Sheikh Rabbani Criticizes Kaushik Reddy's Controversial Remarks
ఆ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టాయన్న మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
◆-: కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ ఎమ్మెల్యే నుంచి ఇలాంటి వ్యాఖ్యలు శోచనీయమని వ్యాఖ్య
◆-: బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలపై ఆలోచన చేయాలని సూచన
జహీరాబాద్ నేటి ధాత్రి:
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మజ్లిస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బయటపెట్టాయని అన్నారు.మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ఆయనను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుందని చురక అంటించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్లో ఉంటూ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా చేశారని గుర్తు చేశారు.
