దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి..
చిత్తూరు జిల్లా..
పలమనేరు(నేటి ధాత్రి)ఫిబ్రవరి 06:
తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం మఠం గ్రామం వద్ద దళిత మాజీ సర్పంచ్ వెంకటయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచిన పెత్తందారి సుదర్శన్ కుటుంబికులను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి,మునిరత్నం డిమాండ్ చేశారు. అందులో భాగంగా గురువారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయము నందు అధ్యక్షులు డి,సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సంఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు సోమశేఖర్, మహిళా నాయకురాలు సరస్వతి మాట్లాడుతూ రోజురోజుకు దళితులపైన , మహిళలు, చిన్నారులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని వాటిని నివారించడంలో ప్రభుత్వాలు, అధికారులు పూర్తిగా విఫలమైనారనడానికి దళితుల పైన జరుగుతున్న దాడులే నిదర్శనం అన్నారు.కేవీబి పురం మండలం, మఠం గ్రామం వద్ద దళిత వెంకటయ్యకు ఎంఏ రాజుల కండ్రిక రెవెన్యూ దాఖలాలో సర్వే నెంబర్ 428/2లో 1.39 సెంట్లు వ్యవసాయ భూమి ఉందని ,సదరు భూమి పక్కనే ఉన్న పెత్తందారి సుదర్శన్ ఎలాగైనా వెంకటయ్య భూమిని కాజేయాలనే కుట్రతో గత కొంతకాలంగా వెంకటయ్యతో సుదర్శన్ గొడవలు పడుతున్నాడని తెలిపారు.గుర్రం.సుబ్రమణ్యం మాట్లాడుతూ పెత్తందారి సుదర్శన్ దౌర్జన్యాలను తట్టుకోలేక దళిత వెంకటయ్య భూమికి సంబంధించి కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా సుదర్శన్ ఆగడాలు ఆగకపోవడంతో విధి లేక మండల తహసిల్దార్ కు మొరపెట్టుకున్నాడనే కుట్రతో మరల పెత్తందారి సుదర్శన్ దళిత దంపతులపై దాడికి పూనుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడికి పాల్పడిన పెత్తందారిని కుటుంబీకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామల, రాజా, ఆనంద్, గంగప్ప, బుజ్జి, శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..