చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ నవత ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యునాని వైద్యుడు డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ సంధ్య, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నవత మాట్లాడుతూ తలసేమియా అనేది వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలో తగినంత హీమోగ్లోబిన్ ఉత్పత్తి కాక రక్తహీనత సమస్య తలెత్తుతుందని వివరించారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని, సమయానికి గుర్తించకపోతే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.
తలసేమియా నివారణలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం, గర్భిణీలు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చని అవగాహన కల్పించారు. అలాగే తలసేమియా బాధితులకు తరచుగా రక్తం అవసరమవుతుందని తెలియజేస్తూ రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో ప్రజలకు తలసేమియా లక్షణాలు, చికిత్స విధానాలు, పోషకాహారం అవసరం, ఆరోగ్య పరిరక్షణ చర్యలపై విపులంగా వివరించారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
