Price Rise Hits Common People
ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం దుర్భరం
సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి)
రాష్ట్రంలో సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు కష్టతరంగా మారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో “ఏమి తినే తట్టులేదు, ఏమి కొనేటట్టు లేదు” అనే పరిస్థితి నెలకొంది. ఉదయం తాగే పాల ప్యాకెట్ నుండి రాత్రి తినే అన్నం వరకు ప్రతిదీ అధిక ధరలకు అందుబాటులోకి రావడం పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయిల్–అమెరికా మధ్య యుద్ధం ఉద్రిక్తతలను కారణంగా చూపిస్తూ కొందరు దళారీ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ కొందరు వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరోవైపు, మార్కెట్లో లభిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగినట్టు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. సరైన ఆహారం కొనలేని పరిస్థితి ఒకవైపు ఉంటే, లభిస్తున్న ఆహారం కూడా నాణ్యతలేని దానిగా మారడం మరోవైపు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దళారీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం, మార్కెట్ ధరలపై పర్యవేక్షణ పెంచడం, నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే సామాన్యుడి జీవితం మరింత దుర్భరమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
