కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు
మందమర్రి నేటి ధాత్రి
సింగరేణి కాంట్రాక్టర్ దివంగత కోనేరు వీరభద్ర రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వీరభద్ర రావు(కోనేరు) ట్రాన్స్ పోర్ట్ పేరుతో సుపరిచితుడైన కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు హాజరై, వీరభద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరభద్రరావుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్ర రావుకు సింగరేణి తో విడదీయరాని బంధం కలదని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
వీరభద్ర రావు సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా మందమర్రి పట్టణం తోపాటు సింగరేణి వ్యాప్తంగా మంచి పేరు గడించారని తెలిపారు. అప్పట్లో కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ అంటే సింగరేణి వ్యాప్తంగా వీరభద్ర రావు ట్రాన్స్ పోర్ట్ కు మంచి పేరు కలదన్నారు. పట్టణంలోని ఎంతో మందికి తన ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు తన లాగే కోల్ ట్రాన్స్ పోర్ట్ లో రాణించాలనే అనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం తోపాటు, వారికి వెన్నుదన్నుగా నిలిచి, సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి వెంకటరమణమ్మ, కుమారుడు కోనేరు ప్రసాద్ బాబు, మనవళ్లు డాక్టర్ ఫణికుమార్, కృష్ణకాంత్, వికాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
