌరస్తాలో రాజేందర్రావుకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈమేరకు అలుగునూర్ చౌరస్తా నుంచి గీత భవన్ చౌరస్తా మీదుగా డిసిసి కార్యాలయం వరకు ఏర్పాట్లు చేపట్టారు. అదేవిధంగా గీత భవన్ చౌరస్తాలో స్వాగత కార్యక్రమం ఉంటుందని, కరీంనగర్ పట్టణంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు డిసిసి కార్యాలయంలో రాజేందర్రావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సన్నిహితులు, వెలిచాల అభిమానులు సర్పంచులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
