ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు
రాష్ట్రంలో నేటి నుంచి నమోదు
కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం
నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి:
ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలిపారు.కాగా రాష్ట్ర వ్యాప్త నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని అని మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏ.డీ.ఏ మాట్లాడుతూ రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన, పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోందని వాటికి సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించిందని ఏడీఏ వివరించారు.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయని, రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదని దీంతో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారిందని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.కాగా ప్రక్రియ పట్ల మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు శిక్షణ ఇచ్చిందన్నారు.
విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు వ్యవసాయ శాఖ..

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కోసం భూయాజమాన్య పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్తో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.కాగా ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని ఏడీఏ దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు..
రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు..రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొందని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలియజేశారు.