జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,రమేష్
కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు కృషి చేయలేదు.మరోపక్క విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఏఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది.కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.