కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని శ్రామిక భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరైనారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు
కూలి పెంచాలి భూమి లేని వారికి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి అన్నారు. వృషలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో భూమిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి వస్తుంది అని అన్నారు. భూమి పంచటం వలన ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. భూమి పంచడం వలన ప్రజలు తమ అవసరాలు వారే తీర్చుకుంటారని అన్నారు. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్ కంటే ముందురోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్ అడ్వైజర్గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, రాజలింగు, కోడం శంకర్, ఆర్ రమా, అశోక్, రాజమణి, వావిళ్ళ రమ, తదితరులు పాల్గొన్నారు.