కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలో
పెద్దపులి సంచరిస్తుంది.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు. ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెద్దపులి రావడంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఉండేందుకు స్ధానిక అటవీ శివారు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.