ముత్తారం ప్రెస్ క్లబ్ లో రైతు తీర్థాల కొమురయ్య ఆవేదన
*ముత్తారం :- నేటి ధాత్రి
పట్టాదారునికి తెలియకుండా పట్టా చేసిన తాసిల్దార్ పై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ముత్తారం ప్రెస్ క్లబ్ లో సోమవారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రైతు తీర్థాల కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముత్తారం తాసిల్దారుగా పనిచేసిన తాసిల్దార్ పుష్పలత తన కుమారుని పేరు మీద ఉన్న ఒక ఎకరం నాలుగు గంటల పట్టా భూమిని పట్టాదారుడైన తన కుమారుని కి తెలియకుండానే ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకి అక్రమంగా పట్టా చేసిందని, ఈ అక్రమ పట్టాను రద్దు చేయాలని గత ఐదు సంవత్సరాలుగా ముత్తారం రెవెన్యూ అధికారుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరు స్పందించడం లేదని కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేసి అక్రమంగా పట్టా చేసిన తాసిల్దారిపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని కొమురయ్య కోరారు. లేకుంటే రాబోయే రోజుల్లో తాసిల్దార్ ముందు అమర నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.