గులాబీ దండు కదం తొక్కాలి..!
కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి..!!ఎంపీ “వద్దిరాజు”
“నేటిధాత్రి”,ఇల్లెందు, ఏప్రిల్, 15:
వరంగల్ లో జరిగే సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి.. తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షే అని గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు.

బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అద్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.