ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటిధాత్రి గార్ల :-

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది. ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ. ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు. పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు. మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు. ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version