ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
బీ.అర్.ఎస్వీ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్
పాలకుర్తి నేటిధాత్రి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావు ఆధ్వర్యంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నదని, ఈ అవకాశాన్ని యువత, విద్యార్థి లోకం సద్వినియోగం చేసుకోవాలని బీ.అర్.ఎస్వీ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన ధ్యేయంగా (20 సెప్టెంబర్ 2023) బుధవారం ఉదయం పాలకుర్తి మండల కేంద్రములో బృందావన్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ మేళా లో 82 మల్టీ నేషనల్ కంపెనీలు, ఇతర కంపెనీలు పాల్గొని నైపుణ్యతను పరీక్షించి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని అన్నారు. గతంలో కూడ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరు లో మెగా జాబ్ మేళా ను నిర్వహించి 4000 ల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , చైర్మన్ ఉషా దయాకర్ రావుదని అన్నారు. అనేక మంది విద్యార్థి, యువత కు ట్రస్ట్ ద్వారా సొంత ఖర్చులతో పై చదువులు చదివిస్తూ, పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ తరహా కోచింగ్ ను గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువత కు చేరువ చేశారన్నారు. కావున విద్యార్థి, యువత రేపటి మెగా జాబ్ మేళా లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థి నాయకులు జలగం అశోక్, కొడం సాయిరాం, జోగు కృష్ణ, రొడ్డ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.