తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో.. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను విసిరిపడేశారు. అంతేకాకుండా, అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పిచ్చి వేశాలు వేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. బారికేడ్లు తొలగింపుపై మండిపడిన డీఎస్పీ అంబటిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా.. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. సత్తెన్నపల్లి పట్నంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి అంబటి హల్చల్ చేశారు. బారికేడ్లను ఎత్తివేసి వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.