బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కులాలకతీతంగా, పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై ఐక్యంగా పోరాడితేనే పార్లమెంటులో బీసీ బిల్లు సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడుక్కుంటే వచ్చేది బిచ్చం..పోరాడితే సాధించుకునేది మన వాటా అని అన్నారు. బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటామన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీ బిల్లుకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతేనన్నారు. దేశంలో బీసీ వాదం బలంగా ఉందని, బీసీలు అగ్గిరాల్చితే అందరూ భయపడతారన్నారు. తమిళనాడులో దివంగత జయలలిత మాదిరిగా మనం కూడా మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. రాజ్యాంగ స్వరూపాన్ని మార్చైన మన రిజర్వేషన్లను సాధించుకోవాలని, బీసీ బిల్లు కోసం పార్లమెంట్ సభ్యులతో చర్చించాలని, బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలు, పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా మిగలవద్దన్నారు. బీసీలు బిచ్చగాళ్లు కాదు..రాజ్యాధికారం వైపు పయాణించే బ్రిలియంట్ క్యాస్ట్ అని తెలిపారు.