దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న.

AIYF State AIYF State

దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమిద్దాం

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి – ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపుని స్తున్నట్లు యుగంధర్ తెలిపారు.

ఈముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కరీంనగర్ బస్టాండ్ వద్ద విడుదల చేశారు.

ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని వారు అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదని వారు అన్నారు.

భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు.

మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు.

‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ధ్వజమెత్తారు.

ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.

అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

ఈపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కనకం ప్రవీణ్, వినయ్, చరణ్, మధు, రాజేష్, కిరణ్ రాఘవేంద్ర,కుమార్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!