131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే
మహిళల హక్కుల పేరుతో రాజకీయ ఎత్తుగడలు విఫలం
ఏఐఎఫ్బిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ వ్యాఖ్యలు
నర్సంపేట,నేటిధాత్రి:
131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతిస్తూ, దీనిని ప్రజాస్వామ్య శక్తుల విజయంగా అభివర్ణించవచ్చని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యురాలు జన్ను విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వాస్తవానికి మహిళల సాధికారత కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిందని విమర్శించారు.ముఖ్యంగా ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అనుసంధానం చేయడం ద్వారా మహిళల హక్కుల అమలులో అనవసరమైన ఆలస్యం సృష్టించబడిందని పేర్కొన్నారు. బిల్లు వీగిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, మహిళల పేరుతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బహిర్గతమయ్యాయని అన్నారు.
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస, అసమానతలు, ఆర్థిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో మహిళలకు తక్షణ రాజకీయ ప్రతినిధిత్వం అవసరమని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ వాటిని అమలు చేయడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ను ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలతో మహిళా హక్కులను అనుసంధానం చేయకూడదని, మహిళల సాధికారతకు స్పష్టమైన కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.మహిళల పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలను దేశ మహిళలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మహిళల పక్షాన ఉందని నిరూపించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి ఆందోళనలు, పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు మైదం పద్మ, గణిపాక బిందు, బెజ్జంకి పుష్ప, కాకి కోమల, పిట్టల పద్మ, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.
