ఎస్ఐఆర్ పురోగతి ప్రక్రియ ను వేగవంతం చేయాలి.
రియాజుద్దీన్.
గీసుకొండ మండల తహసిల్దార్.
గీసుగొండ నేటిధాత్రి.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహసీల్దార్ రియాజుద్దీన్ సూచించారు.
గురువారం రోజున ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ మ్యాపింగ్ పురోగతిని తహసిల్దార్ సమీక్షించారు.ఈ సందర్భంగా గీసుగొండ మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రస్తుతం 74.15 శాతం మేర పూర్తయిందని అధికారులు తెలియజేశారు.
ఈ పురోగతిని మరింత పెంచి, నిర్ణీత గడువులో 90 శాతానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి బీఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ అనుసంధానంలో భాగంగా ఓటర్లు 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని తమ పేరు, తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను పరిశీలించి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. అలాగే తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను వినియోగించుకోవాలని సూచించారు.మండలంలోని గ్రామ పెద్దలు,రాజకీయ నాయకులు,సర్పంచ్లు ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి,ప్రతి ఓటరు అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనేలా సహకరించాలని తహసీల్దార్ కోరారు.గీసుగొండ మండల ప్రజలు ఎవరికైన సందేహాలు ఉంటే తమ సంబంధిత బీఎల్ఓ లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.ప్రతి కాలనీ పెద్దలు,సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి,అనుసంధాన కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజుద్దీన్,బీఎల్ఓ సూపర్వైజర్లు మరియు బీఎల్ఓలు పాల్గొన్నారు.
