తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది
– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకున్నారని అన్నారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పక్షాన నిలబడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ టీఆర్ఎస్ పార్టీదో లేక బీఆర్ఎస్ పార్టీదో కేసీఆర్ స్పష్టత ఇచ్చి వరంగల్ కు వెళ్లాలని కేకే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా స్పష్టత ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ, బావమరుదులు నాడు కుర్చీ కోసం నేడు పార్టీ కోసం కుస్తీ పడుతున్నారని, హరీష్ రావుకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతే పడుతుందని కేకే జోష్యం చెప్పారు. వరంగల్ సభలో పార్టీలో హరీష్ రావు స్థానం ఏంటో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని, కుర్చీల కొట్లాటలో హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బయటకు రావడం ఖాయమన్నారు. తెలంగాణను నయవంచన చేసిన వాళ్లే ఆ పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అది బీఆర్ఎస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో తెలియదన్నారు. సంపాదించిన అవినీతి సొమ్ముతో రజతోత్సవ సభకు ప్రజలను తరలిస్తున్నారని, సభకు వచ్చేవారు కదిలివచ్చే జనం కాదని, కదిలిస్తే వచ్చే జనం అని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు యేళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాసు, శ్రీనివాస్ రవి, మహిళా నాయకురాలు కల్లూరు చందన, వనిత తదితరులు పాల్గొన్నారు.