High-Voltage Political Battle in Kathanpalli Municipality
క్యాతన్ పల్లి పుర పోరు రసవత్తరం…
గెలిపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు…
పట్టు నిలుపుకునేందుకు ఎర్ర జెండా తో కారు దోస్తీ…
సత్తా చాటేందుకు కాంగ్రెస్ ,కమలం యత్నం..
కీలకంగా మారనున్న నిరుద్యోగ ఓటర్లు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సైతం నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీలను కైవసం చేసుకోవాలనే ఏజెండాతో ముందుకెళ్ళినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.పట్టు నిలుపుకునేందుకు గులాబీ దళం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో ఎర్రజెండాతో దోస్తీ కట్టాయి. సత్తా చాటేందుకు కాంగ్రెస్, కమలదళం ప్రయత్నాలతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు శత విధాలా ప్రయత్నాలు చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలతో రాష్ట్రస్థాయి కీలక నేతలతో ప్రచారాలు హోరెత్తించారు. మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా నిరుద్యోగ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేక ప్రజలంతా వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో సరైన అభ్యర్థులను ఎంచుకునేందుకు ఓటర్లు సైతం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో నీ ఓటర్ల నాడి ఏంటో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారనే ప్రచారం మునిసిపాలిటీలో చక్కర్లు కొడుతోంది.
హరీష్ రావు ప్రచారంతో మలుపు తిరిగిన ఓటరు నాడి..
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరేసి పట్టు నిలుపుకోవడమే ధ్యేయంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయత్నిస్తుండగా, మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎల్పి ఉపనేత తన్నీరు హరీష్ రావు రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రచారంతో ఓటరు నాడి పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళినట్లు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ లో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే మరొక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.
అధికార పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం…
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు చేపడుతుందని మునిసిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లు ప్రచారం నిర్వహించడంతో ప్రజలు ఒకింత ఆలోచించినట్లు తెలుస్తుంది. మున్సిపాలిటీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఓటర్లంతా తీర్పునివ్వాలని వారు కోరారు. మున్సిపాలిటీని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
