తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా… జగన్పై కొల్లు రవీంద్ర సీరియస్
జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని… కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.
కృష్ణా జిల్లా, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.
