Collector Inspects SSC Exam Centre
టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా శనివారం వరంగల్ జిల్లాలోని నర్సంపేట జెడ్పిహెచెస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్
వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని,డీఈఓ,చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.
