32 Marriages for Two Men – A Unique Village Tradition
ఇద్దరు వ్యక్తులకు 32 సార్లు పెళ్లి..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సాధారణంగా పెళ్లి అంటే స్త్రీ, పురుషులకు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కానీ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో మాత్రం ఒక వింత ఆచారం కొనసాగుతోంది. 1994 నుంచి గత 32 సంవత్సరాలుగా ఎల్లమ్మ నాటకం అనే వీధి నాటకాన్ని ప్రతి సంవత్సరం గ్రామంలో ప్రదర్శిస్తున్నారు. గ్రామ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నాటకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నాటకం ప్రదర్శించే సమయంలో ఎల్లమ్మ – జమదగ్ని పాత్రలను పోషించే ఇద్దరు వ్యక్తులకు శాస్త్రోక్తంగా పెళ్లిని జరిపించడం ఈ నాటకంలోని ప్రత్యేకత. గ్రామానికి చెందిన గొల్ల యాదయ్య, బసయ్య స్వామి ఈ పాత్రలను పోషిస్తూ పెళ్లి కార్యక్రమాన్ని నిజమైన వివాహం మాదిరిగా అన్ని తంతులతో నిర్వహిస్తారు. పెళ్లిలో జరిగే జిలకర బెల్లం, బంగారు తాళి కట్టడం, కాళ్ల మెట్టెలు పెట్టడం, అక్షింతలు, తలంబ్రాలు, అప్పగింతలు, బాజాలు వంటి ప్రతి తంతును పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ నాటకాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు ఆశ్చర్యపోతారు. నాటకం ముగిసిన అనంతరం పెళ్లిలో ఉపయోగించిన తాళి, మెట్టెలు వంటి వస్తువులను ఆలయ అభివృద్ధికి వినియోగిస్తారు. నాటక ప్రదర్శనలో ఎల్లమ్మ పాత్ర పోషించిన వ్యక్తి వారం రోజుల పాటు తాళి, కాళ్ల మెట్టెలను అలాగే ధరించి ఉంటాడు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఎల్లమ్మ నాటకానికి గ్రామస్థులలోనూ, భక్తులలోనూ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సంవత్సరం ఈ నాటకాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు రాత్రి వేళల్లో భారీగా తరలి వస్తున్నారు.
