కుమ్ములాటలు…కొట్లాటలు

`గతిశీలత లేని గ్రాండ్‌ ఓల్ట్‌ పార్టీ

`పేరుకే పార్టీ ప్రక్షాళన

`‘ఎంపిక’లు తప్ప ‘ఎన్నికలు’ లేవు

`కొన్ని రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తి

`కానీ పారదర్శకత ఏదీ?

`పేరుకే రాష్ట్ర అధ్యక్షులకు స్వేచ్ఛ

`కొనసాగుతున్న అధినాయకత్వ జోక్యం

`ప్రభావం చూపని రాహుల్‌ నాయకత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో ‘నైతిక’ విజయం సాధించానని చెప్పుకుంటున్న నేపథ్యంలో, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునివ్వడంలో అర్థముంది. పార్టీని కింది స్థాయినుంచి పునర్‌నిర్మాణం చేసుకుంటూ వస్తే రాబోయే ఎన్నికల్లో కొత్త అన్ని స్థాయిల్లో కొత్త నాయకత్వం మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని విజయపథంలో పయనింపజేస్తారన్న ఆయన ఆలోచన సముచితమే. కానీ ఇప్పటికే ఫ్యాక్షనిజం, బలహీన నాయకత్వం, గొంతెమ్మ కోర్కెల తో నెత్తినెక్కి సవారీ చేస్తున్న సహచర పార్టీలు వంటి సమస్యలతో కునారిల్లుతున్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఎంతమేర రాహుల్‌ గాంధీ ఆశయ సాధన దిశగా ఎంతవరకు ముందుకెళ్లగలుగుతుందనే ది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

గత దశాబ్దకాలంగా పరిశీలిస్తే జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతూవచ్చిందే తప్ప ఏమాత్రం పురోగతి కనిపించలేదు. బలమైన నాయకత్వలేమి బాగా దెబ్బతీస్తున్నదన్నసంగతి పార్టీ సీనియర్‌ నాయకులకు బాగా తెలిసినప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి బలహీనంగా వున్నదన్న సంగతి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం 44 స్థానాల్లో గెలిచిన పార్టీ, 2019లో 52 స్థానాలు, 2024లో 99 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. ఈవిధంగా 99 సీట్ల గెలుపును నైతిక విజయంగా కాంగ్రెస్‌ భావిస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం లో ఇంకా పూర్తి జ్ఞానబోధ కలగలేదన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. ఇందుకు గొప్ప ఉదాహరణ హర్యానా. మితిమీరిన ఆత్మవిశ్వాసం పార్టీ కొంపముంచింది. ప్రత్యర్థి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడానికి పార్టీ స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణం. ఇక మహారాష్ట్రలో పార్టీ ఓటమి పాలవడం, ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌ కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడానికి ఇష్టపడకపోవడం వంటివి పార్టీకి కోలుకోలేని దెబ్బలుగా చెప్పక తప్పదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రక్షాళన చేపట్టి, 2024, డిసెంబర్‌ 5న రాష్ట్రంలోని అన్ని కాంగ్రెస్‌ కమిటీలను పూర్తిగా రద్దుచేసింది.  

అహమ్మదాబాద్‌ పార్టీ సమావేశంలో తీర్మానించిన మేరకు 2025 ఏప్రిల్‌ నెలలో సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ (ఎస్‌ఎస్‌బి) పేరుతో అధికారికంగా పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రక్రియ 2024 డిసెంబర్‌లోనే ప్రారంభం కావడం గమనార్హం. ఈ పక్రియలో భాగంగా 2025 జనవవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాలకు పార్టీ అధ్యక్షులతో సహా 133 పార్టీ నిర్వాహకులను నియమించింది. వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో సిటీ యూనిట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అనుకున్న తడవుగా కేవలం రెండు నెలల కాలంలో యు.పి.లో ఈ ప్రక్రియను కాంగ్రెస్‌ పూర్తిచేయగా, అన్ని విషయాల్లో ముందుటామని చెప్పుకునే భాజపా ఈవిషయంలో రాష్ట్రంలో వెనుబడి వుండటం గమనార్హం. నిజానికి బీజేపీ 2024లో డిసెంబర్‌లోనే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. బూత్‌ లెవెల్‌, మండలస్థాయి నాయక త్వాల ఎన్నికలు పూర్తయ్యాయి కానీ, జిల్లాస్థాయి నాయకత్వ ఎన్నికల ప్రక్రియ జనవరి నెలాఖరుకు పూర్తి కాలేదు. అయితే మార్చి నెలాఖరుకు మొత్తం 98 సంస్థాగత జిల్లా అధ్యక్షుల్లో 70 మంది ఎన్నికను పూర్తిచేసింది. ఇంకా 28 మంది ఎన్నిక పూర్తికావాల్సి వుంది. దీన్ని పరిశీలిస్తే జిల్లాఅధ్యక్షుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ వేగంగా మరింత సమర్థవంతంగా పనిచేసిందనే చెప్పాలి. అయితే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో రెండు పార్టీల మధ్య ఒక ప్రధానమైన తేడాను గుర్తించవచ్చు. కాంగ్రెస్‌ నేరుగా జిల్లా అధ్యక్షులను నియమిస్తే, భాజపా మాత్రం బూత్‌ స్థాయి, మండలస్థాయి నాయకత్వ ఎన్నికలు పూర్తిచేసిన తర్వాతనే జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ చేపడుతుండటం. ఇక యు.పి.లో కాంగ్రెస్‌ చివరిసారి అధికారంలో వున్నది 1985 కాగా, భాజపా అధికార ప్రస్థానం 2017 నుంచి మొదలైంది. 

కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి కాదు

హిందీ బెల్ట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునర్‌నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాజయం (మొట్టమొదటిసారి అతితక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది) తర్వాత రాహుల్‌ గాంధీ పార్టీ సంస్థాగత పునర్‌నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని భావించారు. అంతేకాదు జిల్లా, రాష్ట్ర యూనిట్లకు మరిన్ని అధికారాలు, ఇస్తామని కూడా వాగ్దానం చేశారు. మరి ఈ మార్పులకు సంబంధించి ఇచ్చిన హామీ,హమీగానే మిగిలిపో యింది. యధావిధిగా కాంగ్రెస్‌ సంస్కృతికి అనుగుణంగా ఎన్నికలు లాంఛనప్రాయంగా ముగియడంతో హిందీ బెల్ట్‌లోని దాదాపు అన్ని పార్టీ యూనిట్లు క్రియారహితంగా మిగిలిపోయాయి. అ ప్పటినుంచి కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీని క్షేత్రస్థాయినుంచి బలోపేతం చేసే యత్నాలు ఇంతవరకుచేపట్టలేదు. కాకపోతే నాయకత్వ స్థాయిలో కొన్ని మార్పులు చేపట్టిన మాట వాస్తవం. సచిన్‌పైలెల్‌, మిలింద్‌ దియోరా, జితిన్‌ప్రసాద్‌ వంటి యువనాయకులను కీలక కమిటీల్లోకి తీసుకోవడం మరియు 2019 ఓటమి తర్వాత రాహుల్‌ గాంధీని పార్టీ ప్రెసిడెంట్‌గా రిజిస్ట్రేషన్‌ చేయడం మినహా పార్టీ నాయకత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమాలేవీ లేవు. 2022 మే నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన నవచింతన్‌ శిబిరంలో పార్టీని ప్రజల్లోకి ప్రభావశీలకంగా తీసుకెళ్లేందుకుగట్టి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించిన మేరకు, భారత్‌ జోడో యాత్రకు రాహుల్‌ గాంధీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, తాము అధికారంలోకి వస్తేకులగణన చేపడతామంటూ హామీ ఇవ్వడం గమనార్హం. ఇదే శిబిరంలో పార్టీ అంతర్గ నిర్మాణ ప్ర క్రియను మరింత సుస్థిరం చేయాలని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలకుఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినా ఇప్పటివరకు అటువంటిదేమీ జరగకపోవడం గమనార్హం. మొత్తంమీద చెప్పాలంటే సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ ఏమాత్రం జరగలేదన్నది కఠిన వాస్తవం. 

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను మరింత బలోపేతం చేయాలని గత ఏప్రిల్‌లో జరిగిన అహమ్మదాబాద్‌ సదస్సులో పార్టీ నాయకత్వం నిర్ణయించింది. జూన్‌ 3వ తేదీన రాహుల్‌ గాంధీ భోపాల్‌లో పర్యటించినప్పుడు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు అగ్రనాయకత్వంతో ప్రత్యక్ష సంబంధాలుంటాయని హామీ ఇచ్చారు. అంతేకాదు స్థానికంగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తించే స్వేచ్ఛను దిగువస్తాయి నాయకత్వానికి అప్పగిస్తామని, వీరి కార్యకలాపాల్లో అధిష్టానం జోక్యం చేసుకోదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేవలం వివాదం ఏర్పడినప్పుడు మాత్రమే అధిష్టానం కలుగజేసుకుం టుందన్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జితు పట్వారీ మాట్లాడుతూ బ్లాక్‌ మరియు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ప్రజల ఆమోదంమేరకే నియమిస్తాం తప్ప, కొందరు నాయకులు ఎంపిక చేసినవారిని నియమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. టిక్కెట్ల పంపిణీ మరి యు దిగువ స్థాయి కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మరి ఇటువంటి నియామకాలు నిష్పాక్షిక రీతిలో జరిగేందుకు కాంగ్రెస్‌ జిల్లా స్థాయిలో ఐదుగురు పరిశీలకును నియమిస్తుంది. ఇప్పటివరకు కుటుంబపాలనకు అలవాటు పడిన పార్టీకి ఈ రకమైన ఏర్పాట్లు చాలా అవసరం కూడా! ఇదే సమయంలో నియామకా లు జరిపే సమయంలో కాంగ్రెస్‌ కులాలను పరిగణలోకి తీసుకోవడం మారో సానుకూల పరిణామం. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయి నాయకత్వ ఎంపికలో పార్టీ కులాలు, వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. ముఖ్యంగా బీసీలు, ఎస్సీ వర్గాలకు చెందినవారిని ఎక్కువమందిని నియమించడం ఇక్కడ కీలకం.

ఇప్పటివరకు సాధించేమిటి?

సంస్థాగత పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానం పార్టీ పరంగా అభిలషణీయమే అయినప్పటికీ, దీన్ని చిత్తశుద్ధితో అమలు జరిపింది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే. మిగిలినరాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచని సమస్యలు యధాతథంగా వుండటం గమనార్హం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో జిల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్‌ నియమించినప్పటికీ, బూత్‌, బ్లాక్‌, మండలస్థాయి నాయకత్వ ఎంపిక చేపట్టలేదు. జిల్లా కమిటీల కార్యవర్గాల ఎన్నిక కూడా పెండిరగ్‌లోనే కొనసాగుతోంది.ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ మరియు హర్యానా రాష్ట్రాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియకు పరిశీలకుల నియామకం పూర్తవడ మే కాదు ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఎన్నిక ప్రక్రియలో తీవ్ర అసంతృప్తిలో వున్న నాయకులకు పోస్టులు ఇవ్వడం శుభ పరిణామం. ఇటువంటి నాయకులు చాలా సంవత్సరాలుగా క్రియాశీలకంగా లేకపోవడం పార్టీని బాగా దెబ్బతీసింది. ఇదిలావుండగా ఇప్పటివరకు హర్యానాలో చాలా జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు వారి పేర్లను అధికారికంగా వెల్లడిరచలేదు. ఇక మధ్య ప్రదేశ్‌లో ప్యానల్‌ ఎంపిక తుదిదశలో కొనసాగుతోంది. 

ఎన్నికలు జరపాలి, పారదర్శకంగా ప్రక్రియను కొనసాగించాలని ఎంతగా చెబుతున్నా, చాలా ప్రాంతాల్లో జిల్లా/బ్లాక్‌ అధ్యక్షులను ఎంపిక చేయడం మాత్రమే జరుగుతోంది. ఇదంతా ఎప్పటి మాదిరిగానే పారదర్శక రహితంగా, కొందరు నేతల నిర్ణయాల ప్రకారం జరుగుతుండటంతో మళ్లీ పార్టీలో అసంతృప్తులు యథాతథంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు గతంలో రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చిన విధంగా, కొత్త జిల్లా నాయకత్వానికి కేంద్రనాయకత్వంతో సంబంధాలు ఏర్పడటంలేదు. ఉదాహరణకు యు.పి.లో కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులతో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వర్చువల్‌గా సమావేశమయ్యారు. అదే ఉత్తరప్రదేశ్‌నుంచే పార్లమెంట్‌కు ఎన్నికైన రాహుల్‌ గాంధీ వీరితో ముచ్చటించలేదు. అయితే యు.పి. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షు డు అజయ్‌రాయ్‌ బహిరంగ కార్యక్రమాలు, సభల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈవిధంగా రాష్ట్రంలో పార్టీకి తానే చోదకశక్తి అని తెలియజెప్పేవిధంగా ఆయన కార్యక్రమాలు కొనసాగుతుండటం గమనార్హం. గుజరాత్‌లోని పార్టీ నాయకత్వం ఇదే విధమైన వ్యవహారశైలితో ముందుకెళుతోంది. అయితే జిల్లా అధ్యక్షులను ఎంపికే చేసే పరిశీలకుల బృందాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, గుజరాత్‌ ఇన్‌చార్జ్‌ ముకుల్‌ వాసిక్‌లు కలవడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే వికేం ద్రీకరణ పార్టీలో చెప్పడానికి మాత్రమే పరిమితమన్న సత్యం మరోసారి వెల్లడైంది. 

జూన్‌ 3, 4 తేదీల్లో రాహుల్‌ గాంధీ భోపాల్‌, చండీగఢ్‌ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యన మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన పరిశీలకులను కలుసుకున్నారు. ఈ పరిశీలకులే జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తారు. కానీ రాహుల్‌ గాంధీ పర్యటన హర్యానాపై పెద్దగా ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఇదిలావుండగా బిహార్‌లో వచ్చే ఆక్టోబర్‌ానవంబర్‌లో ఎన్నిక లు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఈ నియామకాలు అత్యవసరం కానీ ఈ దిశగా పార్టీ నాయక త్వం ఇప్పటివరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఇక రాజస్థాన్‌ వంటి మరికొన్ని రాష్ట్రాలో పీసీసీలు పాత పద్ధతినే అనుసరిస్తూ నియామకాలను జరుపుతున్నాయి. ము ఖ్యంగా రాజస్థాన్‌లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఈవిధంగా ముందుకు పోతున్నది. 

ఎన్నికల ప్రక్రియ అంటూ కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించినా అందులో పూర్తిస్థాయిలో చిత్తశుద్ధి కనిపించడంలేదు. ఫలితంగా ఎన్నికల ప్రక్రియే ఒక ప్రహసనంగా మారుతోంది. ఇందుకు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా కారణమని చెప్పాలి. కుటుంబ పాలన, ఏకపక్షనిర్ణయాలకు అలవాటు పడిన కాంగ్రెస్‌ సంస్కృతికి ఈ ఎన్నికల ప్రక్రియ ఎంతమాత్రం పొసిగేది కాదని వివిధ రాష్ట్రాల సంస్థాగత పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!