అన్నదాతల పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ నేడే…
– వ్యవసాయ పనులకు శుభారంభం….
– రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముత్యం ప్రవీణ్ కుమార్….
కొల్చారం, (మెదక్):- నేటి ధాత్రి
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే… వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలండర్ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
– వ్యవసాయ పనిముట్లకు పూజలు…

ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకుంటారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.
– రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్….
కొల్చారం మండలం రైతులకు కొల్చారం మండలం సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.