యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
నడికూడ,నేటిధాత్రి:
రైతులకు యూరియాను సులభంగా,పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నుండి (31/1/2026) యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించినట్లు నడికూడ మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ తెలిపారు.ఈ బుకింగ్ యాప్ విధానము లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.ఈ యాప్ ద్వారా రైతులు తమ అవసరాలకు అనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.మక్కజొన్న,వరి సాగు చేయు రైతులు లింక్ ద్వారా మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ఆధారంగా యూరియా బుకింగ్ పూర్తి చేయాలని సూచించారు.
యూరియా బుక్ చేసుకున్న రైతులు భూమి వివరాలు, పంట వివరాల ఆధారంగా సరైన సమయంలో యూరియాను పొందవచ్చని తెలిపారు.
భూమి విస్తీర్ణాన్ని అనుసరించి 15 రోజులకు ఒకసారి మాత్రమే యూరియా బుకింగ్ చేసే విధానం అమలులో ఉంటుందని,రైతులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని నడికూడ మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ కోరారు.అలాగే రైతులు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
